అనుమానాస్పద స్థితిలో బ్యాంకు ఉద్యోగి మృతి
నెల్లికుదురు : అనుమానాస్పద స్థితిలో బ్యాంకు ఉద్యోగి మృతి చెందిన ఘటన మండలంలోని బంజర బస్టాండ్ వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎస్సై గోదరి రాజ్కుమార్ కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన కార్పాకుల రవికాంత్(54) ఎస్బీహెచ్లో ఉద్యోగం చేస్తున్నాడు. గత సంవత్సరం తొర్రూర్ ఎస్బీహెచ్లో మేనేజర్గా పనిచేసి పదోన్నతిపై వైజాగ్లో జోనల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తొర్రూర్ ఎస్బీహెచ్లో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసేందకు బుధవారం వచ్చారు.
బుధవారం 3 గంటల తర్వాత రవికాంత్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తోందని భార్య సెలీనా ఫిర్యాదులో పేర్కొంది. అయితే బుధవారం అర్ధరాత్రి నుంచి బంజర స్టేజి వద్ద కారు ఉందని, గురువారం ఉదయం చూసేసరికి డ్రైవర్ సీట్లో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. మృతుడి చొక్కా జేబులో ఉన్న ఐడీ కార్డు ద్వారా మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఎస్సై చెప్పారు. భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని మహబూబాబాద్ రూరల్ సీఐ కృష్ణారెడ్డి పరిశీలించారు. రవికాంత్ తొర్రూరులో పనిచేస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయని, ఆయన మృతికి అవే కారణమై ఉండవచ్చునని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.