breaking news
see
-
దేవుడిని ఎందుకు చూడలేకపోతున్నాం.. చూడాలంటే...!
భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే, మనం ఆయన్ని ఎందుకు చూడలేకపోతున్నాం? మనం సినిమా చూడడానికి ప్రదర్శన శాల (సినిమా హాలు)కు వెళ్లినప్పుడు తెరపై చిత్రాలు ఏ విధంగా కనపడతాయో కొంత అవగాహన ఉంది కదా! ఒక చిన్నగదిలోయంత్రాన్ని (ప్రొజెక్టర్) నడిపిస్తూ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించి తెరపై బొమ్మలు పడేలా చేస్తాడు ఒక వ్యక్తి. అతడు లేకుండా సినిమా ప్రదర్శన సాధ్యమే కాదు. సినిమా నడిపే వ్యక్తి మాత్రం మనకు కనబడకుండా ఉంటాడు. నీవు అతనిని కలవాలని అనుకుంటే అతడితో పరిచయం ఉన్నవాని (మధ్యవర్తి) సహాయంతో కలవవచ్చు. ఆ సినిమా నడిపే అతనితో స్నేహం పెంచుకొన్న తర్వాత నీకు ఇష్టం వచ్చినప్పుడు అతని గదిలోకి ప్రవేశించవచ్చు, అతనితో మాట్లాడ వచ్చు కదా!ఈ ప్రపంచమే ఒక విశాలమైన చిత్ర ప్రద ర్శనశాల. దీనియందు మనకు ఎప్పుడూ సంభ వించే సంఘటనలే ప్రదర్శనలు. సినిమాలో ఉన్నట్లు, ఇక్కడ కూడా యంత్రాన్ని నడిపించేవాడు ఉన్నాడు. అతను కూడా కనిపించడు. సరైన పరికరాలు, మధ్యవర్తి ఉంటేనే ఆయన కనిపిస్తాడు. ఈ సందర్భంలో మైత్రి అంటే ‘భక్తి’ అని పిలిచే ఒక సాధనాన్ని ఈ కార్య సాధనలో ఉపయోగిస్తూ సద్గురువు అనే మధ్యవర్తి ద్వారా భగవంతుని చూడవచ్చు. సద్గురువు సహాయంతో భగవంతుని దర్శించుకొన్నవారుఎందరో ఉన్నారు. అటువంటివారి అనుభవాలే మన పవిత్రగ్రంథాల్లో దృష్టాంతాలుగా ఉన్నాయి. భగవంతుని దర్శించుకొనదల చిన వారికి పూర్వం భక్తులు ఏ బాటలో నడచి భగవత్ సాక్షాత్కారాన్ని పొందారో అటువంటివారు నడచిన మార్గాన్ని ఇతిహాసాలు తేట తెల్లం చేస్తున్నాయి. ఆ మార్గంలోనే భక్తి విశ్వాసాలు, ధైర్యంతో నీవు నడచిన ట్లయితే గమ్యాన్ని చేరుకోగలవు. నిన్ను చెడగొడుతున్న సందేహాలు అన్నీ అప్పుడు తొలగిపోతాయి.శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
అదో ‘మాయాద్వీపం’.. మట్టితో చేసిన వంటలు భలే రుచి.. ఇంకా ఉప్పు దేవత, బ్లడ్ సీ కూడా
Iran Rainbow Valley Unknown Facts In Telugu: మట్టి వాసన బాగుందంటాం కానీ..దానిని రుచి చూడం. కానీ, మట్టినే మసాల దినుసులుగా, సాస్గా తీసుకుంటారంటే నమ్ముతారా? తినే పర్వతం ఒకటి ఉందంటే ఊహించగలరా? ఎగిసిపడుతున్న రక్తపు సముద్రాన్ని చూస్తే భయపడకుండా ఉండగలరా? చిటికెడు ఉప్పు అనేవాళ్లకు ఉప్పు కొండలు కనిపిస్తే అచ్చెరువొందరా? పర్వతాలే ఇంద్రధనస్సులై మెరిస్తే మైమరిచిపోరా? ఇదంతా ఏదో హాలీవుడ్ సినిమా గ్రాఫిక్స్ కాదు.. ఈ భూమి మీదే! ప్రపంచ పర్యాటకానికి దూరంగా..ఓ మాయా ద్వీపంలా ఉన్న ‘రెయిన్బో ఐలాండ్’ విశేషాలు తెలుసుకుందామా? ఇరాన్–పర్షియన్ గల్ఫ్లోని హార్ముజ్ ద్వీపం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 7,000 జనాభా. ఇది శాస్త్రవేత్తలకు ఓ పెద్ద డిస్నీల్యాండ్. ఎటుచూసినా సహజసిద్ధంగా ఏర్పడిన రంగురంగుల పర్వతాలు..