ఎన్జీవో హోమ్ వద్ద సాక్షితో మాట్లాడుతున్న
ఔట్ సోర్సింగ్ సిబ్బంది
మహారాణిపేట: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిర్ణీత సమయంలోనే జీతాలు ఇస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇపుడు వారిని నెలల తరబడి పస్తులు పెడుతోంది. ఏకంగా 13 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం నగరంలోని ఎన్జీవో హోమ్కు వచ్చిన ఆంధప్రదేశ్ నాన్ గజిటెడ్, గజిటెడ్ ఆఫీసర్స్(ఏపీఎన్జీజీవోస్) రారష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ను బాధిత ఔట్సోర్సింగ్ సిబ్బంది కలిసి, తమకు జీతాలు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. దీంతో ఈ విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో రెండు సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జీతాల కోసం ఔట్ సోర్సింగ్ సిబ్బంది వినతులు ఇచ్చారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో సిబ్బంది కుటుంబ పోషణకు నానా కష్టాలు పడుతున్నారు.
కావాలనే ఫైల్ తొక్కిపెట్టారు?
కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్), ఆంధ్రా మెడికల్ కాలేజీ(ఏఎంసీ)లో 36 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారు. వీరికి గత ఏడాది ఏప్రిల్ నుంచి జీతాలు చెల్లించట్లేదు. దీంతో తమ కుటుంబాల జీవనం సాగించేదెలా? అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అన్ని అనుమతులూ పొందిన ఈ ఫైల్ను ఎంప్లాయిమెంట్ అధికారికి పంపకుండా కేజీహెచ్లోనే తొక్కిపెట్టారని ఆరోపిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ నుంచి అనుమతి వచ్చినా ఫైల్ కదలకుండా తొక్కిపెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


