
ఉన్నతాధికారి రాకతోతెరచుకున్న గ్రంథాలయం
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయం ఎట్టకేలకు తెరచుకుంది. ఐటీడీఏ క్వార్టర్ల నుంచి నూతన భవనంలోకి మార్చినప్పటి నుంచి సక్రమంగా తెరుచుకోవడం లేదు. దీంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.కుమార్రాజు స్థానిక గ్రంథాలయానికి తనిఖీ నిమిత్తం రావడంతో గ్రంథాలయం తలుపులు తెరచుకున్నాయి. రికార్డులు తనిఖీ చేసిన ఆయన పాఠకుల సంఖ్య పెంచాలని, ప్రతిఒక్కరూ గ్రంథాలయాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రంథాలయాధికారి సత్యవతిని ఆదేశించారు. ఎప్పుడూ మూసి ఉండే గ్రంథాలయం జిల్లా అధికారి వచ్చిన వెంటనే తెరుచుకోవడంతో ప్రతి రోజు అధికారులు తనిఖీలకు వస్తే గ్రంథాలయ సేవలు అందుబాటులో ఉంటాయని, పుస్తకాలు, దినపత్రికలు చదివేందుకు ఆస్కారం ఉంటుందని పలువురు పేర్కొన్నారు.