
ఊపిరి తీసిన బైక్ షూరిటీ
పెదబయలు: షూరిటీపై స్నేహితుడికి బైక్ ఇప్పించగా, దానికి అతడు నెలా నెలా ఫైనాన్స్ కట్టలేదు. దాంతో ఫైనాన్షియర్ల వేధింపులు భరించలేక టిప్పర్ లారీ డ్రైవర్ గూబరి లోవరాజు(23) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని సీకరి పంచాయతీ పులుసుమామిడి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా, శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పెదబయలు ఇన్చార్జి ఎస్ఐ రామకృష్ణ, మృతుడి భార్య సరోజిని అందించిన వివరాల ప్రకారం... పెదబయలు గ్రామానికి చెందిన గూబరి లోవరాజు సీకరి పంచాయతీ బొడ్డాపుట్టు గ్రామానికి చెందిన సరోజినితో కలిసి తన అత్తవారింట్లో ఏడాదిగా నివాసం ఉంటున్నాడు. మూడు నెలల క్రితం లోవరాజు షూరిటీతో పాడేరులో టీవీఎస్ బైక్ షోరూం నుంచి టీవీస్ పల్సర్ 220 సెకండ్ హ్యాండ్ బైక్ ఫైనాన్స్పై స్నేహితుడు అనిల్కుమార్ (డ్రైవర్) తీసుకున్నాడు. అప్పటి నుంచి బైక్ ఫైనాన్స్ కట్టకపోవడంతో రెండు వారాల నుంచి ఫైనాన్షియర్లు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక ఈ నెల 3వ తేదీ ఉదయం ఇంట్లో ఫోన్ వదిలేసి బయటకు వెళ్లి ఐదు రోజుల నుంచి తిరిగి రాలేదు. ఈ క్రమంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతకగా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం పులుసుమామిడి గ్రామానికి చెందిన కొంతమంది కొండకు వెళ్లగా, దుర్వాసన రావడంతో చెట్టుకు ఉరేసుకున్న యువకుడి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉరేసుకుని ఐదు రోజులు అవ్వడంతో మృతదేహం కుళ్లిపోయింది. భార్య సరోజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతికి ఇతర కారణాలు ఉన్నాయా లేదా అని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి నాలుగేళ్ల వయస్సు కలిగిన కుమారుడు ఉన్నారు.
ఫైనాన్షియర్ల వేధింపులతో
టిప్పర్ లారీ డ్రైవర్ ఆత్మహత్య

ఊపిరి తీసిన బైక్ షూరిటీ