అడుగడుగునా ఖనిజ నిక్షేపాలు..నాపరాయి, మట్టి, ఇనుము అధికంగా ఉండే అగ్నిపర్వత శిలలతో ఏర్పడిన తెలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నారింజ, లేత గోధుమరంగు, గోధుమ, లేత మణి, బంగారపు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. అందుకే దీనిని ‘రెయిన్బో ఐలాండ్’ అని పిలుస్తారు. ఈ దీవిలో దాదాపు 70 వరకు ఖనిజాలను గుర్తించారు. కోట్ల ఏళ్ల కిందట పర్షియన్ గల్ఫ్ అంచుల చుట్టూ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఉప్పు భారీగా పేరుకుపోయిందని, ఖనిజ, అగ్ని పర్వతాలతో కలిసి రంగురంగుల ఉప్పు దిబ్బలుగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. చదవండి: 1485 ఎకరాల్లో అతి పేద్ద శ్మశానం.. ఇప్పటివరకు 50 లక్షల మృతదేహాలు.. – సాక్షి, అమరావతి ఉప్పు దేవత.. స్థానికులు ఇక్కడి ఉప్పు పర్వతాన్ని దేవతగా పిలుస్తారు. ఇది కిలోమీటరకుపైగా విస్తరించి ఉంది. దీనికి ఔషధ గుణాలున్నాయని నమ్ముతారు. రాతి ఉప్పు గాలి పీల్చుకోవడంతో అనారోగ్య సమస్యలను నయమవుతాయని విశ్వసిస్తారు. అందుకే దీనిని పాజిటివ్ ఎనర్జీ వ్యాలీ అని కూడా అంటారు. బ్లడ్ సీ.. ఈ ద్వీపంలోని సముద్రం ఎర్రటి అలలతో ఎగిసిపడుతుంది. అందుకే దీనిని బ్లడ్ బీచ్, బ్లడీ సీ అని పిలుస్తారు. ఐరన్ ఆక్సైడ్ అధికంగా ఉండే ఎర్రటి మట్టి వల్ల నీరు ఎరుపుగా ఉంటుంది. ఇక్కడ అతిపెద్ద రంగురంగుల మట్టి కార్పెట్ కనిపిస్తుంది. సైలెంట్ వ్యాలీ, రెయిన్బో గుహలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. 2019 ఇరాన్ లెక్కల ప్రకారం 18 వేల మంది మాత్రమే ఈ ప్రదేశాన్ని సందర్శించారు. ఇక్కడ పెద్ద వాహనాలు ఉండవు. స్థానికుల రిక్షాల్లో ద్వీపాన్ని చుట్టిరావచ్చు. చదవండి: Viral Video: ‘వాట్ ఏ టైమింగ్.. ఇక్కడ విసిరితే అక్కడ ల్యాండ్ అయ్యింది’ తినే పర్వతం.. హార్ముజ్లోని ఓ పర్వతపు ఎర్ర మట్టిని సుగంధ ద్రవ్యంగా స్థానికులు వంటల్లో వినియోగిస్తుంటారు. ఇక్కడి పర్వతాల ఎర్రటి మట్టిని గెలాక్ అని పిలుస్తారు. ఇది అగ్నిపర్వత శిలల నుంచి ఉద్భవించిన హెమటైట్ ఐరన్ ఆక్సైడ్ వల్ల ఏర్పడింది. ఈ ఖనిజానికి ఎన్నో పారిశ్రామిక ఉపయోగాలున్నాయి. దీని మట్టి కూరలకు మంచి రుచి ఇస్తుంది. స్థానికులు దీనిని రొట్టెతో నంజుకుని తింటారు. తాజాగా పట్టిన సార్డినెస్, కిల్కా, మోమాగ్ చేపలను శుభ్రం చేసి వాటిని మట్టితో చేసి సాస్లో పెద్ద కంటైనర్లో వేసి 2 రోజులు ఎండలో ఉంచడంతో ‘సురఘ్’అనే రుచికరమైన భోజనం అవుతుంది. ఈ మట్టినే స్థానిక కళాకారులు పెయింటింగ్, సిరామిక్స్, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు -
ఒమెన్ నుంచి ముంబై వైపు మిడతల యాత్ర!
