breaking news
Shuttlers
-
పారా షట్లర్లకు రూ. 50 లక్షలు నజరానా
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్లో పతకాలు సాధించిన ఐదుగురు పారా షట్లర్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. ఇటీవల జరిగిన దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత షట్లర్లు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) సాధించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 విభాగంలో స్వర్ణం గెలిచిన నితీశ్ కుమార్కు రూ. 15 లక్షలు, రజత పతకాలు గెలిచిన సుహాస్ యతిరాజ్ (పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4), తులసిమతి మురుగేశన్ (మహిళల సింగిల్స్ ఎస్యూ5)లకు రూ. 10 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. మహిళల సింగిల్స్ ఎస్యూ5లో కాంస్యం నెగ్గిన మనీషా రామదాస్, ఎస్యూ5లో కాంస్యం సాధించిన నిత్యశ్రీకి రూ. 7.5 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. ‘అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత పారా షట్లర్లకు నగదు బహుమతి అందించాలని నిర్ణయించాం. పారాలింపిక్స్లో సాధించిన పతకాలకు ఇది గుర్తింపు లాంటిది. మరిన్ని పతకాలు సాధించేందుకు పారా షట్లర్లకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం’ అని బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి సంజయ్ మిశ్రా పేర్కొన్నాడు. -
క్వార్టర్స్లో సింధు, సైనా
లక్నో: సయ్యద్ మోడి స్మారక గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్ జోరు కొనసాగిస్తున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో మూడోసీడ్ సింధు 21-18, 21-14తో జియాన్ చెన్ (సింగపూర్)పై గెలవగా... టాప్సీడ్ సైనా 21-15, 21-9తో రీతూపర్ణ దాస్ను ఓడించింది. తద్వారా ఈ ఇద్దరు క్వార్టర్స్కు అర్హత సాధించారు. జియాన్తో కేవలం 31 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సింధు దూకుడును ప్రదర్శించింది. తొలి గేమ్లో 7-7, 14-14తో స్కోరు సమమైనా... చివర్లో వరుస పాయింట్లతో 19-16 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో జియాన్ రెండు పాయింట్లు గెలిచినా... హైదరాబాదీ ముందు నిలువలేకపోయింది. ఇక రెండో గేమ్లో 4-4తో స్కోరు సమమైన తర్వాత సింధు వరుసగా ఆరు పాయింట్లు నెగ్గింది. తర్వాత ఒకటి, రెండు పాయింట్లతో చకచకా గేమ్తో పాటు మ్యాచ్ను ముగించింది. పురుషుల సింగిల్స్లో టాప్సీడ్ కిడాంబి శ్రీకాంత్ 22-20, 20-22, 21-11తో జైనుద్దీన్ (మలేసియా)పై కష్టపడి గెలిచాడు. గంటా ఏడు నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్కు గట్టిపోటీ ఎదురైంది. నిర్ణయాత్మక మూడో గేమ్లో హైదరాబాద్ కుర్రాడు ఒక్కసారిగా చెలరేగిపోయాడు. స్కోరు 3-3, 4-4తో సమమైన తర్వాత ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. కనిష్టంగా రెండు పాయింట్లకు తక్కువ కాకుండా గెలుస్తూ జైనుద్దీన్ దెబ్బతీశాడు. స్కోరు 18-11 ఉన్న దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. మరో మ్యాచ్లో 3వ సీడ్ పారుపల్లి కశ్యప్... 11వ సీడ్ మిషా జిల్బెర్మాన్ (ఇజ్రాయెల్)పై నెగ్గాడు. స్కోరు 21-16, 20-12 ఉన్న దశలో జిబ్బెర్మాన్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఇతర మ్యాచ్ల్లో 6వ సీడ్ బి.సాయి ప్రణీత్ 21-16, 24-26, 21-13తో 15వ సీడ్ సుపాన్యు అవింగ్సనాన్ (థాయ్లాండ్)పై; 8వ సీడ్ ఆర్ఎంవీ గురుసాయిదత్ 21-16, 21-19తో థామసిన్ సితికోమ్ (థాయ్లాండ్)పై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్లో హేమ నాగేంద్ర-అరుణ్; నందగోపాల్-అర్జున్; మను అత్రి-సుమీత్ రెడ్డి జంటలు; మహిళల డబుల్స్లో జ్వాల-అశ్విని; జమునా రాణి-లీలా లక్ష్మీ జంటలు క్వార్టర్స్కు చేరాయి.