vigilance probe
-
ఫోకల్ అధికారి.. అవినీతి సవారీ!
ఆర్డబ్ల్యూఎస్లో హల్చల్ అధికార పార్టీ నేతల అండ కాంట్రాక్టర్ల గగ్గోలు రూ.22 కోట్ల పనులపై విజిలెన్స్ దర్యాప్తు ఆర్డబ్ల్యూఎస్లో ఆయనో అవినీతి తిమింగలం. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితేనేం అధికార పార్టీ నేతల అండదండలతో ఫోకల్ పోస్టింగ్ తెచ్చుకున్నాడు. పర్సంటేజ్ల కోసం కాంట్రాక్టర్లను కాల్చుకుతింటున్నాడు. అయ్యగారి ‘ఆనందం’ కోసం ముడుపులు సమర్పించుకోలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనలూ అనేకం ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్లో పనంటే.. అయ్య ‘బాబో’య్ అనే పరిస్థితి నెలకొంది. విజయవాడ : అధికార పార్టీ నేతల అండతో ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం)లో ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అడ్డంగా దోచేస్తున్నారు. పర్సంటేజీ డబ్బు కోసం కాంట్రాక్టర్లను వేధింపులకు గురిచేస్తూ, బిల్లులు చేయటంలో ప్రజాప్రతినిధులను ఇబ్బందులు పెడుతున్నా అధికార పార్టీ నేతలు ఆ బాబుపై వల్లమాలిన అభిమానం చూపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 2014లో ఏసీబీ ట్రాప్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆ అధికారి, తాను పనిచేసే శాఖ ముఖ్య ప్రజాప్రతినిధికి లక్షలు కుమ్మరించి ఆదాయం దండిగా వచ్చే గన్నవరం నియోజకవర్గంలో ఫోకల్ పోస్టింగ్ పొందారు. అంతేకాదు.. పామర్రు నియోజకవర్గంలో ఇన్చార్జి బాధ్యతను కూడా అధికార పార్టీ నేత అండతో కైవసం చేసుకున్నారు. గన్నవరం, పామర్రు నియోజకవర్గాల్లో రెండు ఫోకల్ పాయింట్లను దున్నేస్తూ, కాంట్రాక్టర్లను, ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురిచేస్తున్న వైనంపై పలువురు కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏడాదికాలంగా దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు విలువైన బిల్లులకు ఆయన చెక్ మెజర్మెంట్ చేయటం గమనార్హం. ఏసీబీ కేసును ఎదుర్కొంటున్న అధికారికి బిల్లులు, చెక్ మెజర్మెంట్ చేసి ఎంబుక్లు రికార్డు చేసే అధికారం లేదని, ఉయ్యూరు ప్రాంతానికి చెందిన పలువురు కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన్ని ఫోకల్ పోస్టింగ్ నుంచి తప్పించాలని వారు కోరుతున్నారు. సదరు అధికారి తీరుతో పలువురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.4 కోట్ల పనులకు ముగ్గురు కాంట్రాక్టర్లు... గన్నవరం నియోజకవర్గంలో పదిరోజుల క్రితం పైపులైన్ పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. బాపులపాడులో జాతీయ రహదారి అధికారులు రోడ్ల విస్తరణకు సంబంధించి తాము చెల్లించాల్సిన రూ.4 కోట్ల పనులకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా టెండర్లు పిలిపించారు. వీటికి కనీసం 30 మంది కాంట్రాక్టర్లు పోటీపడి 20 శాతం తక్కువకు టెండర్లు వేయాల్సి ఉందని, కేవలం ముగ్గురే టెండర్లు వేయటం, మిగిలినవారు వెనకడుగేయటం సదరు అధికారికి భయపడటం వల్లేనని ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడిందని తెలుస్తోంది. ఫిర్యాదులు ఇలా... ఇటీవల పామర్రు నియోజకవర్గంలో జరిగిన రూ.22 కోట్ల విలువైన పైపులైన్ పనులపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై విజయవాడ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రూ.6 కోట్లతో చేపట్టిన అయ్యంకి నుంచి మొవ్వ స్కీమ్, రూ.16 కోట్లతో అయ్యంకి వయా యలమర్రు మీదుగా వెంట్రప్రగడకు చేసిన వాటర్ స్కీమ్లపై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. కొద్ది మాసాల క్రితం పామర్రు నియోజకవర్గంలోని యలమర్రు గ్రామ పంచాయతీలో ఓ బోరులో పాత మోటారు బిగించి కొత్తది కొన్నట్టు బిల్ చేశారు. దీనిపై రగడ జరగటంతో అధికార పార్టీ ముఖ్య నేత సహాయంతో బయటపడ్డారు. బాపులపాడు మండలంలోని పెలైట్ ప్రాజెక్టులో మోటార్లు లేకుండానే బిల్లులు చేసినట్లు ఫిర్యాదులు అందాయి.