చెక్‌డ్యాంలకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

చెక్‌డ్యాంలకు గ్రహణం

Apr 22 2025 2:37 AM | Updated on Apr 22 2025 2:37 AM

చెక్‌

చెక్‌డ్యాంలకు గ్రహణం

వర్షాకాలం ప్రారంభానికి ఇంకా రెండు నెలలే సమయం ఉంది. తొలకరి జల్లులను ఒడిసి పడితే సాగుకు నీరందుతుంది. కానీ చాలాచోట్ల చెక్‌డ్యాంలు దెబ్బతిన్నాయి. తూములు మరమ్మతులకు గురికావడంతో చుక్కనీరు లేకుండా పోతోంది. కొన్ని చెక్‌డ్యాంల మరమ్మతులకు అధికారులు అంచనాలు తయారు చేసి, ప్రతిపాదనలు పంపారు. అయితే పనుల్లో జాప్యం నెలకొంది.

చింతపల్లి: గిరిజన రైతులకు మేలు చేయాలి.. పంటలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన చెక్‌డ్యాంలు ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. నిర్వహణ కరువై...ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. పాడేరు డివిజన్‌ పరిధిలోని 11 మండలాల్లో 321 చెక్‌డ్యాంలు దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు లేక నీరందడం లేదని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కాలువల్లో పూడిక తీత కూడా లేదని, దీనివల్ల నీరు సరిగా ప్రవహించడం లేదని వాపోతున్నారు. పాడేరు డివిజన్‌ పరిధిలో జలవనరుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వాటిపై స్పెషల్‌మైనర్‌ ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌ (ఎస్‌ఎంఐ) అధికారులు దృష్టిసారించకపోవడంతో చెక్‌డ్యామ్‌లు పూడుకుపోయాయి. దీంతో సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. వర్షాలు కురిసినప్పుడు కొండ గెడ్డలు,ఊటగెడ్డల ద్వారా చెక్‌ డ్యాంలు, చెరువులకు నీరు చేరుతుంది. వాటిలో నిల్వ ఉన్న నీటితో వందలాది ఎకరాల్లో రెండు పంటలు సాగు చేసేవారు. వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు,పూలు పండించేవారు. డివిజన్‌ పరిధిలో చాలా చెక్‌డ్యాంలు పూర్తిగా దెబ్బతినడంతో నీరంతా కొండ గెడ్డల్లో కలసిపోయి వృథాగా పోతోంది. రెండవ పంట పండించే పరిస్థితి లేకుండా పోయింది. నీరందక వందలాది ఎకరాలు బీడుగా మిగిలిపోయాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 321 చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు ఇటీవల అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిలో 148 చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయగా 104 పనులు సాగుతున్నాయి.

చింతపల్లి సబ్‌ డివిజన్‌

ఎత్తివేతతో రైతులకు అవస్థలు

చింతపల్లి కేంద్రంగా నీటిపారుదల శాఖ సబ్‌డివిజన్‌ కార్యకలాపాలు నిర్వహించేవారు. చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో చింతపల్లి,జీకే వీధి,కొయ్యూరు మండలాలు ఉండేవి. చెక్‌ డ్యాంలు,చెరువుల నిర్మాణం, నిర్వహణ తదితర కార్యకలాపాలను చింతపల్లి కేంద్రంగానే ఇంజినీరింగ్‌ అధికారులు నిర్వహించేవారు. ఈ శాఖ ద్వారానే మూడు మండలాల్లో మారుమూల గ్రామాల్లో పలు చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. దీంతో గిరిజన రైతాంగానికి వ్యవసాయానికి తోడ్పాటునందించినట్టయింది.ఎన్నో వందలు ఎకరాల కొండభూములు,బీడుభూములు సాగులోకి వచ్చాయి. అయితే 2006 సంవత్సరంలో సబ్‌ డివిజన్‌ను ఎత్తివేసి, మైదాన ప్రాంతానికి తరలించారు. దీంతో ఈ ప్రాంత రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి.ఆ కార్యాలయ భవనాన్ని కొంతకాలం గిరిజన సంక్షేయ శాఖ కార్యాలయంగా ఉపయోగించారు.అనంతరం ఆ భవనం నిరుపయోగంగా ఉండడంతో శిథిలావస్థకు చేరుకుంది.

దెబ్బతిన్న చెక్‌డ్యాంలకు మరమ్మతులు కరువు

వృథాగా పోతున్న సాగునీరు

దృష్టి సారించని స్పెషల్‌మైనర్‌ ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌ అధికారులు

బీడువారిన వందలాది ఎకరాలు

చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేపట్టాలి

చింతపల్లి మండంలోని పలు ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు పూర్తిగా దెబ్బతినడంతో సాగు నీరు వృథాగా పోతోంది. పంటలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాత చెక్‌డ్యాంలను బాగుచేయడంతో పాటు, కొత్తవాటిని నిర్మించాలి.

– గెమ్మిలి అబ్బాయినాయుడు,

గిరిజన రైతు,దిగువపాకలు గ్రామం

321 చెక్‌డ్యాంలు గుర్తింపు

పాడేరు డివిజన్‌ పరిధిలో 321 చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేయాలని గుర్తించాం. ఇప్పటికే కలెక్టర్‌ 148 చెక్‌డ్యాంల మరమ్మతులకు నిధులు మంజూరు చేశారు.వాటిలో 104 పనులు జరుగుతున్నాయి.మిగిలిన వాటికి ప్రతిపాదనలు పంపించాం.నిధులు మంజూరు అయితే పనులు ప్రారంభిస్తాం.

– నాగేశ్వరరావు,

డీఈ, స్పెషల్‌ మైనర్‌ ఇరిగేషన్‌,చింతపల్లి

చెక్‌డ్యాంలకు గ్రహణం1
1/4

చెక్‌డ్యాంలకు గ్రహణం

చెక్‌డ్యాంలకు గ్రహణం2
2/4

చెక్‌డ్యాంలకు గ్రహణం

చెక్‌డ్యాంలకు గ్రహణం3
3/4

చెక్‌డ్యాంలకు గ్రహణం

చెక్‌డ్యాంలకు గ్రహణం4
4/4

చెక్‌డ్యాంలకు గ్రహణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement