
ఉపాధ్యాయుల సహనానికి పరీక్ష
ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్లో రెండో రోజూ గందరగోళం నెలకొంది. సాంకేతిక లోపాలు, అధికారుల జాప్యంతో బుధవారం కూడా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయల బదిలీ కోసం మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు సాంకేతిక సమస్యలతో అంతా గందరగోళంగా మారింది. దీంతో మొదటి రోజు కౌన్సెలింగ్ పూర్తిగా రద్దు కాగా, రెండో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాయడంతో వారి సహనం నశించి అధికారులను నిలదీశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం 1 నుంచి 300 వరకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. కానీ కౌన్సెలింగ్ ఆలస్యంగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైంది. ప్రక్రియ నత్తనడకన సాగడంతో మధ్యాహ్నం 2.40 గంటలకు కేవలం 20 మందికి, మధ్యాహ్నం 3.30 గంటలకు 50 మందికి, సాయంత్రం 7.45 గంటలకు 210 మందికి మాత్రమే పూర్తయింది. మిగిలిన 90 మంది కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో.. అప్పటి వరకు నిరీక్షించిన ఉపాధ్యాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు ఉమ్మడి జిల్లాల డీఈవోల వద్దకు వెళ్లి, అధికారులు కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మరోసారి సాంకేతిక సమస్యనే కారణంగా చెప్పినా వారు శాంతించలేదు. చివరకు మిగిలిన వారికి కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 11 గంటలు దాటింది.
పాఠశాలల తొలిరోజే టీచర్ల గైర్హాజరు!
మరోవైపు గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నేడు మరో 500 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో, వారంతా తొలిరోజు పాఠశాలలకు గైర్హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజు సాంకేతిక లోపంతో కౌన్సెలింగ్ రద్దు కావడం, రెండో రోజు ఈ జాప్యం జరగడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గురువారం 301 నుంచి 800 వరకు ఎస్జీటీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని విశాఖ డీఈవో ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆయన సూచించారు.
రెండో రోజూ బదిలీల
కౌన్సెలింగ్లో గందరగోళం

ఉపాధ్యాయుల సహనానికి పరీక్ష

ఉపాధ్యాయుల సహనానికి పరీక్ష