నెల రోజుల క్రితం భూపతిరెడ్డి అనే కాంట్రాక్టరు పామర్రులోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో అందరూ ఉండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. పక్కనున్నవారు అతన్ని వారించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో సదరు అధికారి పెడుతున్న ఇబ్బందులే కారణమని అతను ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం. నాలుగు మాసాల క్రితం పామర్రు నియోజకవర్గంలో బిల్లుల పెండింగ్ అంశంపైనే తీవ్ర ఆవేదనతో వెంకటేశ్వరరావు అనే కాంట్రాక్టరు తాను నిర్మించిన ట్యాంకు పైనుంచి దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. కిందిస్థాయి అధికారులు జోక్యం చేసుకుని అతని సమస్య పరిష్కరించారు. -
‘చంద్రన్న’ స్కాంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలి
* కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి డిమాండ్ * సింగపూర్కు వందెకరాలివ్వడం దారుణం సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిస్తున్న నిత్యావసర సరుకుల కొనుగోలులో జరిగిన కుంభకోణంపై విజిలెన్స్ శాఖతో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని కర్నూలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘చంద్రన్న కానుక’కు టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన రూ.280 కోట్లలో 60 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ధ్వజమెత్తారు. ఈ పథకం కింద ప్రజలకు సరఫరా చేస్తున్న మొత్తం ఆరు రకాల సరుకుల మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. కందిపప్పు, బెల్లం, నెయ్యి మార్కెట్ ధరలకు, టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలకు బాగా వ్యత్యాసం ఉందని చెప్పారు. సరుకులన్నీ పెట్టి ఇచ్చే గిఫ్ట్ సంచుల్లో కూడా భారీ కుంభకోణం జరిగిందన్నారు. ఒక గిఫ్ట్ సంచి ధర మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 ఉంటే ప్రభుత్వం దాన్ని రూ.11.60 పైసలకు కొనుగోలు చేసిందని చెప్పారు. సంచుల కొనుగోలులో రూ.8 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందన్నారు. చౌక డిపోల నుంచి సరుకులు తెచ్చుకోవడానికి ప్రజలు సొంత సంచులను తీసుకెళుతుంటారని, అలాంటప్పుడు ప్రభుత్వం గిఫ్ట్ సంచులను ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ఓ మంత్రి అనుచరుడికి దోచి పెట్టడానికే ఈ సంచులను కొనుగోలు చేశారన్నారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఈ సంచుల కొనుగోలుకు ఎందుకు తగలేశారని ప్రశ్నించారు. కందిపప్పులో రూ.12 కోట్లు, నెయ్యి కొనుగోలులో రూ.26 కోట్లు, సంచుల్లో రూ.8 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇవిగాక బెల్లాన్ని కూడా మార్కెట్ ధరకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని చెప్పారు. చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థకు, తెలుగు తమ్ముళ్లకు, ఎన్నికల్లో తనకు నిధులు సమకూర్చినవారికి ఆర్థికలబ్ధి చేకూర్చేందుకే ఈ పథకం ఉపయోగపడిందని పేర్కొన్నారు. దీన్ని ప్రజలకిచ్చిన చంద్రన్న కానుక అనాలా లేక చంద్రబాబు హెరిటేజ్కు, తెలుగు తమ్ముళ్లకు ఇచ్చిన పండుగ కానుక అనాలా.. అని ఎద్దేవా చేశారు. చంద్రన్న కానుక వ్యవహారం చూస్తే పోకిరి సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందం బిచ్చగాడికి అర్ధరూపాయి వేసి పండుగ చేస్కో.. అన్నట్లుగా ఉందన్నారు. సంక్రాంతికి రైతుల ఇళ్లకు అల్లుళ్లు, కు మార్తెలు, బంధువులంతా వస్తారని, ఏ ఇంట్లో నూ పదిమందికి తక్కువుండరని.. వారు వంటలు వండుకోవడానికి ప్రభుత్వమిచ్చే కొద్దిపాటి సరుకులు ఏంసరిపోతాయని ప్రశ్నించారు. సింగపూర్ కంపెనీకి వందెకరాల భూమి ఇవ్వడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి ఉచిత సేవలందించడానికి సింగపూర్ కంపెనీలేమైనా మనకు బంధువులా అని తొలుత కూడా తాము ప్రశ్నించామని, ఈ వందెకరాలు ఇస్తుంటే అసలు విషయం బయటపడుతోందని ఆయన చెప్పారు.