breaking news
T Laxminarayana
-
పెడధోరణులపైనే ప్రణబ్ గురి
టి. లక్ష్మీనారాయణ, డెరైక్టర్ నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం ఒకప్పుడు జనా భా నలభై ఐదు కోట్లుగా ఉన్నప్పుడే దేశాన్ని ఐక్యంగా ఉంచుకోలేక పోయాం. నేడు 125 కోట్ల జనాభాను ఒక్కటిగా ఉంచాలి. ఇది జాతి ముం దున్న అతి పెద్ద సవాలు. రాష్ట్రాల విభజన డిమాండ్లు చాలా ముందుకు వస్తున్నాయి. సవ్యమైన విధానాల రూపకల్పనకు దోహదపడే విధంగా వాస్తవాల ఆధారంగా, హేతుబద్ధమైన క్షేత్రస్థాయి సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత నిఘా సంస్థలపై ఉన్నదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గత నెల 19న అన్నారు. తద్వారా అయన చాలా లోతైన అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలతో పాటూ పలు పెడ ధోరణులు పెచ్చరిల్లుతున్న పర్యవసానంగా జాతీయ ఐక్యత పెను సవాలు ఎదురవుతోందని ప్రణబ్ హెచ్చరించారా? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన సమస్య నుంచి ఉత్పన్నమైన పరిస్థితుల కారణంగా పార్లమెంటు అచేతనమై పోవడం పట్ల కలత చెంది అలా వ్యాఖ్యానించారా? ప్రత్యేక తెలంగాణ లోతుపాతులు, పర్యవసానాలపై రాజకీయ విజ్ఞత లోపించిందని భావించారా? ఆ అంశంపై హేతుబద్ధమైన సమాచారాన్ని అందించడంలో నిఘా సంస్థల వైఫల్యాన్ని సూచించారా? ఏది ఏమైనా ఇవన్నీ నిశితంగా పరిశీలించాల్సిన ప్రశ్నలే. ‘విభజన’ మూలాలు: పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలకు అనుగుణంగానే మన రాష్ట్ర అభివృద్ధి గమనం ఉన్నది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి విశాఖలో హిందుస్థాన్ షిప్యార్డు, హైదరాబాద్లో ఆల్విన్, నిజామాబాద్లో నిజాం చక్కెర పరిశ్రమలు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు. 1965-75 మధ్య కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్ లాంటి భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది. పారిశ్రామిక కేంద్రంగా హైదరాబాద్కు (కొంత వరకు విశాఖపట్నానికి) పునాదులు పడ్డాయి. ఏ ఒక్క ప్రభుత్వమూ పారిశ్రామిక వికేంద్రీకరణ వైపు దృష్టి పెట్టలేదు. 1990 దశకం నుంచి ప్రవేశ పెట్టిన సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ఫలితంగా పట్టణాలు నగరాలుగా, నగరాలు మహానగరాలుగా ఎదిగి అభివృద్ధి నమూనాలుగా వెలిశాయి. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ఆర్థిక అసమానతలు అతి వేగంగా పెరిగిపోతుండగా ప్రజల్లో అసంతృప్తి ప్రజ్వరిల్లుతున్నది. ఈ పరిస్థితులు విభజనోద్యమాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనడంలో సందేహం లేదు. రాష్ట్రాలు బలహీనంగా ఉండాలన్న భావజాలంతో బీజేపీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉంది. అవకాశవాదాన్ని తలకెక్కించుకొన్న కాంగ్రెస్ ఓట్లు, సీట్లే కొలబద్దగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానాన్ని అమలు చేస్తున్నది. ‘విభజించి పాలించు’ విధానాన్ని అనుసరిస్తోంది. అస్తిత్వ రాజకీయాల్లో భాగంగా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు పట్టంగట్టే రాజకీయ శక్తులు ఆ ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ‘ప్రత్యేక’ డిమాండ్లేవీ దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించవని