
ఆర్టీసీ సిబ్బందికి యోగా శిక్షణ తరగతులు
డాబాగార్డెన్స్: ఈ నెల 21న ఆర్కే బీచ్ వేదికగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్రలో భాగంగా శుక్రవారం ఆర్టీసీ సిబ్బందికి విశాఖపట్నం డిపోలో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు యోగా తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో విశాఖ డిపో మేనేజర్ కె. గంగాధరరావు యోగా ప్రాముఖ్యత సిబ్బందికి వివరిస్తూ, ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో విశాఖపట్నం డిపో ట్రాఫిక్, గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.