
దైవ దర్శనానికి వెళ్లొస్తూ..
జగదాంబ/బుచ్చెయ్యపేట: బుచ్చెయ్యపేట మండలం ఆర్.శివరాంపురంలో అంతులేని విషాదం అలుముకుంది. భార్య ఆరోగ్యం కోసం కేజీహెచ్కు బయలుదేరిన ఆ కుటుంబ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. ఈ క్రమంలో దైవదర్శనం అనంతరం తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో.. భార్య అక్కడికక్కడే కన్నుమూయగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. కన్నవారి కోసం ఆ పసిపిల్లల ఎదురుచూపులు, వారి ఆలనా పాలనా చూడాల్సిన నాన్నమ్మ గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
దేవర చిలుకనాయుడు దివ్యాంగుడు. కాళ్లు చచ్చుబడ్డా.. ఆత్మవిశ్వాసాన్ని చంపుకోలేదు. ఎనిమిదేళ్ల కిందట దిబ్బిపాలేనికి చెందిన కృష్ణకుమారి (33)ని వివాహం చేసుకున్నాడు. గ్రామంలో చిన్న పాన్షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్న చిలుకనాయుడికి భార్యే చేదోడు వాదోడుగా ఉండేది. వారికి ఇద్దరు కుమార్తెలు యువశ్రీ(4), హాత్విక(8 నెలలు) ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారిని ప్రతి నెలా కేజీహెచ్కు తీసుకొస్తున్నాడు చిలుకనాయుడు. బుధవారం ఉదయం కూడా తన మూడు చక్రాల స్కూటీపై భార్య, చిన్న కూతురు హాత్వికతో కలిసి శివరాంపురం నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో వీరు ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దర్శనానికి ఘాట్ రోడ్డులో వెళ్లి తిరిగి వస్తున్నారు. పూర్ణామార్కెట్ సమీపంలో మొదటి మలుపు వద్ద స్కూటీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదుపుతప్పిన వాహనం వేగంగా గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణకుమారి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చిలుకనాయుడు తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్కూటీలో ముందు కూర్చున్న 8 నెలల హాత్విక పక్కనే ఉన్న ఇసుక దిబ్బపై పడటంతో ప్రాణాలతో బయటపడింది. ఆ పసిపాప ఏడుపు విని చలించిపోయిన ఓ మహిళా వ్యాపారి, చిన్నారిని దగ్గరకు తీసుకుని సపర్యలు చేసింది. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించింది. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిలుకనాయుడు పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.
తల్లి మృతి.. తండ్రికి సీరియస్
అనాథలైన పసిపాపలు
స్కూటీ బ్రేకులు ఫెయిల్..
దివ్యాంగుడి కుటుంబంలో తీవ్ర విషాదం

దైవ దర్శనానికి వెళ్లొస్తూ..

దైవ దర్శనానికి వెళ్లొస్తూ..