కొందరి వాదన. శాంతియుత సహజీవనం సాగించాల్సిన ప్రజల మధ్య విషబీజాలను నాటుతున్నామనే స్పృహ లోపించడం శోచనీయం. అనుభవాల నుంచి ఏం నేర్చుకొన్నాం? బ్రిటిష్ పాలకులు పోతూ పోతూ కుట్రపూరితంగా దేశాన్ని రెండు ముక్కలు చేసి, సరిహద్దుల్లో రావణ కాష్టాన్ని రగిల్చి పోయారు. మన దేశం అండదండలతో సాగిన తూర్పు పాకిస్థాన్ విముక్తి ఉద్యమం ఫలితంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. దీంతో పాక్ మనపై మరింత కక్ష పెంచుకుంది. కాశ్మీర్ సమస్య సాకుతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్నది. అలాంటి సున్నిత రాష్ట్రం జమ్మూ-కాశ్మీర్ను జమ్మూ, కాశ్మీర్, లడఖ్ అనే మూడు రాష్ట్రాలుగా విడగొట్టాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈశాన్యంలో గ్రేటర్ నాగాలాండ్, బోడోలాండ్, గూర్ఖాలాండ్ వగైరా డిమాండ్లతో నిరంతరం ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో పొందుపరచిన 15 భాషలలో స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే సదుపాయాలు పార్లమెంటులోనే లేని దుస్థితి కొనసాగుతున్నది. జనాభాలో 38 శాతం హిందీ మాట్లాడుతున్నా దాన్ని అందరిపై రుద్దాలని చూస్తే ప్రతిఘటన తప్పదు. రాష్ట్రాల చట్టసభల్లో మాతృభాష అమలుకు సైతం చిత్తశుద్ధి ప్రయత్నించాల్సి ఉంది. పార్లమెంటు కార్యకలాపాలపై హిందీని రుద్దే ప్రయత్నాలకు దక్షిణాది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం సహజం. దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాది పెత్తనమే సాగుతోందనే అభిప్రాయం ఇప్పటికే బలంగా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం... ప్రాంతీయ, భాషాపరమైన సమస్యల వంటి సున్నిత సమస్యలపై వివిధ ప్రాంతాల ప్రజల మనోభావాలు సున్నితంగా, జటిలంగా తయారవుతున్నాయి. అవి ఎప్పుడు ఎలా పరిణమిస్తాయోననే సందేహాలను కలుగజేస్తున్నాయి. రాష్ట్రపతి ఆ కోణాన్నే స్పృశించినట్లుంది. ఇలాంటి సమస్యలపై ఆషామాషీగా తీసుకునే నిర్ణయాల వల్ల పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయని రాష్ట్రపతి చెప్పకనే చెప్పారనిపిస్తుంది. నిఘా వర్గాలు నిష్పాక్షికంగా, వాస్తవాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని విధాన నిర్ణేతలకు అందించి, సముచిత నిర్ణయాల రూపకల్పనకు తోడ్పడాలని ప్రణబ్ ఉపదేశించారు. నేటి సంకీర్ణ రాజకీయాల యుగంలో సైతం అతి పెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏకమై ఎలాంటి లోపభూయిష్టమైన, హానికరమైన చట్టాన్నయినా తీసుకొచ్చి దేశంపై బలవంతంగా రుద్దగలవు. అలాంటి ప్రమాదమే చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ముంచుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేసి అడ్డగోలుగా రాష్ట్రాల విభజనకు అవి బరితెగించగలవనడానికి తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ పరిణామాలు. ఈ విషయంలో కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి, సమాఖ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి. తెలంగాణ అంశాన్ని నానబెట్టి ఎన్నికలు సమీపిస్తుండగా దుందుడుకుగా వ్యవహరించడంలోని హేతుబద్ధతను, లోపాలను ప్రతిపక్షాలు ప్రశ్నించకపోవడం, ప్రేక్షక పాత్ర పోషించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. -
ఆ బీళ్లు దగాకు ఆనవాళ్లు!
