సాక్షి, పాడేరు: మన్యం ప్రాంతంలో వాతావరణం దోబూచులాడుతోంది. ఒకే రోజులో రెండు విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పాడేరుతో పాటు సమీప ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కప్పేసింది. చల్లటి వాతావరణం వల్ల వాహనదారులు, ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. అయితే, ఉదయం 9 గంటల తర్వాత మంచు వీడి ఎండ మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపడంతో మన్యం ప్రాంతం నిప్పుల కొలిమిని తలపించింది. కొయ్యూరులో 35.1, అరకులోయలో 33.1, అనంతగిరిలో 31.2, చింతపల్లిలో 30.1, పెదబయలులో 30.3, ముంచంగిపుట్టులో 29.4, హుకుంపేటలో 29.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4గంటల నుంచి వాతావరణం చల్లబడింది.


