breaking news
Vicat cement
-
ఏపీలో ‘వికా’ భారీ విస్తరణ
సాక్షి, అమరావతి : ఫ్రెంచ్ సిమెంట్ దిగ్గజ సంస్థ వికా ఇండియాలో భారీగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. కార్పొరేట్ ట్యాక్స్ను కేంద్రం భారీగా తగ్గించడంతో రానున్న రోజుల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు వికా గ్రూపు చైర్మన్ గై సిడోస్ వెల్లడించారు. ఫ్రాన్స్ ప్రతినిధుల బృందంతో రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సిడోస్... దేశవ్యాప్తంగా సిమెంట్ పరిశ్రమ పరిస్థితులు, విస్తరణ ప్రణాళికలను ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ఆ వివరాలు... కొన్ని నెలలుగా దేశీయ సిమెంట్ పరిశ్రమ తిరోగమన దశలో ఉంది. మున్ముందు పుంజుకునే అవకాశాలున్నాయా? వృద్ధిరేటు మందగమనంతో కొంత కాలంగా సిమెంట్ పరిశ్రమ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశీ సిమెంట్ పరిశ్రమలో తీవ్రమైన పోటీ ఉండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు సహజమే. ప్రభుత్వం ఇన్ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెట్టడంతోపాటు, రహదారులు, గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. కాబట్టి ము న్ముందు సిమెంట్కు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వమే 25 లక్షల గృహాలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ అంశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. కేంద్రం ఒక్కసారిగా కార్పొరేట్ ట్యాక్స్ను 10% తగ్గించడాన్ని ఎలా చూస్తున్నారు? ఇది వృద్ధిరేటును పెంచే సాహసోపేతమైన నిర్ణయం. ఇప్పటి వరకు ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ అధికంగా ఉండేది. దీన్ని కేంద్రం ఒక్కసారిగా భారీగా తగ్గించడమే కాకుండా ఇతర దేశాల కంటే కనిష్ట స్థాయికి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో కంపెనీలకు అదనపు నిధులు వస్తాయి. దీంతో కంపెనీల విస్తరణ సామర్థ్యాలు పెరుగుతాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గన నేపథ్యంలో విస్తరణ ప్రణాళికలేమైనా ఉన్నాయా? దేశంలో సిమెంట్కు డిమాండున్న నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించాం. ప్రస్తుతం కడపలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన భారతి సిమెంట్, కర్నాటక జిల్లా కల్బుర్గిలో మరో యూనిట్ ఉన్నాయి. ఈ రెండు యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 8 మిలియన్ టన్ను లు. దీన్ని రానున్న సంవత్సరాల్లో 11 మిలియన్ టన్నులకు పెంచాలని లకి‡్ష్యంచుకున్నాం. ఏపీలో కొత్తగా ఏమైనా పెట్టుబడులుపెడుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో మరిన్ని రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. కాకపోతే వీటి గురిం చి ఇప్పుడే వివరించలేం. పునురుత్పాదక ఇంధన రంగంలోకి అడుగుపెడుతున్నాం. ఇందులో భాగంగా కడప భారతి యూనిట్లో సొంత అవసరాల కోసం 10 మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నాం. వారం రోజుల్లో ఈ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాం. ఈ రెండు రోజులూ మీ పర్యటన ఎలా సాగింది? ఫ్రాన్స్కు చెందిన పరిశ్రమలు, వాణిజ్య ప్రతినిధుల సమాఖ్య (మెడెఫ్) సభ్యులతో కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలున్న రంగాలను పరిశీలించాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులకు సహకారమందిస్తామని చెబుతోంది. ముఖ్యంగా అర్బన్ ఇన్ఫ్రా, పోర్టులు, ఎనర్జీ, ఫుడ్ ప్రోసెసింగ్ రంగాల్లో అనేక అవకాశాలున్నాయి. ఈ పర్యటన ఫలితాలు రానున్న కొద్ది నెలల్లోనే ఏపీ చూస్తుంది. -
వైజాగ్లో వికా గ్రూపు గ్రైండింగ్ యూనిట్
ముంబై: ఫ్రెంచ్ సిమెంట్ దిగ్గజం వికా గ్రూపు భారత మార్కెట్లో వికా బ్రాండ్ను విడుదల చేసింది. దేశీయంగా తయారీ సామర్థ్య విస్తరణపై ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.300 కోట్లు వెచ్చించినట్టు వికా ఇండియా సీఈవో అనూప్ కుమార్ సక్సేనా ముంబైలో మీడియాకు తెలిపారు. ‘‘భారత్లో భారీ విస్తరణ ప్రణాళికలతో ఉన్నాం. 2021 నాటికి 1,700 కోట్లను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మా సిమెంట్ తయారీ సామర్థ్యం 13 మిలియన్ టన్నులకు విస్తరించనున్నాం. ఇప్పటికే ఈఏడాది రూ.300 కోట్లను ఖర్చు చేశాం. ముంబైలోని కలంబోలి వద్ద 1.2 మిలియన్ టన్నుల బల్క్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు, తర్వాత కల్బుర్గి సిమెంట్ ప్లాంట్ను 2.75 మిలియన్ టన్నులకు విస్తరణ, ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో 1.7 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నాం. కడప జిల్లాలో రెండంచెల ఇంటెగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ కూడా ఉంది. భారత్లో మా మొత్తం సామర్థ్యం 7.75 మిలియన్ టన్నులు’’ అని సక్సేనా తెలిపారు. -
భారతి, కల్బుర్గి సిమెంట్ ప్లాంట్లకు ఎనర్జీ ఎఫిసియెంట్ అవార్డులు
భారత్లో వికాట్ సిమెంట్ తయారీ కర్మాగారాలు- కల్బుర్గి ప్లాంట్ (కల్బుర్గి సిమెంట్), కడప ప్లాంట్ (భారతి సిమెంట్ కార్పొరేషన్)లకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతిష్టాత్మక ఎనర్జీ ఎఫిసియెంట్ అవార్డులు లభించాయి. హైదరాబాద్, హెచ్ఐసీసీలో సీఐఐ 2016 ఎక్స్లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ 17వ జాతీయ అవార్డుల ప్రక్రియ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ జరిగింది. ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకోడానికి సిమెంట్ విభాగంలో ఏకంగా 80 ప్లాంట్స్ పోటీపడ్డాయి. అయితే చివరకు అవార్డులను గెలుచుకున్న 32 ప్లాంట్లలో కల్బుర్గి ప్లాంట్, భారతి సిమెంట్ (కడప) ప్లాంట్ నిలిచాయి. కల్బుర్గి సిమెంట్స్సహా మొత్తం ఎనిమిది సిమెంట్ ప్లాంట్స్ ‘‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిసియెంట్ యూనిట్’’ అవార్డులను దక్కించుకున్నాయి. భారతి సిమెంట్ కార్పొరేషన్సహా 24 సిమెంట్ ప్లాంట్స్కు ‘‘ఎనర్జీ ఎఫిసియెంట్ యూనిట్’’ గుర్తింపు లభించింది. వికాట్ ఇండియా సీఓఓ అనూప్ కుమార్ సక్సేనా, భారతి సిమెంట్ కడప ప్లాంట్ హెడ్ ఎం.సాయి రమేశ్, కల్బుర్గి ప్లాంట్ హెడ్ అనుభవ్ వర్మలు అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు.