
కూలిన ఉక్కు దీక్ష శిబిరం షెడ్
కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల దీక్ష శిబిరం షెడ్ కూలిపోయింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తాటాకులతో నిర్మించిన షెడ్డు నేలమట్టమైంది. దీంతో కార్మికులు తమ నిరసనను శిబిరం వెలుపల కొనసాగించాల్సి వచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం 2021 ఫిబ్రవరి 12న అఖిలపక్ష కార్మిక సంఘాలు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాయి. ఈ దీక్షల కోసం తాటాకులతో ఈ షెడ్డును నిర్మించారు. సుమారు ఐదేళ్లు కావస్తున్నందున ఎండకు ఎండి, వానలకు తడిసి షెడ్డు ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితికి చేరుకుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి షెడ్డు కూలిపోయింది. అయితే ఆందోళనకారులు, కార్మిక సంఘాలు మళ్లీ షెడ్డు నిర్మిస్తాయా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇటీవల పోలీసులు శిబిరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడే కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తిరిగి షెడ్డు నిర్మాణానికి అనుమతిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.