1951లో కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం కూడా పొందిన కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టుల ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు లభించే సువర్ణావకాశం తలుపు తట్టింది. అయినా సీమ వాసులు తృణప్రాయంగా త్యాగం చేశారు. సిద్ధేశ్వరం, గండికోట జలాశయాలను నిర్మించి సీమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి తీరని ద్రోహం తలపెట్టారు. ఆంధ్రప్రదేశ్ నీటి సమస్యపై పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్నాయి. రాష్ర్ట, మధ్య తరహా జలవనరుల మంత్రి సుదర్శన్రెడ్డి సూచన మేరకు సాగు నిపుణులు సమావేశమై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుదర్శన్రెడ్డి సంక్లిష్టమైన నీటి సమస్య లోతు ల్లోకి వెళ్లి విశ్లేషించి, పరిష్కార మార్గాలపై మాట్లాడటానికి సాహసించలేక, తప్పుదోవ పట్టించే విధంగా సమస్యను తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేశారు. సాగునీటి రంగ నిపుణులు ఆర్.విద్యాసాగర్రావు ‘సాక్షి’ దినపత్రికలో (అక్టోబర్ 3న) రాసిన వ్యాసంలో ‘దౌర్జన్యంగా ఇతర ప్రాంతాల నీటిని తరలించడం...’ అంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా రాశారు. తద్వారా కరవు కాటకాలతో జీవన్మరణ పోరాటం చేస్తున్న రాయలసీమ ప్రాంత ప్రజలపై తీవ్రమైన నిందమోపి అవమానించారు. గత జల సేతుబంధనం రాష్ట్రంలో ఉన్న నలభై పైచిలుకు నదుల్లో గోదావరి, కృష్ణా, పెన్నా నదులు పెద్దవి. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. పెన్నా నదిలో 75 శాతం విశ్వసనీయత ఆధారం గా 98 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని ఒకనాడు నీటి పారుదల రంగ నిపుణులు అంచనా వేశారు. కానీ నేడు అది ఒట్టిపోయి, నీటి లభ్యత గణనీయంగా పడిపోయిం ది. కృష్ణా, పెన్నా నదీ పరీవాహక ప్రాంతాల్లోనే అత్యంత కరవు పీడిత ప్రాంతాలున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం విశ్వసనీయత ఆధారంగా 2130 (2060+70 పున రుత్పత్తి జలాలు) శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీ) నికర జలాలు లభిస్తాయని నిర్ధారించింది. మన రాష్ట్రానికి 811 (800+11 పునరుత్పత్తి జలాలు) టీఎంసీ కేటాయిం చింది. అందులో 33 టీఎంసీలను జల విద్యుత్తు ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి నష్టం పద్దు కింద చేర్చి, మిగిలిన 767 టీఎంసీలను 1960 సెప్టెంబర్ నాటికి సాగు నీటిని వినియోగించుకుంటున్న, నిర్మాణానికి అను మతులు పొందిన ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చింది. అలా వివిధ ప్రాజెక్టులు, చిన్న నీటిపారుదల పథకాలకు ట్రిబ్యునలే నిర్దిష్టమైన కేటాయింపులు చేసింది. నదీ పరీవాహక ప్రాంతాల విస్తీర్ణాన్ని బట్టి కేటాయింపులు చేయలేదు. ఆ అంశాన్ని ఇప్పుడు వివాదాస్పదం చేసి ప్రయోజనం లేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు 2000 మే 31తో ముగియడంతో కృష్ణా నదీ జలాల పంపిణీపై పునఃసమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ను నియమిం చింది. 75 శాతం విశ్వసనీయత ఆధారంగా నిర్ధారించిన 2130 టీఎంసీల నికర జలాలను ముట్టుకోకుండా, మిగు లు జలాలను పంచాలన్న కర్ణాటక, మహారాష్టల్ర డిమాం డ్కు ట్రిబ్యునల్ సానుకూలంగా స్పందించింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం లభించే సంవత్సరా లలో దిగువ రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టు కొని, మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి కల్పించింది. అయి నా, తీర్పు అమలులో ఉన్న 1976 నుంచి 2000 సంవత్స రం వరకు అధికారాన్ని వెలగబెట్టిన ప్రభుత్వాల అలస త్వం, సాచివేత వైఖరి మూలంగా ఆ సదవకాశాన్ని చేజేతులా కోల్పోయాము. కొత్త తీర్పు శరాఘాతమే ఈ పూర్వరంగంలో మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యు నల్ ముందు మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాలు బలంగా వాదించి, విజయం సాధించాయి. ట్రిబ్యునల్ ముసా యిదా తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శరాఘాతంలా తగి లింది. ఇక రాయలసీమ ప్రాంతంలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల భవిష్యత్తు ఏమిటి? ప్రపంచంలో ఎక్కడా పరిగణనలోకి తీసుకోని 65 శాతం విశ్వసనీయతను బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రామాణికంగా తీసు కొని 2293 టీఎంసీలు లభిస్తాయని, అందులో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 2130 టీఎంసీల నికర జలాలను మినహాయించి, మిగిలిన 163 టీఎంసీలను మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. అందులో మన రాష్ట్రానికి 45 టీఎంసీల వాటా దక్కింది. ఆ నీటిని కూడా ప్రాజెక్టుల వారీగా తెలుగుగంగకు 25 టీఎంసీలు, జూరాలకు 9 టీఎంసీలు, కనీస నదీ ప్రవాహం పద్దుకింద 6 టీఎంసీలు, మిగిలిన 5 టీఎంసీలను నాగార్జునసాగర్ జలాశయంలో ‘కారీ ఓవర్’ పద్దు కింద కేటాయించిన 150 టీఎంసీలలో కలిపేయడం జరిగింది. ఆల్మట్టి ఎత్తు పెంపు గొడ్డలిపెట్టు ఆల్మట్టి జలాశయం ఎత్తును 519.6 మీటర్లకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతిస్తే, బ్రిజేష్ ట్రిబ్యు నల్ 524.256 మీటర్లకు పెంచుకోవడానికి ఆమోదముద్ర వేసింది. పర్యవసానంగా సాధారణ వర్షపాతం నమోదైన సంవత్సరాలలో మనకు కేటాయించిన నికర జలాలైనా లభిస్తాయో, లేదో చెప్పలేని స్థితినెలకొన్నది. ఈ నేపథ్యం లోనే సుదర్శన్ రెడ్డి, విద్యాసాగర్రావు కొత్త వివాదానికి తెర లేపుతూ రాయలసీమకు నికరజలాలలో వాటా 144.7 టీఎంసీలేనని సెలవిచ్చారు. జలవిద్యుత్తు ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి నష్టం పద్దు కింద బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న 33 టీఎంసీలను నిష్పక్షపాతంగా కోస్తా, రాయలసీమ, తెలంగాణ, మూడు ప్రాంతాల మధ్య సమానంగా విభజించి, 11 టీఎంసీలను రాయల సీమ పద్దుకు జమ చేశారు. మరొకవైపున 19 టీఎంసీల నికరజలాల కేటాయింపుతో, కేంద్ర జలసంఘం ఆమో దంతో