● ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు
అమర్ విమర్శ
● రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం
పాడేరు రూరల్: రాష్ట్రంలో వంట గ్యాస్ కొరతను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అమర్ విమర్శించారు. బుధవారం ఆయన పాడేరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సమస్యతో సామాన్యులు అల్లాడుతుంటే, పాలకులు మరియు అధికారులు మాత్రం తప్పుడు ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిరోజూ రరెండు లక్షల సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. గ్యాస్ బుకింగ్ చేసుకుని నెలలు గడుస్తున్నా.. ఓటీపీలు రాకపోవడంతో లబ్ధిదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీపీ వస్తేనే గ్యాస్ అనే నిబంధన వల్ల గ్యాస్ అందక సామాన్యులు పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని అమర్ ఆరోపించారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు దీనిని అదునుగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారన్నారు. కమర్షియల్ సిలిండర్ రూ.4 వేల నుంచి రూ.5వేలకు పైనే వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించాలని, బ్లాక్ మార్కెట్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సంబంధిత కార్యాలయాల వద్ద లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అమర్ హెచ్చరించారు.