సాధారణంగా తూర్పు ఆఫ్రికా నుంచి ఇరాన్, పాకిస్తాన్ మీదుగా మన దేశం (రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతం)లోకి గాలి వాటున ఎడారి మిడతల దండ్లు వస్తూ ఉంటాయి. అయితే, ఈ ఏడాది అసాధారణంగా ఎన్నో రెట్లు ఎక్కువగా మిడతలు పుట్టుకొచ్చినందున ఇప్పుడు సముద్రం వైపు నుంచి కూడా మిడతల దాడి ప్రారంభం అయ్యింది. అరేబియా మహాసముద్రం మీదుగా మిడతల దండు నేరుగా మన దేశంలో పశ్చిమ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్.ఎ.ఓ.) ఈ విషయమై కొద్ది నెలలు ముందే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తొలి దండు ఒమెన్ దేశం నుంచి జూన్ 12న అరేబియా మహాసముద్రం మీదుగా ఆకాశ మార్గాన భారత్ వైపు బయలుదేరిందని ఎఫ్.ఎ.ఓ. తాజా బులిటెన్లో తెలిపింది. ఈ దండు ప్రయాణం సజావుగా కొనసాగితే జూన్ 17 నాటికి మహారాష్ట్ర సముద్ర తీరప్రాంతానికి చేరుకోవచ్చని ఎఫ్.ఎ.ఓ. పేర్కొంది. వాతావరణం అనుకూలించకపోతే మిడతలు సముద్రంలో పడి మరణించ వచ్చు కూడా అని తెలిపింది. ♦ ఒమెన్–ముంబై మధ్య 1,566 కిలోమీటర్ల దూరం ఉంది. మిడతల దండు ఇంత దూరం ఏకబిగిన తిండీ తిప్పలు లేకుండా, అలసట లేకుండా ఎగరగలుగుతుందా? అసాధ్యం కాదని చరిత్ర చెబుతోంది. ♦ మిడతలు గంటకు 16–19 కి.మీ. ప్రయాణించగలవు. మిడతల దండ్లు 5 నుంచి 130 కి. మీ. లేదా అంతకన్నా ఎక్కువ దూరం ఎగరగలవు. మిడతల ప్రయాణ వేగం గాలుల వేగంపై ఆధారపడి ఉంటుంది. ♦ మిడతల దండు అనేక రోజుల పాటు ఆకాశంలోనే ఉండి గాలి వాటున ప్రయాణించ గలదు. ఆ సమయంలో అతి తక్కువ శక్తిని మాత్రమే ఖర్చు చేయగల ఒడుపు మిడతలకు తెలుసునట. 300 కి.మీ. వెడల్పు ఉండే ఎర్ర సముద్రాన్ని తరచూ అలవోకగా దాటేస్తుంటాయి. ♦ 1954లో వాయువ్య ఆఫ్రికా నుంచి బయలుదేరి బ్రిటన్ చేరుకున్నాయి. 1988లో పశ్చిమ ఆఫ్రికా నుంచి కరిబియన్ చేరాయి. 5 వేల కి.మీ. దూరాన్ని కేవలం పది రోజుల్లో మిడతల దండులు చేరుకున్నాయి. ♦ తూర్పు ఆఫ్రికా, ఒమెన్, ఎమెన్ తదితర దేశాల్లో కుప్పలు తెప్పలుగా గత 70 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువ సంఖ్యలో మిడతలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి, అక్కడి నుంచి నేరుగా అరేబియా మహాసముద్రం మీదుగా మన దేశంలోని పశ్చిమ తీర ప్రాంతానికి మిడతల దండులు తాకే ముప్పు ఉంది. అక్కడి నుంచి గాలులు అనుకూలిస్తే దక్షిణాది రాష్ట్రాలపై కూడా వచ్చే కొద్ది వారాల్లో మిడతలు దండుయాత్ర చెయ్యొచ్చు. ♦ అటు రాజస్థాన్ నుంచి కూడా ఇంతకు ముందుకన్నా ఎక్కువ సంఖ్యలో మిడతల గుంపులు దక్షిణాది వైపు రావచ్చు. ఎఫ్.