
ప్రతిఒక్కరికీ యోగా సాధన తప్పనిసరి
అనంతగిరి (అరకులోయ టౌన్): యోగ సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలనిజాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ ఇన్చార్జి పీవో డాక్టర్ అభిషేక్ గౌడ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం మండలంలోని బొర్రా గుహల వద్ద 1100 మందితో పర్యాటక యోగ సాధన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యోగాభ్యాసనకు ప్రజలంతా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లా నుంచి 4,32,545 మంది యోగాలో భాగస్వాములు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,54,421 మంది మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. మిగిలిన వారు కూడా త్వరితగతిన పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ట్రైనీలుగా 3,168 మంది నమోదు కావలసి ఉండగా ఇప్పటివరకు 1921 మంది నమోదయ్యారన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో ట్రైనీలు, ప్రజల నమోదును వేగవంతం చేయాలని ఆదేశించారు. మాస్టర్ ట్రైనర్లను మండల, గ్రామ స్థాయిలో ఉన్న ట్రైనర్లతో మ్యాపింగ్ పూర్తయినందున ట్రైనర్లు త్వరగా శిక్షణ పూర్తి చేసుకుని ప్రజలకు శిక్షణ అందించాలన్నారు. యోగాలో గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 854 పోటీల్లో 3,107 మంది పాల్గొన్నారని, 2,473 మందికి విజేతలుగా ప్రకటించి పోర్టర్లో నమోదు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, ఎంపీపీ శెట్టి నీలవేణి, జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పరిసర గ్రామాల ప్రజలు, విద్యార్ధులు, పర్యాటకులు పాల్గొన్నారు.
శబరి నది ఒడ్డున..
చింతూరు: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆధ్వర్యంలో వెయ్యి మందితో స్థానిక శబరినది ఒడ్డున ఇసుకతిన్నెల్లో గురువారం మెగా యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు పలువురు అధికారులు యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ వచ్చేనెల 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా చింతూరులో కూడా యోగా ప్రత్యేక సాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. యోగా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. మానసిక ప్రశాంతతతో పాటు జీవనశైలిలో మార్పునకు యోగా ఎంతో ఉపయోగ పడుతుందని ఆయన పేర్కొన్నారు.
యోగా సాధన చేస్తున్న పాడేరు, అరకులోయ
అధికారులు, సిబ్బంది

ప్రతిఒక్కరికీ యోగా సాధన తప్పనిసరి

ప్రతిఒక్కరికీ యోగా సాధన తప్పనిసరి

ప్రతిఒక్కరికీ యోగా సాధన తప్పనిసరి

ప్రతిఒక్కరికీ యోగా సాధన తప్పనిసరి