● వడ్డీ వ్యాపారుల ఆగడాలు ● అసలు కంటే కొసరే ఎక్కువ ● రుణగ్రహీతల నుంచి స్థిరాస్తులు కై వసం ● జిల్లాలో ఇప్పటికే 50కి పైగా కేసులు ● పోలీసుల దాడులతోనైనా బ్రేక్‌ పడేనా..? | - | Sakshi
Sakshi News home page

● వడ్డీ వ్యాపారుల ఆగడాలు ● అసలు కంటే కొసరే ఎక్కువ ● రుణగ్రహీతల నుంచి స్థిరాస్తులు కై వసం ● జిల్లాలో ఇప్పటికే 50కి పైగా కేసులు ● పోలీసుల దాడులతోనైనా బ్రేక్‌ పడేనా..?

Jun 4 2025 12:19 AM | Updated on Jun 4 2025 12:19 AM

● వడ్

● వడ్డీ వ్యాపారుల ఆగడాలు ● అసలు కంటే కొసరే ఎక్కువ ● రుణ

సాక్షి,ఆదిలాబాద్‌: జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు పూర్తిస్థాయిలో బ్రేక్‌ పడటం లేదు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశాల మేరకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఇటీవల వడ్డీ వ్యాపారుల ఇళ్లలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లావ్యాప్తంగా సుమారు 50 కేసుల వరకు నమోదయ్యాయి. అయినప్పటికీ వ్యాపారుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్టుగా.. అప్పుపై వడ్డీ వసూలుతో పీల్చి పిప్పి చేయడమే కాకుండా రుణగ్రహితకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటి ఘటనలు జిల్లాలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. పోలీసుల దాడుల్లో విలువైన ప్రామిసరీ నోట్లు, చెక్కులు, ఆస్తుల పత్రాలు వంటివి బయటపడిన విషయం విదితమే. దీన్ని పూర్తిస్థాయిలో అరికట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

రైతులకు వల..

ప్రస్తుతం వానకాలం సీజన్‌ పంటసాగు మొదలు కానుంది. ఈ సమయంలో రైతులకు బ్యాంకు అప్పు పుట్టని పరిస్థితిలో ప్రైవేట్‌ వ్యాపారులనే ఆశ్రయిస్తారు. ప్రధానంగా వ్యాపారులు మార్కెట్లో కాటన్‌ కమీషన్‌ ఏజెంట్ల ద్వారా రైతులకు అప్పు ఇస్తుంటారు. పంట కాలం తర్వాత తిరిగి చెల్లించడం జరుగుతుంది. దీనికి గాను 18 నుంచి 24 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుంటారు. ఓ వడ్డీ వ్యాపారి ఈ సీజన్‌లో ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా కాటన్‌ కమీషన్‌ ఏజెంట్లకు అప్పు ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతుంది. ఈ ఏజెంట్లు రైతులకు అప్పు ఇచ్చి పంట విక్రయ సమయంలో అధిక వడ్డీ వసూలు చేస్తుంటారు. అలాగే ఏజెంట్‌ సూచించిన వ్యాపారికే పంట విక్రయించడం వంటివి జిల్లాలో ఏటా జరుగుతున్న సంఘటనలే. ప్రధానంగా కాటన్‌ కమీషన్‌ ఏజెంట్‌ నుంచి అప్పు తీసుకున్న రైతు అతని వలలో చిక్కుతాడు. పంట దిగుబడి చేతికొచ్చిన తర్వాత వాటిని విక్రయించడంలోనూ కమీషన్‌ ఏజెంట్‌దే పైచెయ్యి అవుతుంది. మద్దతు ధర కంటే తక్కువకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఏజెంట్లు భారీగా ఆర్జిస్తుంటారు. ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతుకు మాత్రం ఏమి మిగలడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

‘అతను ఆదిలాబాద్‌లో ఓ పెట్రోల్‌బంక్‌ యజమాని.. హైదరాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు జిల్లా కేంద్రంలోని ఓ పేరుమోసిన వడ్డీ వ్యాపారి నుంచి రూ.లక్షల్లో అప్పు తీసుకున్నాడు. అయితే సదరు వ్యక్తి ఫ్లాట్‌ కొనుగోలు చేసిన తర్వాత గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలో వడ్డీ వ్యాపారి అసలుకు వడ్డీ కలిపి ఈ అప్పును రూ. కోటికి చేర్చాడు. ఆ డబ్బులు కట్టాలని వారిపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లో తమకు ఉన్న విలువైన ఇంటిని అమ్మి అతడి అప్పు తీర్చాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ వడ్డీ వ్యాపారికి ఆ విలువైన ఇంటిపై కన్ను పడింది. అప్పుకంటే రెండింతలు మార్కెట్లో అధిక రేటు పలికే ఆ ఆస్తిని తనకు తక్కువ ధరకే విక్రయించాలని ప్రస్తుతం ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ అంశం తాజాగా ఆదిలాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు ఈ ఘటన ఓ నిదర్శనం.

అధిక వడ్డీ తీసుకుంటే కఠిన చర్యలు

వడ్డీ వ్యాపారులు నిబంధనలను అతిక్రమించి వ్యాపారం చేయవద్దు. కొంత మంది పేదల భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకొని అధిక వడ్డీలకు ఇస్తున్నారు. ఈ క్రమంలో రుణం కట్టకపోవడంతో వారి భూములను లాక్కుంటున్నట్లు దృష్టికి వస్తుంది. బాధితులు ఉంటే పోలీసులను సంప్రదించాలి. అధిక వడ్డీ తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు.

– అఖిల్‌ మహాజన్‌, ఎస్పీ

● వడ్డీ వ్యాపారుల ఆగడాలు ● అసలు కంటే కొసరే ఎక్కువ ● రుణ1
1/1

● వడ్డీ వ్యాపారుల ఆగడాలు ● అసలు కంటే కొసరే ఎక్కువ ● రుణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement