
ఉద్యాన పంటల సాగుపై గిరి రైతులకు ప్రోత్సాహం
చింతపల్లి; గిరిజన ప్రాంతంలో ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన రైతులకు ఉద్యానవన పంటల సాగుకు పోత్సాహిస్తున్నట్టు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ లాలం సీతయ్య అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ఈ రెండు మండలాల పరిధిలో గిరిజన రైతులు గంజాయి సాగుకు పూర్తిగా నిలువరించడంతో పాటు ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే విధంగా అన్ని చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా గిరి రైతులకు అనతి కాలంలోనే పంట దిగుబడులతో పాటు ఆదాయాన్నిచ్చే పండ్ల మొక్కలు పంపిణీకి చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు రైతులకు సిల్వర్ ఓక్, డ్రాగన్ఫ్రూట్, అవకాడో, సపోటా, మామిడి, సీతాఫలం, జీడిమామిడి, మిరియాలు తదతర మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అంతే కాకుండా మూడేళ్లు పాటు సాగుకు సంబంధించి ప్రోత్సాహాలను అందించనున్నట్టు చెప్పారు. ఈ వార్షిక సంవత్సరంలో చింతపల్లి మండలంలో 3వేల మంది రైతులతో 2,036 ఎకరాల్లోను, గూడెం కొత్తవీధిలో మరో 3వేలు మంది రైతులతో 2,500 ఎకరాల్లో ఈ ఉద్యానవన పంటలు సాగుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆ దిశగా రైతులను సిద్ధం చేయాలని ఏపీడీ సీతయ్య సూచించారు . చింతపల్లి, జీకే వీధి ఏపీవోలు రాజు, రాంప్రసాద్ పాల్గొన్నారు.