
సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు
పలు పోలీస్స్టేషన్లలో జర్నలిస్టుల ఫిర్యాదు
సాక్షి,పాడేరు: రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై టీడీపీ దాడులకు పాల్పడడం సరికాదని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పాత్రికేయులు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. పాడేరులో సీఐ దీనబంధుకు ఫిర్యాదు చేయగా... అరకులోయలో ఎస్ఐ గోపాలరావుకు, హుకుంపేట, రాజవొమ్మంగి, డుంబ్రిగుడ పోలీస్స్టేషన్లలో సిబ్బందికి ఫిర్యాదులు అందజేశారు.
కొందరు వ్యక్తులు చేపట్టిన రాజకీయ ప్రేరేపిత దాడులు, ఇతర నేర చర్యలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సాక్షి మీడియా విశాఖ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ వర్రి చంద్రారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా గుంపులుగా చేరి దాడులకు పాల్పడ్డారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.