
అనేక వ్యాధులకు మూలకారణం ఊబకాయం
మహారాణిపేట: ఊబకాయం అంటువ్యాధి కానప్పటికీ, అనేక వ్యాధులకు మూలకారణంగా మారుతోందని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జిల్లా పరిషత్ సమీపంలోని అంకోశా ఆడిటోరియంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), మెడికవర్ ఆస్పత్రి సహకారంతో నిర్వహించిన ఒకరోజు అవగాహన, సీఎంఈ (కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) కార్యక్రమంలో పలువురు వైద్యులు ప్రసంగించారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, పద్మవిభూషణ్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఊబకాయాన్ని అదుపులో ఉంచకపోతే తీవ్రమైన, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఐఎంఏ విశాఖ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, మెడికవర్ హాస్పిటల్స్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అధిపతి డాక్టర్ శ్రీనివాస్ నిస్తాల మాట్లాడుతూ, ఊబకాయం తీవ్రమైన చిక్కులు తెస్తుందని, వైద్య సమాజానికి అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేజీహెచ్ గైనిక్ విభాగాధిపతి డాక్టర్ ఇసుకపల్లి వాణి, ఐఎంఏ నాయకుడు డాక్టర్ మురళీమోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 400 మంది వైద్యులు హాజరై మంచి స్పందన లభించింది.