ఎ.ఓ. ఎప్పటికప్పుడు మిడతల స్థితిగతులపై బాధిత దేశాలకు సమాచారం ఇస్తూ ఉంటుంది. జూన్ 22 నుంచి జూలై 19 వరకు రాజస్థాన్ మీదుగా మిడతల దండయాత్ర మరింత ఉధృతం కాబోతున్నదని, సర్వసన్నద్ధంగా ఉండాలని ఎఫ్.ఎ.ఓ. భారత ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 16 రాష్ట్రాలను హెచ్చరించినట్లు సమాచారం. మిడతల నియంత్రణకు ట్రాక్టర్లు, ఫైరింజన్లతోపాటు డ్రోన్ల ద్వారా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పురుగుమందులు పిచికారీ చేస్తున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేపనూనె పిచికారీ చేయాలి: స్వామినాథన్ ♦ ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎమ్మెస్ స్వామినాథన్ సహా పలువురు శాస్త్రవేత్తలు రైతులు రసాయనాలు పచికారీ చేయవద్దని సూచిస్తున్నారు. మిడతల రాకకు ముందు రోజుల్లో పంటలపై వేప నూనె కలిపిన నీటిని పిచికారీ చేయాలని డా. స్వామినాథన్ ఇటీవల ట్వీట్ చేశారు. వేప నూనె వాసన, రుచికి పంటలను మిడతలు తినకుండా వెళ్లి పోతాయి. అంతేకాదు, వేప నూనె పోషకంగా కూడా పంటలకు పనిచేస్తుందన్నారు. ♦ మిడతల దండును మట్టుబెట్టేందుకు పురుగుమందులు చల్లిన ప్రాంతాల్లో విషతుల్యమైన మిడతలు చచ్చి పడి ఉంటాయి. కాబట్టి, కనీసం వారం రోజుల వరకు పశువులు, కోళ్లు అటువైపు వెళ్లి విషతుల్యమైన మిడతలను తినకుండా రైతులు జాగ్రత్తపడాలి. ♦ ఎడారి మిడతలు దండు కట్టక ముందు బాల్య దశలో సాధారణ స్థితిలో ఉన్నప్పుడు రాత్రి వేళల్లో ఎగురుతాయి. పెరిగి పెద్దయి దండులో చేరిన తర్వాత పగటి పూట ఎగురుతాయి. చెట్లు, పంటలపై వాలి రాత్రి పూట కూడా ఆకులు, కంకులు తింటూనే ఉంటాయి. రైతులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వాల సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ గండం గట్టెక్కాల్సిన సీజన్ ఇది. -
సాగర మథనం.. సాహస జీవనం
కడలి ఘోష వారికి అమ్మపాడే లాలి పాట.. తీరం వారికి తల్లిఒడి.. ఆ గంగమ్మ బిడ్డలకు అలలు అనునిత్యం ఊగే ఊయలలు. ఇతరులను భీతిల్లజేసే అపారజలరాశే వారి వేటకు ఆటపట్టు. సముద్రమే వారికి అన్నం పెట్టే అమ్మ, బతుకు తెరువును నేర్పే గురువు, బతుకంతా కలిసి ఉండే నేస్తం, బతుకు సమస్తం. అందరికీ దినచర్య వేకువతో మొదలైతే.. వారికి అర్ధరాత్రే ఆరంభమవుతుంది. అందరూ గాఢనిద్రలో ఉండే