sreshta
-
చేతులు మారుతున్న కంపెనీలు.. రూ.వందల కోట్ల డీల్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ తాజాగా శ్రేష్ఠ నేచురల్ బయోప్రొడక్ట్స్లో 100 శాతం వాటా సొంతం చేసుకోనుంది. 24మంత్ర ఆర్గానిక్ బ్రాండు కంపెనీతో వాటా కొనుగోలు ఒప్పందాన్ని(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఐటీసీ వెల్లడించింది. ఇందుకు నగదు రూపేణా దాదాపు రూ. 473 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది.24మంత్ర బ్రాండుతో 100 రకాలకుపైగా ఫుడ్ ప్రొడక్టులను శ్రేష్ఠ విక్రయిస్తోంది. తద్వారా వేగవంత వృద్ధిలోనున్న ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్టుల విభాగంలో ఐటీసీ మరింత విస్తరించనుంది. కాగా.. మరోపక్క సహచర సంస్థ మదర్ స్పార్‡్ష బేబీ కేర్లో మిగిలిన 73.5 శాతం వాటా సైతం చేజిక్కించుకోనున్నట్లు పేర్కొంది. 2022లో ఈ డీ2సీ కంపెనీలో 26.5 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కేఫిన్టెక్ చేతికి ఎసెంట్ ఫండ్ సర్వీసెస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్టర్ సొల్యూషన్స్ సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ (KFin Technologies) తాజాగా ఎసెంట్ ఫండ్ సర్వీసెస్లో (Ascent Fund Services) 51 శాతం వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 34.7 మిలియన్ డాలర్లు. వచ్చే అయిదేళ్లలో ఎసెంట్లో కేఫిన్టెక్ 100 శాతానికి వాటాలు పెంచుకోనుంది. ఇందుకోసం మిగతా 49 శాతం వాటాలను 2028, 2029, 2030లో ఏడాదికి 16.33 శాతం చొప్పున దక్కించుకోనుంది.సింగపూర్ హెడ్క్వార్టర్స్గా కార్యకలాపాలు సాగిస్తున్న ఎసెంట్ అంతర్జాతీయంగా 260 పైచిలుకు గ్లోబల్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్లకు ఫండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులు అందిస్తోంది. అత్యంత వేగంగా ఎదుగుతున్న అంతర్జాతీయ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కేఫిన్టెక్ విస్తరించేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని సంస్థ ఎండీ శ్రీకాంత్ నాదెళ్ల తెలిపారు. ఇరు సంస్థలు సమిష్టిగా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుని, పరిశ్రమలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతాయని ఎసెంట్ సహ–వ్యవస్థాపకుడు కౌషల్ మండలియా తెలిపారు. -
3,000 మీ. రేస్ వాక్లో శ్రేష్టకు స్వర్ణం
గచ్చిబౌలి: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన అథ్లెట్ ఎన్. శ్రేష్ట సత్తాచాటింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శనివారం ప్రారంభమైన ఈ టోర్నీలో ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అండర్–16 బాలికల 3000 మీటర్ల రేస్వాక్ ఈవెంట్ను శ్రేష్ట 21 నిమిషాల 9.9 సెకన్లలో పూర్తిచేసి చాంపియన్గా నిలిచింది. ఈ ఈవెంట్లో మహబూబ్నగర్కు చెందిన వి.సంధ్య (21ని.35.9సె.), ఆదిలాబాద్కు చెందిన ఎం.భవాని (22ని.20.2సె) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేలా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో సింథటిక్ ట్రాక్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థి స్థాయి నుంచే క్రీడల్లో రాణించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కోచ్ రమేష్, తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి కె. రంగారావు, రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభు కుమార్గౌడ్, సారంగ పాణి, స్టాన్లీ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు అండర్–16 బాలుర 5000మీ. రేస్వాక్: 1. కె. దుర్గారావు (వరంగల్), 2. టి. రవి సాగర్ (కరీంనగర్), 3. ఎ. రాహుల్ (ఆదిలాబాద్). అండర్–18 బాలుర 10000మీ. రేస్వాక్: 1. రాజ్ మిశ్రా (హైదరాబాద్), 2. రాజ హరి (కరీంనగర్), 3. వినయ్ కుమార్ (రంగారెడ్డి). అండర్–18 బాలికల 5000మీ. రేస్వాక్: 1. వర్ష (రంగారెడ్డి), 2. ఆర్. సంఘవి (కరీంనగర్).