breaking news
woman deliver
-
108లో అరుదైన ఘటన.. ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన తల్లి
నరసరావుపేట టౌన్/మాచర్ల: కవలపిల్లలు 108 వాహనంలో జన్మించిన సంఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఎం. అనురాధ పురిటి నొప్పులతో బాధపడుతూ సోమవారం రాత్రి 108 అంబులెన్స్ను అశ్రయించింది. అక్కడకు చేరుకున్న సిబ్బంది ఆమెను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి గర్భంలో కవలలు ఉన్నట్లు గుర్తించారు. మొదటి కాన్పు కావటంతో హైరిస్క్ కేసుగా నిర్థారించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు రిఫర్ చేశారు. దీంతో మాచర్ల 108 అంబులెన్స్లో ఆమెను అర్థరాత్రి తీసుకొని బయలుదేరారు. మార్గమధ్యంలో గర్భిణికి నొప్పులు తీవ్రం కావటంతో వాహనం పక్కకు నిలిపి పరిస్థితిని 108 ఈఆర్సీపీ డాక్టర్ సుప్రియ, జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లుకు వివరించారు. వారి సూచనల మేరకు ఈఎంటీ హుస్సేనమ్మ, పైలెట్ అర్జున్ కుమార్, ఓఈ మారుతి ప్రసవ ప్రక్రియను నిర్వహించారు. మొదట మగ శిశువు జన్మించాడు. కొద్ది సేపటి తరువాత మరో మగ శిశువు పుట్టాడు. ప్రసవం అనంతరం తల్లితో పాటు ఇద్దరు శిశువులకు అవసరమైన ఆక్సిజన్, ప్లూయిడ్స్ అందించారు. ప్రథమ వైద్యసహాయం అనంతరం నరసరావుపేట వైద్యశాలలో చేర్పించారు. ఆపదసమయంలో సకాలంలో స్పందించి తల్లితో పాటు ఇద్దరు శిశువులను రక్షించిన 108 సిబ్బందిని బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 పథకం గురించి ఆ తల్లి కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు. ఇదీ చదవండి: పురోహితుడు లేని పెళ్లి -
కవలలకు పురుడు పోసిన 108
అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని పులచెర్ల గ్రామానికి చెందిన బెస్త ఆదిలక్ష్మి(25)కి శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. కణేకల్లులోని 108 సిబ్బంది ఉదయం 10 గంటలకు వచ్చి ఆమెను తీసుకుని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి బయలుదేరారు. రమనేపల్లి వద్ద ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. పరిస్థితి హైరిస్క్గా అనిపించడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి ఈఎంటీ(ఎమర్జెనీ మెడికల్ టెక్నీషియన్) మోహన్ ఫైలెట్ రఫీ సహకారంతో అక్కడే సురక్షితంగా కాన్పు చేశారు. ఆదిలక్ష్మి కవలలకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా బయటపడ్డారు. కాన్పు అనంతరం వారిని కళ్యాణదుర్గం ఆసుపత్రిలో చేర్పించారు. హైరిస్క్ కేసును భగవంతుని దయతో విజయవంతంగా నిర్వహించగలిగామని ఈఎంటీ అన్నారు. - కణేకల్లు