నిర్మిస్తున్న శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (ఎస్ఆర్ బీసీ)కు 11 టీఎంసీలను శ్రీశైలం జలాశయం నుంచి తీసుకోవడానికి మాత్రమే వీలుందని చెప్పకనే చెబుతూ, అలా సీమకు లభించిన నికర జలాలను 122.70+11+ 11= 144.70 టీఎంసీలుగా తేల్చేశారు. మరి మిగిలిన 8 టీఎంసీల నీరెక్కడి నుంచి ఎస్ఆర్బీసీకి సరఫరా కావాలో వారు పేర్కొనలేదు. ఇలాంటి వాదనతో గతంలో జరిగిన మరికొన్ని నీటి సర్దుబాట్లను కూడా ప్రశ్నార్థకం చేసే అవ కాశం ఉంది. నిత్య కరవులతో సతమతమవు తున్న అనం తపురం జిల్లా దాహార్తిని తీర్చడానికి తుంగభద్ర జలా శయం నుంచి కేసీ కెనాల్కు బచావత్ ట్రిబ్యునల్ కేటా యించిన 10 టీఎంసీల నికర జలాలను పెన్నా-అహో బిలం రిజర్వాయర్ (పీఏబీఆర్)కు ఇచ్చి, ఆ మేరకు శ్రీశై లం జలాశయం నుంచి కేసీ కెనాల్కు సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకాభిప్రాయాన్ని సాధించిన తరువాతే పైనీటి సర్దుబాటు చేసింది. ఈ 10 టీఎంసీల నికర జలాలు శ్రీశైలం జలాశయం నుంచి కేసీ కెనాల్కు సరఫరా కావాలి. దాన్ని అడ్డుకుంటే, తత్ఫలి తంగా తుంగభద్ర జలాశయం నుంచి పెన్నా-అహోబిలం రిజర్వాయర్కు చేసిన నీటి సర్దుబాటు రద్దవుతుంది. మొదటి నుంచీ మొండిచేయే 1937 నాటి ‘శ్రీభాగ్ ఒడంబడిక’ కాలగర్భంలో కలిసిపో యింది. కృష్ణా, తుంగభద్ర నదీ జలాల వినియోగంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తామని అందులో లిఖిత పూర్వకం గా వాగ్దానం చేసి మొండి చేయి చూపెట్టారు. 1951లో కేం ద్ర ప్రణాళికా సంఘం ఆమోదం కూడా పొందిన కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టుల ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు లభించే సువర్ణావకాశం తలుపు తట్టినా సీమ వాసులు తృణప్రాయంగా త్యాగం చేశారు. సిద్ధేశ్వరం, గండికోట జలాశయాలను నిర్మించి సీమకు న్యాయం చేస్తా మని హామీ ఇచ్చి తీరని ద్రోహం తలపెట్టారు. తదనంతర కాలంలో ప్రజలు పోరాట ఫలితంగా దాన్ని సాగునీటి ప్రాజెక్టుగా మార్చారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించడంతో రాయల సీమలో అంతర్భాగంగా ఉన్న బళ్లారితో పాటు తుంగభద్ర జలాశయాన్ని కోల్పోయారు. ఈ చరిత్ర తెలియని అజ్ఞా నులూ ఉన్నారు. పైగా రాయలసీమ ప్రజలను నీటి దొం గలుగా చిత్రీకరించే ఉన్మాదం ప్రకోపించింది. దాహార్తి తీరే మార్గం ఏది? గోదావరి నదీజలాలపైనే తెలుగు ప్రజల భవిష్యత్తు ఆధా ర పడి ఉంది. వెనుకబడ్డ ప్రాంతాల దప్పిక తీరి, అవి సమ గ్రాభివృద్ధి చెందాలన్నా గోదావరి నీటి తరలింపే శరణ్యం. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతోనే తెలుగు జాతి నీటి అవసరాలను తీర్చవచ్చు. ఆ నదుల అనుసంధానంతోనే మరు భూములను పంట పొలాలుగా మార్చడానికి మార్గం సుగమం అవుతుంది. తెలుగు జాతి ఐక్యంగా, శాంతియుతంగా సహజీవనం చేస్తూ, ఇచ్చి పుచ్చుకునే మనస్తత్వంతో జీవించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. నీటి కోసం యుద్ధాలు చేసుకునే దుస్థితిని ఇప్పు డు సృష్టిస్తే చరిత్ర క్షమించదు!