
బాక్స్ కార్నర్లో పడి ఒకరు మృతి
ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట చెరువు సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బాక్స్ కార్నర్లో పడి కాంబ్లే సదాశివ్ (51) సోమవారం మృతి చెందినట్లు మావల పోలీస్ స్టేషన్ ప్రొహిబిషన్ ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు. భీంపూర్ మండలం అర్లి (టి) గ్రామానికి చెందిన సదాశివ్ కొంతకాలంగా మతిస్థిమితం కొల్పోయాడు. ఇదే క్రమంలో ఎర్రకుంట చెరువు వైపు కాలి నడకన వస్తుండగా కార్నర్ బాక్స్లోపడి మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు ..
బోథ్: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. మండలంలోని పిప్పల్దరి గ్రామానికి చెందిన జుగ్నక్ శ్రీనివాస్ (25) ఈ నెల 1న అదే గ్రామానికి చెందిన కుంరం గంగాప్రసాద్తో కలిసి ట్రాక్టర్తో పెందూర్ భీంరావ్ చేనులో దుక్కి దున్నడానికి వెళ్లారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో శ్రీనివాస్కు తీవ్రంగా గంగాప్రసాద్కు స్వల్పంగా గాయాలయ్యాయి. పక్క చేనులో ఉన్న నవీన్ గమనించి శ్రీనివాస్ అన్న సంతోష్కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను బోథ్లోని సీహెచ్సీ తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి శ్రీనివాస్ మృతి చెందాడు. మృతుని సోదరుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
దేశీదారు పట్టివేత
సాత్నాల: భోరజ్ మండలంలోని సావాపూర్లో సోమవారం దేశీదారు పట్టుకున్నట్లు ఎస్సై రమ్య తెలిపారు. తాజీల ప్రవీణ్ వద్ద 30 దేశీదారు సీసాలు (90 ఎంఎల్) లభ్యమైనట్లు తెలిపారు. వాటి విలువ రూ.1500 వరకు ఉంటుందన్నారు. నిందితుడిని తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి ఎదుట బైండోవర్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ దేశీదారు అమ్మకం చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన తైక్వాండో క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటారు. మేడ్చల్–మల్కాజ్ గిరి జిల్లాలో మే 31, జూన్ 1వ తేదీల్లో జరిగిన పోటీల్లో నలుగురు క్రీడాకారులు ఒక స్వర్ణం, 3 కాంస్యాలతో మెరిశారు. సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో అన్నారపు సహన బంగారు పతకం, వడ్నాల శ్రీ, డేగే సాత్విక్, రావుల అవంతిక కాంస్య పతకాలు సాధించారు. వీరంతా వచ్చే నెల ఉత్తరాఖండ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించనున్నట్లు శిక్షకుడు వీరేష్ తెలిపారు.
రాష్ట్రస్థాయిలో మెరవడం గొప్ప విషయం..
జిల్లాకు చెందిన తైక్వాండో క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవడం గొప్ప విషయమని జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి అన్నారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను సోమవారం ఇ ందిరా ప్రియదర్శిని స్టేడియంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర సాధనతోనే విజయం సాధించవచ్చన్నారు.