breaking news
Telugu literary seminar
-
దిగ్విజయంగా ముగిసిన 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, న్యూజిలాండ్ తెలుగు సంఘం, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, మలేషియా తెలుగు సంఘం, వంశీ ఆర్ట్ థియేటర్స్ భారతదేశం, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు తల్లి కెనడా, సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" 3వ రోజు కార్యక్రమం, అక్టోబర్ 2, 2022, ఆదివారం అంతర్జాలం ద్వారా 14 గంటల పాటు దిగ్విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటులు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా పాల్గొనగా, పారిస్ నుండి డా. డేనియల్ నేజర్స్ సదస్సు సమాపన సమావేశంలో పాల్గొని స్వచ్ఛమైన తెలుగులో ప్రసంగించారు. అంతకు ముందు సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో మొదటి రెందు రోజుల సాహిత్య ప్రసంగాలూ న్యూజీలాండ్ లో ప్రత్యక్ష వేదిక, అలాగే అంతర్జాలంలోనూ 24 గంటలు నిర్విరామంగా జరిగిన సంగతి తెలిసినదే. సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, రాధాకృష్ణ గణేశ్న ప్రధాన సాంకేతిక నిర్వాహకులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ నాటి సదస్సులో సుమారు 75 మంది భారతదేశ వక్తలు తమ వైవిధ్యభరితమైన సాహిత్య ప్రసంగాలను అందించారు. రాధిక మంగిపూడి (ముంబై), సుబ్బు పాలకుర్తి (సింగపూర్), గౌతమ్ లింగా (జొహానెస్ బర్గ్), జయ పీసపాటి (హాంగ్ కాంగ్), రాధిక నోరి (అమెరికా), శ్రీసుధ (ఖతర్) ఈ సదస్సులోని ఆరు వేదికలను సమర్థవంతంగా నిర్వహించగా డా. ఎస్ ఆర్ ఎస్ కొల్లూరి(అమలాపురం) నిర్వహణలో ఒక ప్రత్యేక కవి సమ్మేళన వేదిక, కథా పఠనాలు, శారద కాశీవజ్ఝల (అమెరికా) నిర్వహణలో సాహిత్యం క్విజ్ మొదలైన ఆసక్తికరమైన అంశాలతో ఈ సదస్సు అందరినీ ఆకట్టుకుంది. ‘వసంతవల్లరి’ అయ్యగారి వసంతలక్ష్మి గళంలో “వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన అమెరికామెడీ కథలు” ఆడియో పుస్తకాన్ని తనికెళ్ళ భరణి ఆవిష్కరించగా, “డయాస్పోరా తెలుగు కథ, సాహిత్యం అంటే ఏమిటి?” అనే వ్యాస సంకలనాన్ని సంపాదకులు వంగూరి చిట్టెన్ రాజు పరిచయం చేశారు. వంశీ రామరాజు, రామ చంద్రమౌళి, గంటి భానుమతి, చిత్తర్వు మధు మొదలయిన లబ్ఢప్రతిష్టులు, సిలిలిక, అనఘ దత్త మొదలయిన చిన్నారుల ప్రసంగాలతో సదస్సు ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. ముగింపు వేదికలో మూడు రోజుల సదస్సు విశేషాలను సమీక్షిస్తూ సుమారు 25 దేశవిదేశాల వక్తలకీ, 18 మంది వేదిక నిర్వాహకులకీ, 30 మంది సాంకేతిక నిర్వాహకులకీ, ఆర్ధిక సహకారం అందజేసిన దాతలకీ, మీడియా ప్రతినిధులకీ నిర్వాహకులు తమ ధన్యవాదాలు తెలిపారు. 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం సభ్యులు కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు. అలాగే వచ్చే ఏడాది జూన్ 22, 23, 24 తేదీలలో ఫ్రాన్స్ లోని పారిస్ మహా నగరంలో INALCO University ఆధ్వర్యంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తదితరుల సహకారంతో తెలుగు భాష, సాహిత్యం, కళా రూపాలు, జానపదాలని ఫ్రాన్స్ దేశవాసులకి పరిచయం చేయడానికి ఒక సమగ్రమైన కార్యక్రమానికి రూప జరుగుతోంది ఆ సాంస్కృతిక కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం అనీ ప్రొఫెసర్ డేనియల్ నెజెర్స్ (యూనివర్శిటీ ఆఫ్ పారిస్), వంగూరి చిట్టెన్ రాజు తమ సంయుక్త ప్రకటనలో తెలియ జేశారు. -
రాజకీయం రాష్ట్రాన్ని ముక్కలు చేసింది
తెలుగు సాహితీ సదస్సులో బుద్ధప్రసాద్ విజయవాడ కల్చరల్ : ప్రపంచం తెలుగువారికి వేదిక కావాలని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య ముమ్మనేని సుబ్బారావు కళాపీఠం సంయుక్త నిర్వహణలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన తెలుగు సాహితీ సదస్సులో మాట్లాడుతూ,తెలుగు భాషాసంస్కృతుల సమ్మేళనమే ప్రపంచ తెలుగు సమాఖ్యఅని, భాషా సంస్కృతులను వాటి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి అభివృద్ధికోసం ప్రపంచ తెలుగు సమాఖ్య పాటుపడుతోందని వివరించారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా వారిని ఏకం చేసేది సాంస్కృతిక వారసత్వమేనని గుర్తుచేశారు. రాజకీయం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని కొత్తరాష్ట్రంలోని కవులు రాష్ట్ర ప్రజలను చైతన్య పరిచేలా రచనలు చేయాలని ఉద్భోదించారు. భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మాట్లాడుతూ భాషా సంస్కృతీ సంప్రదాయాలను కవులు గౌరవించి తమ రచనల ద్వారా తెలుగు జాతిని జాగృత పరచాలన్నారు. కవి సమ్రాట్ విశ్వనాథ ఇంటిని ముఖ్యమంత్రి గారితో కలసి సందర్శించి, విశ్వనాథగృహాన్ని తెలుగు భాషా సంస్కృతులు వెల్లివిరిసేలా పరిరక్షిస్తామన్నారు. ప్రారంభ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు జ్యోతిని వెలిగించి తెలుగు సాహితీ సదస్సులను ప్రారంభించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షులు వియల్ ఇందిరాదత్ మహాసభ లక్ష్యాలను వివరించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వాధ్యక్షులు ఆవుల మంజులత, సిద్ధార్థఅకాడమీ కార్యదర్శి పాలడుగు లక్షణరావు, కష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పాలడుగు లక్షణరావు పాల్గొన్నారు. మాతెలుగు తల్లికి మల్లెపూదండ... సభా ప్రారంభానికి ముందు ప్రపంచ తెలుగు సమాఖ్య అద్యక్షులు వి.ఎల్. ఇందిరాదత్, పొట్టి శ్రీరాములు తెలుగు విద్యాలయం పూర్వధ్యక్షులు ఆవుల మంజులత,కవులు డాక్టర్ జి.వి.పూర్ణచందు, చలపాక ప్రకాష్, గుమ్మా సాంబశివరావు, ఎరుకలపూడి గోపీనాథరావు, సీహెచ్.బృందావనరావు కళాక్షేత్రం వద్దనున్న తెలుగు తల్లివిగ్రహానికి పూలమాలలు వేశారు. పరిశోధనా పత్రాలు సమర్పణ... వెంకటగిరి సంస్థానంలో తెలుగు సాహిత్య కృషి అంశంపై డాక్ట్ర్ సాయికృష్ణ యాచేంద్ర ,తెలుగు ప్రాచీన సాహిత్యం సామాజిక అంశాల అవశ్యకతపై యార్లగడ్డ బాలగంగాధరరావు, నన్నయ్య పూర్వయగంపై ఆచార్య టి .సత్యవతి, కాకతీయానంతర సాహిత్య నేపథ్యంపై ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య పరిశోధనా పత్రాలను సమర్పించారు. అనంతరం కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యామ్,శిష్యబృందం ప్రదర్శించిన పార్వతీ కల్యాణం ప్రేక్షకులను ఆకట్టుకుంది.