ఉచిత కార్పొరేట్‌ విద్యకు మంగళం | - | Sakshi
Sakshi News home page

ఉచిత కార్పొరేట్‌ విద్యకు మంగళం

Jun 11 2025 8:45 AM | Updated on Jun 11 2025 8:45 AM

ఉచిత కార్పొరేట్‌ విద్యకు మంగళం

ఉచిత కార్పొరేట్‌ విద్యకు మంగళం

విద్యా హక్కు చట్టం(ఆర్‌టీఈ)లో భాగంగా పేద పిల్లలకు ప్రైవేట్‌ పాఠశాలల్లో అందించాల్సిన 25 శాతం సీట్లకు యాజమాన్యాలు మంగళం పాడుతున్నాయి. ఉచిత సీట్లు ఇవ్వలేమని తల్లిదండ్రులకు తెగేసి చెప్పేస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలైన ఈ విధానం, ఇప్పుడెందుకు అమలు చేయట్లేదంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఆరిలోవ(విశాఖ): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్‌టీఈ కింద ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఫీజు లేకుండా ఉచితంగా కేటాయించే వెసులుబాటు కల్పించింది. ప్రతి పాఠశాల యాజమాన్యం వారి పాఠశాలకు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పిల్లలకు ఒకటో తరగతిలో నాలుగో వంతు సీట్లు కేటాయించాలి. ఉచితంగా చేర్చుకున్న విద్యార్థుల ఫీజుల్ని ఆయా పాఠశాలలకు ప్రభుత్వమే చెల్లించేంది. పట్టణ ప్రాంతాల పాఠశాలలకు ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.16 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.8 వేలు చెల్లించేది. ప్రస్తుతం రెండేళ్లుగా అలాంటి విద్యార్థులకు సంబంధించిన ఫీజులు బకాయిలు ఉండిపోయాయనే నెపంతో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పిల్లల్ని ఈ ఏడాది చేర్చుకోవడంలేదు.

చేర్చుకోలేమని తెగేసి చెప్తున్నారు

తమకు బకాయిలు ఏళ్ల తరబడి ఉన్నాయని, అందుకే మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్చుకోబోమంటూ కొన్ని యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. ఉచిత సీటుకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తక్కువ కావడం వల్లే ప్రైవేట్‌ పాఠశాలలు తప్పించుకుంటున్నాయనే విమర్శలున్నాయి. ఏడాదికి నగరంలోని కొన్ని యాజమాన్యాలు ఒకటో తరగతి విద్యార్థికే రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అలాంటపుడు రూ.16 వేలకే సీటిచ్చి లాభాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి.

గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

యాజమాన్యాల తీరుతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎంత బ్రతిమాలినా పాఠశాలల యాజమాన్యాలు అంగీకరించకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు సోమవారం గ్రీవెన్స్‌లో కొందరు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల్ని సీతమ్మధారలో ఉన్న శ్రీది ప్రెసిడెన్షియల్‌ స్కూల్‌శ్రీలో ఆర్‌టీఈ కింద చేర్చుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే పరిస్థితి నగరంతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉండటంతో తల్లిదంద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉచిత సీట్లు ఇవ్వలేమన్నారు

మేం సీతమ్మధార ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. ఇక్కడున్న ది ప్రెసిడెన్షియల్‌ స్కూల్‌కు మా ఇంటి నుంచి కిలో మీటర్‌ మాత్రమే దూరం. ఈ దూరాన్ని బట్టి మొదటి ప్రాధాన్యతలో మా పిల్లలకు ఆ పాఠశాలలో సీట్లు ఇవ్వాలి. ఆర్‌టీఈ సీట్లు కోసం అవసరమైన పత్రాలు అందించాం. కానీ మాకు ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయని, మేం మీ పిల్లలకు సీట్లు ఇవ్వలేమని చెప్పారు. ఎవరికై నా ఫిర్యాదు చేసుకోండి అని ఆ పాఠశాల నిర్వాహకులు అన్నారు. దీంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. కలెక్టర్‌ మా పిల్లలకు న్యాయం చేయాలని, ఆ పాఠశాలలో ఆర్‌టీఈ సీట్లు కేటాయించాలని కోరుతున్నాం.

–బి.సంతోష్‌, సీహెచ్‌.ధనలక్ష్మి, ఎన్‌.దేవి, డి.లక్ష్మీప్రసన్న, సీహెచ్‌ యశోదకృష్ణ

ప్రైవేట్‌ పాఠశాల్లో పేద పిల్లలకు సీట్లు కేటాయించని యాజమాన్యాలు

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement