
ఉదయాన్నే పారిశుధ్య పర్యవేక్షణ సరికాదు
పాడేరు : గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజు ఉదయం 6గంటలకు గ్రామాలకు వెళ్లి పారిశుధ్య పనులు పర్యవేక్షించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఏపీ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులంతా రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విధులను బహిష్కరించారు. వీరంతా కలెక్టరేట్కు వచ్చారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్వో పద్మలతను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం ఆరు గంటలకు గ్రామాలకు వెళ్లి చెత్త సేకరణ, క్లోరినేషన్ ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని చెప్పడం సరైన నిర్ణయం కాదన్నారు. తామంతా చిత్తశుద్ధితో విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం కానీ ఇలాంటి చెత్త పనులు అప్పగిస్తే తాము విధులు నిర్వహించలేమన్నారు. పని భారంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందన్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలతో గడిపే సమయం మాకు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న తమకు అదనపు పనులు అప్పగిస్తే ఎలా పని చేసేదని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గ్రామాలకు 6 గంటలకు వెళ్లాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం
ఉపసంహరించుకోవాలి
లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం
ఏపీ పంచాయతీ కార్యదర్శుల
ఫెడరేషన్ ప్రతినిధుల హెచ్చరిక
సర్కారు తీరుని నిరసిస్తూ
విధుల బహిష్కరణ
డీఆర్వో పద్మలతకు
వినతిపత్రం అందజేత