breaking news
Water Tribunal
-
Water Dispute: సగం వాటాపై కొట్లాడదాం..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం.. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా పెంచుకునే అవకాశాలపై దృష్టి సారిం చింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు బోర్డుల పరిధిని ఖరారు చేశామని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో అదే చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్ విచారణకు పట్టుబట్టేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. నదీ జలాల వివాద చట్టం 1956లోని సెక్షన్–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పునఃపంపిణీ చేసేలా కేంద్రానికి లేఖ రాయా లని భావిస్తోంది. అదే సమయంలో రాజ కీయంగా కూడా ఒత్తిడి తెచ్చేలా ప్రణాళికను రూపొందిస్తోంది. అయితే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తుది తీర్పు వెలువడేందుకు ఏళ్ల తరబడి సమయం పట్టే అవకాశం ఉన్న దృష్ట్యా, అప్పటిలోగా, ప్రస్తుతం 66:34 శాతంగా ఉన్న నీటి వాటాల నిష్పత్తిని 50:50 శాతంగా మార్చేలా కేంద్రంపై పోరాడాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ అంశంపై అంతర్రాష్ట్ర విభాగం ఇంజనీర్లతో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ సోమ వారం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. పునఃపంపిణీపై ఒత్తిడి పెంచాలి కేంద్రం వెలువరించిన గెజిట్ తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులకు భంగం వాటిల్లేలా ఉన్నా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నా న్యాయపోరాటం చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదెలా ఉన్నా తొలుత చట్ట ప్రకారం వాటాలు పెంచుకునేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. కృష్ణా జలాల్లో ఏ లెక్కన చూసినా తమ వాటాలు పెరగాలని తెలంగాణ తొలి నుంచి వాదిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతంలో 68.5 శాతం రాష్ట్రానిదే అయినా.. నీటి కేటాయింపులు మాత్రం 37 శాతమే ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పైగా కృష్ణా పరివాహకం కింద సాగు యోగ్య భూమి తెలంగాణలో 37.11లక్షల హెక్టార్లు ఉండగా, ఏపీలో 16.03 లక్షల హెక్టార్లు మాత్రమే ఉందని చెబుతోంది. ఈ లెక్కన రాష్ట్రానికి 811 టీఎంసీల్లో కనీసంగా 560 టీఎంసీలు దక్కాలని అంటోంది. ఈ అంశాలన్నీ అనేకమార్లు కేంద్రం దృష్టికి తెచ్చింది. గత ఏడాది అక్టోబర్లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ ప్రస్తావించగా.. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ను విత్డ్రా చేసుకుంటే న్యాయసలహా తీసుకొని కొత్త ట్రిబ్యునల్పై ఆలోచన చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం పిటిషన్ విత్డ్రా చేసుకుంది. తాజాగా కేంద్రం గెజిట్ వెలువరించిన నేపథ్యంలో నదీ జలాల వివాద చట్టం 1956లోని సెక్షన్–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పునఃపంపిణీ చేసేలా ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. సోమవారం జరిగిన సమీక్షలో కూడా తెలంగాణకు వాటాలు పెరిగేలా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. దీంతో పాటే ప్రాజెక్టులకు డీపీఆర్లు సమర్పించి, వాటికి అనుమతులు పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియను వేగిరం చేయడంపై భేటీలో చర్చించారు. ఎలా చూసినా రాష్ట్ర వాటా పెరగాలి: రజత్కుమార్ తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నామని స్పెషల్ సీఎస్ రజత్కుమార్ చెప్పారు. ఇంజనీర్లతో సమీక్షకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పరివాహకం, ఆయకట్టు, జనాభా.. ఏ లెక్కన చూసినా తెలంగాణకు 811 టీఎంసీల్లో 560 టీఎంసీలు దక్కాలి. అయితే తాత్కాలికంగా అయినా ఏపీ, తెలంగాణకు చెరిసగం నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాం. అపెక్స్ కౌన్సిల్లో చెప్పిన మేరకు, సెక్షన్–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వాటాలు తేల్చాలి..’ అని ఆయన అన్నారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్తో న్యాయపరంగా, సాంకేతికంగా, పాలనా పరంగా ఏర్పడే ఇబ్బందులపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుల డీపీఆర్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే 2014కు ముందు చేపట్టిన దేవాదుల వంటి ప్రాజెక్టులకు డీపీఆర్లు కోరడంపైనే అభ్యంతరాలున్నాయని చెప్పారు. -
