బడి కష్టాలపై కదలిక | - | Sakshi
Sakshi News home page

బడి కష్టాలపై కదలిక

Jun 29 2025 2:40 AM | Updated on Jun 29 2025 2:40 AM

బడి క

బడి కష్టాలపై కదలిక

దేవరాపల్లి: అనంతగిరి మండల పరిధిలోని పినకోట పంచాయతీ శివారు సొలబొంగి గిరిజన విద్యార్థులు చదువుల కోసం పడుతున్న ఇబ్బందులపై అధికారుల్లో కదలిక వచ్చింది. పడవలపై, బురద రోడ్డులో ప్రమాదకర ప్రయాణం చేస్తూ చదువులు సాగించడంపై సాక్షిలో ‘ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. చిన్నారులు, వారి తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్న చిత్రం కూడా సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైంది. ఈ కథనాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించి స్థానిక విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వారి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి జి.అప్పారావునాయుడు, అల్లూరి జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ లెఫ్టినెంట్‌ డా.వి.స్వామినాయుడు, రెండు జిల్లాలకు చెందిన అధికారులతో కూడిన బృందం శనివారం అటవీ ప్రాంతం గుండా బురదమయంగా మారిన రహదారి, పొలాల గట్ల మీదుగా 5 కిలోమీటర్ల దూరం నడిచి అతి కష్టం మీద సొలబొంగి గ్రామానికి చేరుకుంది. దూరదూరంగా ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని 13 మంది విద్యార్థులు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తామరబ్బ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతుండగా మరో నలుగురు అర్ధంతరంగా చదువు మానేసినట్లు గుర్తించారు. ఈ వివరాలను అక్కడి నుండే అల్లూరి జిల్లా కలెక్టర్‌కు సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు తెలియజేశారు.

పరిష్కారానికి తక్షణ నిర్ణయాలు

అల్లూరి కలెక్టర్‌ ఆదేశాలతో ఒకటి, రెండు తరగతులు చదువుతున్న 8 మంది అక్కడే చదువుకునే విధంగా ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ (నాన్‌ రెసిడెన్షియల్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌) ఏర్పాటు చేసి విద్యా వలంటీర్‌ ద్వారా విద్యాబోధన అందిస్తామని ఏపీసీ తెలిపారు. అలాగే 3 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ఐదుగురు విద్యార్థులతోపాటు బడి మానేసిన నలుగురు విద్యార్థులను పినకోట, జీనబాడులోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ సంక్షేమ పాఠశాలలో చేర్పించనున్నట్లు తెలిపారు. వీరభద్రపేట నుంచి సొలబంగి వరకు తాత్కాలికంగా పొక్లెయిన్‌తో మట్టి రహదారి చదును చేసే పనులను గిరిజన సంక్షేమ శాఖ ఈఈ వేణుగోపాల్‌, ఏఈఈ గణేష్‌ దగ్గరుండి చేపట్టారు. అంతకు ముందు దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తామరబ్బ యూపీ స్కూల్‌ను సందర్శించారు. వీరి వెంట అనంతగిరి మండల ఏటీడబ్ల్యూవో కె.వెంకటరమణ, ఎంఈవో కె.బాలాజీ, దేవరాపల్లి మండల ఎంఈవోలు సిహెచ్‌.ఉమ, వి.ఉషారాణి, తామరబ్బ, పినకోట సర్పంచ్‌లు టోకురి రామకృష్ణ, ఎస్‌.గణేష్‌ ఉన్నారు.

మానవత్వం చాటిన డీఈవో

సొలబొంగి మారుమూల గిరిజన గ్రామంలో పర్యటించిన అనకాపల్లి డీఈవో జి.అప్పారావునాయుడు మానవత్వం చాటారు. సొలబొంగి గ్రామంలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన గమ్మెల రమణను దత్తత తీసుకున్నారు. ఉన్నత చదువులకు తాను అండగా నిలుస్తానని భరోసా కల్పించారు.

సొలబొంగి గ్రామాన్ని సందర్శించిన అల్లూరి, అనకాపల్లి జిల్లాల అధికారులు

ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్న విద్యార్థుల కష్టాలపై సాక్షి కథనాలకు స్పందన

విద్యాశాఖ మంత్రి ఆదేశంతో ఐదు కి.మీ. కాలినడకన చేరుకున్న అధికారులు

ఒకటి, రెండు తరగతి విద్యార్థులకు

ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ ద్వారా విద్యాబోధనకు ఆదేశాలు

3–5 తరగతుల విద్యార్థులను,

బడిమానేసిన వారిని ఆశ్రమ

పాఠశాలల్లో చేర్పించేందుకు నిర్ణయం

సొలబొంగికి పొక్లెయిన్‌తో తాత్కాలిక రహదారి చదును పనులు ప్రారంభం

బడి కష్టాలపై కదలిక 1
1/3

బడి కష్టాలపై కదలిక

బడి కష్టాలపై కదలిక 2
2/3

బడి కష్టాలపై కదలిక

బడి కష్టాలపై కదలిక 3
3/3

బడి కష్టాలపై కదలిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement