
విశాఖ చేరిన డబుల్ డెక్కర్ బస్సు
సింహాచలం: విశాఖ వీధుల్లో డబుల్ డెక్కర్ బస్సు కనువిందు చేయనుంది. పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచనుంది. విశాఖలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సు విశాఖకు చేరుకుంది. హనుమంతవాక నుంచి పాత అడవివరం వైపు ఉన్న బీఆర్టీఎస్ రోడ్డులో కనువిందు చేస్తూ సింహాచలం దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురంలోని గోశాలకు చార్జింగ్ కోసం ఆదివారం వచ్చింది. గోశాల ముఖద్వారం గేటు బస్సు కన్నా తక్కువ ఎత్తులో ఉండటంతో లోపలకి వెళ్లలేదు. గేటు బయటనే నిలిచింది. దాంతో బీఆర్టీఎస్ రోడ్డులో సింహాచలం వైపు వచ్చే వారంతా బస్సును ఆసక్తిగా తిలకించారు. గన్నవరం నియోజకర్గంలోని మల్లివల్లిలో అశోక్ లేల్యాండ్ బస్ బాడీ ప్లాంట్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ కంపెనీ తయారుచేసిన డబుల్ డెక్కర్ బస్సును ఏపీ ప్రభుత్వానికి సంస్థ ఉచితంగా అందించింది. దాన్ని విశాఖకు కేటాయించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుందని సిబ్బంది చెప్తున్నారు.