breaking news
state devision issues
-
గట్టి పట్టు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెండింగ్ అంశాలు, విభజన సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్తు బకాయిలు, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత తదితర అంశాలపై ప్రధానికి సీఎం నివేదించారు. ప్రధానంగా పోలవరం సవరించిన అంచనాలను సత్వరమే ఆమోదించాలని విన్నవించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు. ముఖ్యమంత్రి నివేదించిన అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిసింది. ప్రధానికి నివేదించిన అంశాలు ఇవీ.. పోలవరంపై: పోలవరానికి సంబంధించి 2019 ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ.55, 548.87 కోట్లుగా నిర్ధారించారు. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలి. ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో నిర్మాణ పనుల కోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ, పునరావాసం కోసం రూ.22,598 కోట్లు వ్యయం కానుంది. పోలవరం నిర్మాణంలో కాంపొనెంట్ వైజ్గా బిల్లుల చెల్లింపు విధానాన్ని సవరించాలి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్రం చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తిరస్కరించింది. కాంపొనెంట్వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టులో జరిగే పనులను పరిగణలోకి తీసుకోవాలి. ఈ నిధులను సకాలంలో విడుదల చేయాలి. నిర్వాసిత కుటుంబాలకు జాప్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలి. అర కోటి కుటుంబాల రేషన్ భారం రాష్ట్రంపైనే... జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపు కోసం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉండటంతో ఏపీకి అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలకు రేషన్ అందిస్తుండగా ఇందులో కేంద్రం నుంచి కేవలం 89 లక్షల కుటుంబాలకు మాత్రమే అందుతోంది. మిగిలిన 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు ఖర్చు చేస్తూ రేషన్ ఇస్తోంది. ఆర్థికంగా బాగున్న మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ–నగర ప్రాంతాల్లో 50 శాతం ప్రజలకు రేషన్ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఏపీలో మాత్రం 61 శాతం రూరల్, 41 శాతం అర్బన్ ప్రజలకు మాత్రమే ఇస్తున్నారు. దీన్ని వెంటనే సరిదిద్ది హేతుబద్దత పాటించాలి. భోగాపురానికి తాజా క్లియరెన్స్.. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ గడువు ముగిసింది. దీనికి తాజాగా క్లియరెన్స్ ఇవ్వాలి. ఈ మేరకు పౌర విమానయాన శాఖకు తగిన ఆదేశాలివ్వాలి. కడప స్టీల్ ప్లాంట్కు తోడ్పాటు.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్ ప్లాంట్ను నెలకొల్పుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదు. రాయలసీమ ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నడుం బిగించింది. దీనికోసం వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. దీనికి కేంద్రం తోడ్పాటు అందించాలి. బీచ్శాండ్ మినరల్స్.. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బీచ్శాండ్ మినరల్స్ ప్రాంతాలను కేటాయించాలి. అటామిక్ ఎనర్జీ విభాగం ఇప్పటికే రెండు ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించింది. దీనికి సంబంధించిన అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. మిగిలిన 14 ప్రాంతాలకు సంబంధించిన కేటాయింపులు, అనుమతులకు ఆదేశాలివ్వాలి. కొత్త మెడికల్ కాలేజీలు.. మహమ్మారులు సోకినప్పుడు ప్రజారోగ్య వ్యవస్థ ఎంత కీలకమో కోవిడ్ పరిస్థితులు వెల్లడించాయి. ప్రజారోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను గణనీయంగా పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏపీలో 11 బోధనాసుపత్రులు ఉండగా కొత్తగా మరో మూడింటికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో 13 బోధనాసుపత్రులకు కూడా వెంటనే అనుమతులివ్వాలి. రెవెన్యూ లోటు భర్తీ చేయాలి.. రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి భారీ నష్టం వాటిల్లింది. రెవిన్యూ గ్యాప్ భర్తీ కోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉంది. ఆమేరకు ఏపీకి ఆర్థికంగా నష్టం వాటిల్లింది. వి¿భజన నాటికి పెండింగ్లో ఉన్న భారీ బిల్లులు, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలుతో చెల్లించాల్సిన బకాయిల రూపంలో దాదాపు రూ.32,625.25 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసింది. ఈ నిధులను రెవిన్యూ లోటు కింద భర్తీ చేయాలి. రాష్ట్ర విభజన అనంతరం 58.32 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేవలం 46 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. హైదరాబాద్ను కోల్పోవడం ద్వారా ఆ నగరం నుంచి అందే 38 శాతం రెవిన్యూను కోల్పోయాం. ఆ తర్వాత కోవిడ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. దాదాపు రూ.33,478 కోట్ల మేర ఆదాయాన్ని కోవిడ్ వల్ల కోల్పోయాం. కోవిడ్ నియంత్రణ, చికిత్స కోసం మరో రూ.7,130 కోట్లను అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు అనివార్యంగా తలెత్తాయి. 15వ ఆర్థిక సంఘం కేటాయింపులు కూడా రాష్ట్రానికి తగ్గిపోవడం మరొక ప్రతికూల అంశం. నాటి రుణాలకు నేడు కోతలు సరికాదు.. రాష్ట్రంలో గత సర్కారు హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చారు. కానీ ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా రాష్ట్ర రుణ పరిమితుల్లో కోత విధిస్తామని అంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. విధించిన రుణ పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రుణాలు తీసుకోలేదు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రుణాల పరిమితిని సవరించాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ నుంచి భారీగా విద్యుత్తు బకాయిలు.. తెలంగాణ డిస్కమ్లు రూ.6,455.76 కోట్ల మేర బకాయిలను ఏపీ జెన్కోకు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటి నుంచి జూన్ 2017 వరకూ తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. ఈ బకాయిలను తెలంగాణ నుంచి ఇప్పించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ డిస్కమ్లను ఆదుకోవాలి. ఈమేరకు తగిన ఆదేశాలివ్వాలి. తీవ్ర రుణభారాన్ని ఎదుర్కొంటున్న ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక నిర్వహణ కోసం బకాయి బిల్లుల చెల్లింపు అత్యవసరం. -
గ్రూప్-2 నూతన సిలబస్లో రాష్ట్ర విభజన అంశాలు
-మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ త్వరలో విడుదల చేయనున్న గ్రూప్-2 నూతన సిలబస్లో రాష్ట్ర విభజన అంశాలు, విభజన వలన ఏర్పడిన సవాళ్లు పేరుతో చేర్చారని పోటీ పరీక్షల బోధన నిపుణులు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. అరం డల్పేటలోని గుంటూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్లో గ్రూప్-2కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నూతన సిలబస్పై అవగాహన కల్పించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ దానిని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణం, విభజన చట్టంలోని అంశాలు, ఉద్యోగుల విభజన, స్థానికత సమస్యలు, నదీ జలాల పంపిణీ-సమస్యలు, విభజన నేప థ్యంలో మౌలిక వసతులు, పెట్టుబడుల అవసరాలు వంటి అంశాలను జనరల్ స్టడీస్ పేపర్-1లో ఒక చాప్టర్గా చేర్చారని వివరిం చారు. అదే విధంగా పంచాయతీ కార్యదర్శి సిలబస్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.