breaking news
sports first
-
బాస్కెట్బాల్ చాంప్ వీజేఐఈటీ
ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజిల స్పోర్ట్స్ఫెస్ట్ సాక్షి, హైదరాబాద్: వీఎన్ఆర్-వీజేఐఈటీ ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజిల ‘స్పోర్ట్స్ఫెస్ట్’ శుక్రవారంతో ముగిసింది. బాస్కెట్బాల్ పురుషుల, మహిళల విభాగాల్లో ఆతిథ్య జట్లు విజేతలుగా నిలిచాయి. జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన మహిళల జట్టు వాలీబాల్ టైటిల్ను గెలువగా, హితమ్ కాలేజి పురుషుల ట్రోఫీ సాధించింది. బాస్కెట్బాల్ పురుషుల ఫైనల్లో వీఎన్ఆర్-విజేఐఈటీ జట్టు 52-44తో సెయింట్ మార్టిన్స్ జట్టుపై గెలుపొందింది. మహిళల ఫైనల్ పోరు కూడా ఈ రెండు కాలేజి జట్ల మధ్యే జరిగింది. ఇందులో వీఎన్ఆర్ జట్టు 23-19తో సెయింట్ మార్టిన్స్ జట్టుపై చెమటోడ్చి నెగ్గింది. వాలీబాల్ పురుషుల ఈవెంట్ తుదిపోరులో హితమ్ కాలేజి 25-20, 25-21తో సీఎంఆర్ఐటీపై గెలువగా, మహిళల విభాగంలో జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజి 25-20, 25-19తో భోజిరెడ్డి కాలేజిపై నెగ్గింది. బ్యాడ్మింటన్ మహిళల టీమ్ టైటిల్ను ఎస్ఎస్ఎన్ జట్టు గెలుపొందగా, వీఎన్ఆర్-వీజేఐఈటీ జట్టు రన్నరప్తో సరిపెట్టుకుంది. పురుషుల ట్రోఫీని ఎస్ఎస్ఎన్ జట్టు చేజిక్కించుకుంది. త్రోబాల్ పోటీల్లో జీఎన్ఐటీఎస్, వీఎన్ఆర్-వీజేఐఈటీ, భోజిరెడ్డి కాలేజిలు తొలి మూడు స్థానాలు పొందాయి. అథ్లెటిక్స్ ఫలితాలు పురుషుల 200 మీ. స్ప్రింట్: 1. లక్ష్మీకాంత్ (సీబీఐటీ), 2. కల్యాణ్ (బీవీఆర్ఐటీ), 3. శ్రీకర్ (వీఎన్ఆర్); మహిళల 200 మీ. స్ప్రింట్: 1. హన్నా ప్రభోదిని (విజ్ఞాన్), 2. మేఘ (సెయింట్ మార్టిన్స్), 3. సంజన (ఎంఎల్ఆర్ఐటీ); పురుషుల 800 మీ. పరుగు: 1.లోకేశ్ (శ్రీ హిందు), 2. హరీశ్ (శ్రీ హిందు), 3. ప్రశాంత్ (నోవా). -
ఐఎంటీ నాగ్పూర్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ)లో శుక్రవారం ‘స్పోర్ట్స్ ఫెస్ట్’ ప్రారంభమైంది. తొలి రోజు ఫుట్బాల్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఐఎంటీ-నాగ్పూర్, ఐపీఈ-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో నాగ్పూర్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 12 ఓవర్లపాటు జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన ఐపీఈ-హైదరాబాద్ జట్టు 78 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఐఎంటీ-నాగ్పూర్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. ఫుట్బాల్ మ్యాచ్లో ఐఎంటీ-హైదరాబాద్ జట్టు 5-0 గోల్స్ తేడాతో మేనేజ్ జట్టుపై ఘనవిజయం సాధించింది. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో ఈ చాంపియన్షిప్ను ఐఎంటీ-హైదరాబాద్ డెరైక్టర్ పాండురంగారావు లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బిజినెస్ స్కూల్ జట్లు పాల్గొంటున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో సుమారు 300 క్రీడాకారులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్లో ఐఎఫ్ఎంఆర్ (చెన్నై), ఐఎంటీ (నాగ్పూర్), క్రిస్ట్ యూనివర్సిటీ, ఎన్ఐసీఎంఏఆర్ (పుణె)లతో పాటు హైదరాబాద్లోని ఎన్ఎంఐఎంఎస్, ఐబీఎస్, ఐపీఈ తదితర జట్లు తలపడుతున్నాయి.