breaking news
Swamy Chinmayananda
-
ఆయన అరెస్టు వెనుక పెద్ద కుట్ర: బాధితురాలు
లక్నో : తనపై లైంగిక దాడికి పాల్పడ్డ బీజేపీ నేత, మాజీ మంత్రి చిన్మయానంద్ను ప్రత్యేక దర్యాప్తు బృందం రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుందని అత్యాచార బాధితురాలు అనుమానం వ్యక్తం చేశారు. వికృత చర్యలకు పాల్పడ్డ అతడిపై అత్యాచార కేసు నమోదు చేయకుండా శిక్ష తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను భయపడినట్లుగానే తనకు న్యాయం జరిగే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిర్వహించే లా కాలేజీలో అడ్మిషన్ ఇప్పించడంతో పాటు లైబ్రరీలో ఉద్యోగం ఇచ్చిన చిన్మయానంద్ అందుకు బదులుగా తనను లైంగిక వేధించారంటూ బాధితురాలు ఆరోపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో శుక్రవారం సిట్ అధికారులు చిన్మయానంద్ను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు అతడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా విచారణలో భాగంగా బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు అంగీకరించారని ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ నవీన్ అరోరా మీడియాకు వెల్లడించారు. అదే విధంగా తన చర్యలకు సిగ్గు పడుతున్నట్లు చిన్మయానంద్ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామన్నారు.(చదవండి:అవును.. లైంగికంగా వేధించాను: చిన్మయానంద్ ) ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బాధితురాలు...‘ నాపై ఎలా అత్యాచారం జరిగిందో సిట్కు అన్ని వివరాలు వెల్లడించాను. కానీ వారు మాత్రం చిన్మయానంద్పై 376 సెక్షన్ ప్రకారం ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. నిజానికి ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేసినట్లు అనిపిస్తోంది. ఇందులో ఏదో పెద్ద కుట్ర దాగి ఉంది. సిట్ విచారణ నాకు ఏమాత్రం సబబుగా అనిపించడం లేదు. చిన్న చిన్న కేసులు పెట్టడం ద్వారా అతడికి శిక్ష తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనిపిస్తోంది’ అని వాపోయారు. అదే విధంగా చిన్మయానంద్ అరెస్టు కావడం పట్ల ఆనందంగా ఉందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వల్లే ఇది సాధ్యమైందని బాధితురాలు ప్రశంసించారు. అయితే యోగితో చిన్మయానంద్ పేరు కలిపి వినిపించడం తనను వేదనకు గురిచేస్తుందన్నారు. యోగి మంచి వ్యక్తి అని.. ఆయన హయాంలో తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా చిన్మయానంద్ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్లు 506(నేర ప్రవృత్తితో కూడిన బెదిరింపు), 342(అక్రమ నిర్బంధం), 354డీ, 376సీ కింద మాత్రమే కేసు నమోదు చేశారు. (376 సీ ప్రకారం ఓ వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడి..మహిళను బెదిరించి... ఆమె అంగీకారంతో లైంగిక దాడి చేసినా అది అత్యాచారంగా పరిగణింపబడదు. ఈ కారణంగా నిందితుడికి ఐదు నుంచి పదేళ్ల వరకు సాధారణ జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తారు.) -
కాషాయ రేపిస్ట్: ఆయన్ను ఎవరూ సీరియస్గా తీసుకోరు!
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడిని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఇటీవల ‘కాషాయ దుస్తులు ధరించిన రేపిస్టు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా దిగ్విజయ్ను సీరియస్గా తీసుకోదని, అలాంటిది ఆయన గురించి తానెందుకు స్పందించాలని జవదేకర్ పేర్కొన్నారు. ముంబై పేలుళ్ల తర్వాత చేసిన వ్యాఖ్యలతో ఆయన మనస్తత్వం ఏమిటనేది బయటపడిందని, అప్పటి నుంచి ఆయన ఇదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద తనపై అత్యాచారం చేశారంటూ ఓ వైద్య విద్యార్థిని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దిగ్విజయ్ స్పందిస్తూ.. ‘ఈ రోజుల్లో కొంతమంది కాషాయ దుస్తులు ధరించి మరీ అత్యాచారాలు జరుపుతున్నారు. ఆలయాల లోపల కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇదేనా మన మతం? మన సనాతన ధర్మాన్ని అవమానించిన వారిని దేవుడు క్షమించబోడు’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఉద్యమాలు: చిన్మయానంద
హైదరాబాద్: కాంగ్రెస్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన తరువాత సీమాంధ్రలో గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. బీజేపీ హయాంలో మూడురాష్ట్రాలు ఏర్పడినప్పుడు సంబరాలు జరిగాయని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్రమిస్తే గొడవలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎన్డిఏ హయాంలో ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. అప్పుడు నిరసనలు వ్యక్తంకాలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను విడగొడతామనేసరికి సీమాంధ్రలో ఉధ్యమం తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే.