
నయన మనోహరం.. వెంకన్న నౌకా విహారం
డాబాగార్డెన్స్: నిత్యం పాలకడలిలో పవళించి ముల్లోకాలను బ్రోచే నారాయణుడు వేంకటేశుడై జలధిలో విహరించిన మనోహర దృశ్యం సాగరతీరంలో ఆవిష్కృతమైంది. ఈ దివ్య ఘట్టాన్ని తిలకించి భక్తజనకోటి మురిసింది. పోర్టు ప్రాంతంలోని శృంగమణి పర్వతంపై ఉన్న వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం సాయంత్రం తెప్పోత్సవం ఘనంగా సాగింది. ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన హోమాలు, బలిహరణం, తీర్థగోష్ఠి జరిపారు. సాయంత్రం 4 గంటలకు స్వామి వారి ఉత్సవ ప్రతిమలను పల్లకిలో మెట్లమార్గం మీదుగా కిందికి తీసుకొచ్చారు. అనంతరం దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు, పలువురు ప్రముఖులు స్వామివారి పల్లకిని మేళతాళాలు, అర్చకస్వాముల వేదమంత్రాల నడుమ తెప్పోత్సవానికి సిద్ధంగా ఉన్న నౌక వరకూ మోసుకెళ్లారు. శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామిని వివిధ రకాల పుష్పాలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించిన నౌక మీదకు తీసుకెళ్లారు. భక్తులు ప్రయాణించే లాంచీలు అనుసరించగా స్వామి కాసేపు తెప్పపై సాగర విహారం చేశారు. అనంతరం స్వామిని తిరిగి ఆలయానికి తీసుకువెళ్లారు. ఆనందోత్సాహాల నడుమ జరిగిన ఈ తెప్పోత్సవం భక్తులను పరవశింపజేసింది. నౌకా విహారంలో ఆలయ ఈవో శ్రీనివాస్, ప్రధానాచార్యులు శ్రీనివాస జగన్నాథాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
నేటి కార్యక్రమాలు
వార్షిక తిరు కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం 8 నుంచి 11 వరకు పూర్ణాహుతి, చూర్ణోత్సవం, సముద్రస్నానం(చక్రస్నానం), సాయంత్రం 6 గంటలకు ఆరాధన చూర్ణోత్సవం(దొంగల దోపు ఉత్సవం), ధ్వజావరోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఘనంగా పోర్టు వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం
సముద్రంలో విహరిస్తున్న వేంకటేశ్వర స్వామి
శ్రీదేవి, భూదేవి సమేత
వేంకటేశ్వర స్వామి

నయన మనోహరం.. వెంకన్న నౌకా విహారం

నయన మనోహరం.. వెంకన్న నౌకా విహారం