వెంకటేశ్వర్లు, ప్రభుదాస్లను శాలువాలతో
సత్కరించి, మెమెంటో ఆందజేసిన
సంఘం జిల్లా కమిటీ సభ్యులు
అనకాపల్లి: ప్రభుత్వ పింఛన్దారులకు నెల మొదటి తేదీన పింఛను జమఅవుతుందని, 30 నెలల డీఆర్ బకాయిలు సంక్రాంతి పండగ రోజున చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక నర్సింగరావుపేట ఏపీటీఎఫ్ భవనంలో ఆధివారం సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డాది జగన్నాథరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జేఏసీతో కలిసి సమస్యలు సాధనకు కృషి చేస్తున్నామని, అనకాపల్లి జిల్లాలో నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను దశలు వారిగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం జిల్లా సభ్యులు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రభుదాస్, జిల్లా కార్యదర్శి బి.ఎల్.ఎన్.శర్మ, గౌరవాధ్యక్షుడు సీహెచ్.సోమేశ్వరరావు, సీనియర్ పెన్షనర్ జి.ఎస్.ఆర్.శేషగిరిరావు, విశ్రాంత డిప్యూటీ డీఈవో కె.వి.గౌరీపతి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.


