
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసీల ధర్నా
మాడుగుల రూరల్ : శంకరం పంచాయతీ శివారు కృష్ణంపాలెం గ్రామానికి సంబంధించి ప్రభుత్వ బంజరు భూములను స్థానిక ఆదివాసీలకు కేటాయించాలని కోరుతూ సోమవారం ర్యాలీ నిర్వహించారు. మాడుగుల గాంధీ పార్కు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, తహసీల్దారు రమాదేవికి వినతిపత్రం అందజేశారు. శంకరం పంచాయతీ శివారు కృష్ణంపాలెంలో సర్వే నంబరు 188–3 లో గల భూమిని ఆదివాసీలకు కేటాయించాలని, సివిల్ కేసుల్లో ఆదివాసీలను ప్రతిసారి పోలీసుస్టేషన్కు పిలిపించి పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తహసీల్దారుకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఐ, ఇతర సిబ్బందితో మాట్లాడుతానని తహసీల్దార్ వారికి హామీ ఇచ్చారు.