
కేంద్రం పథకాలతో సమగ్ర గిరిజనాభివృద్ధి సాధ్యం
సాక్షి,పాడేరు: సమగ్ర గిరిజనాభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి దర్తీ ఆబా జంజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ (పీఎం జుగా)దోహదపడుతుందని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు.బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం జుగా, పీఎం జన్మన్ పథకాలపై ఈనెల 15 నుంచి 30 వరకు జిల్లాలోని 518 గ్రామ సభల ద్వారా గిరిజనులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజేస్తున్న పథకాలతో గిరిజన సాధికారతకు కృషి చేస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాలు అమలుజేస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలుతీరు పర్యవేక్షణకు తన అధ్యక్షతన ఐటీడీఏ పీవోలు, పలుశాఖల అధికారులతో జిల్లా కమిటీలు, ఎంపీడీవోల అధ్యక్షతన మండల స్థాయిలో పలువురు అధికారులతో మండల కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. పాఠశాలలకు దూరంగా ఉన్న గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతితో కూడిన భోజన సదుపాయం కల్పనకు 22 వసతి గృహాల నిర్మాణానికి జిల్లాకు ఎస్ఎస్ఏ నిధులు రూ.6,896 లక్షలు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. పాడేరు, రంపచోడవరం డివిజన్లలో రెండు మల్టీపర్పస్ మార్కెటింగ్ కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. వీటిలో ఒకొక్కదానికి రూ.కోటి వెచ్చిస్తున్నట్టు చెప్పారు. రంపచోడవరం డివిజన్లో కేంద్రాన్ని ఆకుమామిడికోటలో నిర్మిస్తామన్నారు. పాడేరు డివిజన్లో 1,12,873 మందికి, రంపచోడవరం డివిజన్లో 25,14 6మందికి అటవీ హక్కుల చట్టం కింద భూములు పంపిణీ చేశామని చెప్పారు. పాడేరు డివిజన్లో రెండు వేల మందికి, రంపచోడవరం పరిధిలో 1496 మందికి కొత్తగా పట్టాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్ పాల్గొన్నారు.
గిరిజన గ్రామాలకు మౌళిక వసతులు:
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
రంపచోడవరం: గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రధానమంత్రి దర్తీ ఆబా జంజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకంపై గిరిజనులకు అవగాహన కల్పిస్తామని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం అమలు చేయడానికి ఏజెన్సీలో 211 గ్రామాలను ముందుగా గుర్తించడం జరిగిందన్నారు.
అడ్డతీగల మండలంలో 7 , గంగవరం మండలంలో 47, దేవీపట్నం మండలంలో 11, మారేడుమిల్లి మండలంలో 40, రాజవొమ్మంగి మండలంలో 14, రంపచోడవరం మండలంలో 23, వై.రామవరం మండలంలో 67 గ్రామాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే సబ్ ప్లాన్ఏరియాలోని ప్రత్తిపాడు మండలంలో రెండు గ్రామాలు, శంకవరం మండలంలో మూడు, రౌతులపూడి మండలంలో ఒక గ్రామాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ నెల 15 నుంచి 30 వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి గిరిజన గ్రామాల అభివృద్దికి కృషి చేయాలని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల పై అవగాహన కల్పించేందుకు గ్రామసభలు
కలెక్టర్ దినేష్కుమార్