
ఆక్రమణల తొలగింపులో తాత్సారం
పాడేరు : జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంతో పాటు ఏజెన్సీలోని మండల కేంద్రాల్లో ఆక్రమణల తొలగింపులో కోర్టు తీర్పును అమలు చేయకుండా జిల్లా అధికారులు తాత్సారం చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆక్రమణలను ఎనిమిది వారాల్లో తొలగించాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు.ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, దీని వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కుంటిసాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐదో షెడ్యూల్ ప్రాంతమైన ఏజెన్సీలో రోజురోజుకు అక్రమ కట్టడాలు, నిర్మాణాలు పెచ్చుమీరుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. పాడేరు పట్టణంలో ఆక్రమణల తొలగింపు చేపడితే టీడీపీ నేతలకు చెందిన దుకాణాలకు కొంతమేర నష్టం జరుగుతుందని భావించిన జిల్లా ఉన్నతాధికారులు మెజారిటీ ప్రజల నిర్ణయాన్ని, కోర్టు ఆదేశాలకు అమలు చేయకుండా వారికి అండగా నిలవడం సరికాదన్నారు. మొదటి శనివారం అక్రమణల తొలగింపు అని హడావుడి చేసిన జిల్లా ఉన్నతాధికారులు కేవలం 12 దుకాణాలను మాత్రమే తొలగించి మిగిలినవి ఎందుకు తొలగించడం లేదన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఆక్రమణలను తొలగిస్తామని చెప్పిన కలెక్టర్ ఆ తర్వాత ఎందుకు ఆక్రమణల తొలగింపు ప్రక్రియను నిలిపివేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆక్రమణలు పెచ్చుమీరిన కారణంగా రోడ్డు ఇరుకుగా ట్రాఫిక్ జామ్ ఎక్కువవుతోందన్నారు. పట్టణంలో ఎక్కడా కూడా పార్కింగ్ స్థలాలు లేవన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమణల తొలగింపునకు మరో మూడు వారాలే గడువు ఉందన్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కొనసాగించి పట్టణ రహదారి విస్తరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో స్థానిక గిరిజనులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
అధికార పార్టీ నేతల
ఒత్తిళ్లకు తలొగ్గడం బాధాకరం
కోర్టు ఆదేశాలు పాటించకపోవడం అన్యాయం
ఇప్పటికై నా స్పందించకుంటే
గిరిజనులతో ఉద్యమం
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస
విశ్వేశ్వరరాజు హెచ్చరిక