రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్
ముంచంగిపుట్టు: మండల కేంద్రం ముంచంగిపుట్టు నుంచి కుమడ వెళ్లే మార్గంలో రాకాసిరాయి గ్రామ సమీపంలోని కల్వర్టుపై ఓ ట్రాలీ మరమ్మతులకు గురై సోమవారం ఉదయం నిలిచిపోయింది.దీంతో ఈ మార్గంలో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. రూడకోట వారపు సంతకు వెళ్లే వ్యాపారుల వాహనాలు,ఆర్టీసీ బస్సు,ఆటోలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.ఒడిశాకు చెందిన ట్రాలీలో పెద్ద క్రేన్ తరలిస్తున్న సమయంలో ఆగిపోవడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు.కొంత మంది వాహనాలను తిప్పి వెనక్కి వెళ్లిపోయారు. కుమడ, బాబుశాల, భూసిపుట్టు, జామిగూడ, రూడకోట పంచాయతీల్లో విధులకు వెళ్లే ఉద్యోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్లారు.ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు ట్రాలీ కల్వర్టుపై ఉండిపోయింది. డ్రైవర్ రెండు గంటల పాటు శ్రమించి బాగు చేసిన తరువాత కల్వర్టుపై నుంచి ట్రాలీని తరలించడంతో వాహన రాకపోకలు యథావిధిగా సాగాయి.


