
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
కశింకోట: వరి సాగులో యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని జిల్లా రిసోర్స్ కేంద్రం ఏడీఏ సుబ్రహ్మణ్యం తెలిపారు. మండలంలోని జెట్టపురెడ్డితుని, నూతలుగుంట పాలెం గ్రామాల్లో బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి నారు వేసుకునేటప్పుడు శుద్ధి చేసిన విత్తనాలు నాటుకోవాలన్నారు. నాట్లు వేసినప్పుడు కాలి బాటలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉద్యానవన విస్తరణాధికారి ప్రవీణ మాట్లాడుతూ ఉద్యానవన పంటల సాగుకు బిందు సేద్యం లాభదాయకంగా ఉంటుందన్నారు. మండల వ్యవసాయ అధికారి ఎం. స్వప్న మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో పచ్చిరొట్ట ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. బీసీటీ కృషి కేంద్రం భూసార పరీక్ష శాస్త్రవేత్త బి.శ్రీహరిరావు మాట్లాడుతూ రైతులు సహజ సిద్ధమైన ఎరువులు వినియోగించి పంటలు సాగు చేయాలన్నారు. దీనివల్ల భూమి ఆరోగ్యవంతంగా ఉండటంతోపాటు ఆరోగ్యకర ఉత్పత్తులు ప్రజలకు అందుతాయన్నారు. పశు వైద్య శాస్ట్రవేత్త విజయ రాజ్ఞి మాట్లాడుతూ పశుగ్రాసం సాగులో యూరియా ఎరువు శాతాన్ని తగ్గించి జీవన ఎరువులు, పశువులు గెత్తం ఉపయోగించాలని రైతులకు సూచించారు.
జిల్లా రిసోర్స్ కేంద్రం ఏడీఏ సుబ్రహ్మణ్యం