
మమ్మేలు మాతల్లి.. గంగమ్మ తల్లి
ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కోరుతూ మత్స్యకారుల పూజలు
మహారాణిపేట: ప్రకృతి విపత్తుల నుంచి నుంచి మత్స్యకారులను, వారి బోట్లు, వేట సామగ్రిని రక్షించాలని కోరుతూ ఫిషింగ్ హార్బర్ ఆవరణలో గంగమ్మ తల్లికి మత్స్యకారులు మంగళవారం విశేష పూజలు జరిపారు. గంగమ్మతల్లితోపాటు సముద్రుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నెల 14న అర్ధరాత్రి దాటాక బోట్లు చేపల వేటకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ పండగను ఘనంగా నిర్వహించారు. ఏపీ మరపడవల సంఘం అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు దంపతులు గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు, ఇతర పూజా ద్రవ్యాలు సమర్పించారు. కార్యక్రమంలో మరపడవల సంఘం గౌరవ అధ్యక్షుడు పీసీ అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఎస్.నర్సింగరావు, కార్యదర్శి మున్నం బాలాజీ, నాయకులు గరికిన పరుశురాముడు, ఎస్ రాము, గరగయ్య, జి.రాజేష్, పుక్కళ్ల ఈశ్వరరావు, ఎ.చిన్న, పెద్ద, మహిళలు, మత్స్యకారులు పాల్గొన్నారు.
కోలాహలంగా హార్బర్ ప్రాంతం
గంగమ్మతల్లి పూజలతో హార్బర్ ప్రాంతంలో సందడి నెలకొంది. గంగమ్మ తల్లి ఆలయ వ్యవస్థాపక పూజారి శర్మ పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి వర్షం పడుతున్నప్పటికి భక్తులు వెరవకుండా గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. హార్బర్లో వేంచేసిన గంగమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పూజలు నిర్వహించారు.