శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు తొక్కిపెట్టినట్లు?
హైదరాబాద్ : తాంబులాలు ఇచ్చాం ...తన్నుకు చావండి అన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకుండా.... విభజన ప్రక్రియను వేగవంతం చేస్తామనటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. సోనియా అనారోగ్యం, నరేంద్రమోడీకి పెరుగుతున్న కీర్తి, కుంభకోణాలతో తగ్గిపోతున్న కాంగ్రెస్ ప్రాభవం నేపథ్యంలో అనైతికంగా అయినా అధికారాన్ని చేజారకుండా రాష్ట్ర విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చిందని పయ్యావుల విమర్శించారు.
రూ. 30 కోట్లు ఖర్చుపెట్టి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తయారు చేసిన నివేదికను పార్లమెంట్లో పట్టుమని గంట కూడా చర్చించలేదని పయ్యావుల వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ కమిటీని ఎందుకు కాంగ్రెస్ తొక్కిపెట్టిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ముందుకు.... వెనక్కి వెళ్లలేకుండా ఉందన్నారు. రాష్ట్ర విభజన అంశం అత్యంత జఠిలమైన అంశమని పయ్యావుల అన్నారు.