
మోకాళ్లకు అరుదైన శస్త్ర చికిత్స
రంపచోడవరం: స్థానిక ఏరియా ఆస్పత్రిలో మొదటిసారిగా మోకాళ్లకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంగవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెదిన మల్లపు మంగ అనే మహిళ ఎడమ కాలుకు ఆర్థ్దోపెడిక్ వైద్య నిపుణులు సుధాకర్, ప్రదీప్, మత్తు వైద్యులు రోహిణి సంయుక్తంగా శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ టీవీ శేషారెడ్డి మాట్లాడుతూ మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న మంగ గత మూడు రోజుల క్రితం తమ ఆస్పత్రికి వచ్చినట్టు చెప్పారు. ఆమె మోకాళ్లకు ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారన్నారు. వైద్య బృందాన్ని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అభినందించారు.
సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్
చింతూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డివిజన్లోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి 66 అర్జీలు స్వీకరించారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.