
నష్టపరిహారం చెల్లించిన తరువాతే హైవే పనులు
జి.మాడుగుల: మా సాగు భూములకు నష్టపరిహారం అందించే వరకు జాతీయ రహదారి 516ఈ రోడ్డు నిర్మాణ పనులు చేయవద్దని వంజరి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ రోడ్డు నిర్మాణంలో సాగు భూములు కోల్పోయిన బాధితులతో గురువారం మండలంలోని వంజరిలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సాగిన ధర్మన్నపడాల్, జాతీయ రహదారి బాధితుల సంఘం మండల కన్వీనర్ వంజరి సీతారాంనాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంజరిలో గ్రామంలో 50 కుటుంబాలు, ములకాయపుట్టులో 40 కుటుంబాలు, కడగెడ్డ గ్రామంలో 10 కుటుంబాలు వరిగెలపాలెంలో 10 కుటుంబాలకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్కు వినతి పత్రం అందించామని వారు తెలిపారు. గతంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన సుమిత్కుమార్ ఉన్నప్పుడు రెవెన్యూ, హర్టికల్చర్, అటవీ అధికారులతో కమిటీ ఏర్పాటుచేశారన్నారు. యూఆర్ఎఫ్ పట్టాలు 1985 సంవత్సరంలో ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్లు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్న వారితోపాటు ఇదివరకు సాగులో ఉన్న వాళ్లకు నష్టపరిహారం ఇస్తామని చెప్పనప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. రోడ్ ఫార్మేషన్ జరిగి ఇప్పటికి రెండేళ్లు కావస్తున్నా నష్టపరిహారం అందించకపోవడం బాధాకరమని వారు అన్నారు. కాఫీ, మిరియం, మామిడి తోటలపై రూ.లక్షల్లో ఆదాయం కోల్పోయామన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం స్పందించి హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, లేదంటే రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. తమ గ్రామాల్లో రోడ్డు నిర్మాణంలో పంట కాలువలు, నాలుగు బోర్లు కప్పేశారని, వాటిని ఇప్పటికీ పునరుద్ధరించలేదన్నారు. హైవే బాధితుల సంఘం కోకన్వీనర్ శ్రీనివాస్, ప్రతినిధులు చిరంజీవినాయుడు, రామూర్తినాయుడు, బాబూరావు, వెంకటలక్ష్మి, కనకాలమ్మ, భారతమ్మ, కల్యాణం బాలయ్య, చిన్నయ్య, హరి, భాస్కర్ పాల్గొన్నారు.
వంజరిలో బాధితుల డిమాండ్
గిరిజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారి వద్ద నిరసన