
జాతీయ రహదారిపై కారు దగ్ధం
గాజువాక: షీలానగర్ జాతీయ రహదారిపై ఓ కారులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కారు ఇంజిన్లో నుంచి పొగ వచ్చి ఒక్కసారిగా దట్టమైన మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తె ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అందించిన వివరాలివీ.. అనకాపల్లి జిల్లా ఉమ్మలాడకు చెందిన ఎల్.ఎన్.వి.ప్రభాకర్ శనివారం తిరుపతి దర్శనం కోసం బయల్దేరాల్సి ఉంది. ఎన్ఏడీ కొత్తరోడ్లోని తమ బంధువుల ఇంట్లో ఉన్న కుమార్తెను తీసుకొని వెళ్లడం కోసం వచ్చిన ఆయన కుమార్తెతో కలిసి కారులో ఉమ్మలాడకు బయల్దేరారు. షీలానగర్ జంక్షన్కు వచ్చేసరికి కారు ఇంజిన్లో నుంచి పొగ రావడం గమనించారు. అప్రమత్తమైన ఆయన తనతోపాటు కుమార్తెను కారులో నుంచి దించేశారు. క్షణాల్లోనే దట్టమైన మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆటోనగర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది శకటంతో వచ్చి మంటలను ఆర్పివేశారు.