పోలవరంలో తెలంగాణకు వాటా
-
పోలవరంలో తెలంగాణకు వాటా
నీరే కాదు విద్యుత్లోనూ తెలంగాణ రాష్ట్రానికి వాటా జల సంఘం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ {పత్యేక అథారిటీలోనూ భాగస్వామ్యం తెలంగాణకు వాటాను వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్ దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం ఉపయోగంలోకి వచ్చే నీరు 303 టీఎంసీలు సాగు నీరు 7.20 లక్షల ఎకరాలకు (ప.గోదావరి) వరదలప్పుడు పంచుకోవాల్సిన నీరు 45 టీఎంసీలు ఉత్పత్తి అయ్యే విద్యుత్ 960 మెగావాట్లు (కేంద్రం తాజా నోటిఫికేషన్తో నీటితోపాటు విద్యుత్నూ తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచుకోవాల్సి వస్తుంది) సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో నీటితోపాటు విద్యుత్లోనూ తెలంగాణ రాష్ట్రానికి వాటా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్, నీరు ఇరు రాష్ట్రాలు పంపిణీ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర జలసంఘం ప్రత్యేక నోటిఫికేషన్ను జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద ఈ ప్రాజెక్టును చేపడుతున్న విషయం తెలిసిందే. దీనికి జాతీయహోదా కల్పించిన నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భాగస్వామ్యం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్యదర్శి (ఐఏఎస్)ని సభ్యుడిగా చేర్చాలని నోటిఫికేషన్లో సూచించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుండగా ఇందులో కూడా తెలంగాణకు భాగం ఉంటుందని పేర్కొంది. నీటి విషయంలో ఇప్పటికే తెలంగాణకు కోటా కల్పించారు. దీంతో నీటిని కూడా రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్టు ద్వారా సుమారు 303 టీఎంసీల గోదావరి నీరు ఉపయోగంలోకి రానుండగా, పశ్చిమగోదావరి జిల్లాలోని 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. విశాఖపట్నం తాగునీటి అవసరాలకు, పరిశ్రమల కోసం ఈ నీటిని తరలించాల్సి ఉంది. వరదలు వచ్చే సమయంలో 80 టీఎంసీల నీటిని ఇటు కృష్ణా బేసిన్కు అందించాల్సి ఉంది. ఈ 80 టీఎంసీల నీటిలో 45 టీఎంసీలు తెలంగాణ, సీమాంధ్రలు కలిసిన ఉమ్మడి రాష్ట్రానికి, మిగిలిన 35 టీఎంసీల నీటిని ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగినందున ఈ 45 టీఎంసీలను కూడా ఇరు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్లో పైన పేర్కొన్న అంశాలను చేర్చినట్టు సమాచారం. నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తోన్న ప్రభుత్వం పోలవరంలో తెలంగాణకు వాటా ఇవ్వాలంటూ నోటిఫికేషన్లో పేర్కొనడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ స్థలంతో పాటు ముంపు ప్రాంతాలు, ఆయకట్టు కూడా ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఉండగా.. తెలంగాణకు వాటా ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుందని రాష్ట్ర అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) బుధవారం సదరు లేఖను ఉన్నతాధికారుల పరిశీలనకు పంపించినట్టు సమాచారం. రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించిన తర్వాత దానిని కేంద్రానికి పంపించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాల్లోని సుమారు 208 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఈ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కలుపుతూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణలో ఆందోళనలు జరుగుతున్నారు.