సమయంలో వారు సాగరగర్భంలో వలలతో గాలింపు జరుపుతుంటారు. అగాధ జలధిలో అలవోకగా మెలగే ఆ సాహసికుల జీవితం మాత్రం ఆటుపోట్ల మయం. చేపల వేటలో వారు చూపే తెగువా, పడే శ్రమా నిస్సందేహంగా ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఓ సాహసకృత్యమే. ఇల్లు విడిచి, కడలిలోకి వెళ్లే వారు.. తిరిగొచ్చే వరకూ అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ ఆడే ఉత్కంఠభరిత క్రీడే. సామాన్యులుగా కనిపిస్తూ అసామాన్యమైన ధైర్యస్థైర్యాలను కలిగి ఉండే మత్స్యకారుల జీవనచిత్రాన్ని కళ్లకు కట్టించేదే నేటి ‘సాక్షి’ ఫోకస్.. మత్స్యకారులు...అంటే చేపల వేటతో జీవనం సాగించే వారన్నది అందరికీ తెలిసిందే. అయితే వారి బతుకు లోతుల్లోకి తొంగిచూస్తే అనేక విశేషాలు, విలక్షణతలు కనిపిస్తాయి. వీరి జీవన వలయం తెడ్డు తెర చాపతో ప్రారంభమై ఫైబర్బోటు, డీజిల్ ఇంజ¯ŒS వరకు చేరుకున్నా వారి జీవితాలకు మాత్రం భరోసా దక్కలేదు. సాధారణంగా మత్స్యకారుల పిల్లలు నడక ప్రారంభించిన నాటి నుంచే కడలి వైపు అడుగులు వేస్తారు. చిన్న నీటి గుంటను చూస్తేనే మనం హడలెత్తిపోతాం. కానీ మత్స్యకార బాలలు మాత్రం చిన్ననాటి నుంచీ పెద్ద కెరటాల్లో కేరింతలు కొడుతుంటారు. ఎగిసిపడే కెరటాలను అవలీలగా దాటి సాగరాన్ని సునాయాసంగా ఈదుతారు. చిన్న చెక్క ముక్కే ఆధారంగా ఈదుతూ సుదూరాలకు సాగుతారు. చూసేవారికి భయమేసినా వారికి మాత్రం అదే జీవితం. తెడ్డు తెరచాపతో మొదలై.. గతంలో కేవలం చెక్కతో తయారు చేసిన తెడ్డు, నాటు పడవలు మాత్రమే ఉపయోగించేవారు. చేతితో ఇరగాలా, వగ్గం అనబడే పరికరంతో నూలును పేని వలలు తయారు చేసేవారు. దారంతో తయారు చేసిన వలలు నీటిలో తడిసి చిరిగిపోకుండా ఉండేందుకు చెట్టు బెరడులను మరగబెట్టి ఆ రసంలో నానబెట్టి అనంతరం వలలను ఉపయోగించేవారు. కండబలం, గుండెధైర్యమే పెట్టుబడిగా వేటసాగించి వచ్చిన రాబడితో తృప్తి చెంది జీవించేవారు. తెడ్డు తెరచాపతో సాగరంపై వేట సాగిస్తూ వారు పాడే కూనిరాగాలు వినసొంపుగా ఉండేవి. కుటుంబమంతా ఒకటై.. జిల్లాలోని 13 మండలాల్లో విస్తరించిన సముద్రతీరంలో 99 మత్స్యకార గ్రామాలున్నాయి. వాటిలో 3.89 లక్షల మంది మత్స్యకారులుండగా 1.8 లక్షల మందికి కడలిపై వేటే వృత్తి. మహిళలు భర్తలు వేటాడి తెచ్చిన చేపలను బజారులో అమ్మి సొమ్ము చేసి వచ్చిన దాంతో వండి వార్చుకుని జీవనం సాగించేవారు. గృహంలో మహిళలు వంటా వార్పులో నిమగ్నమయితే మగవారు మరునాడు వేట కోసం చిరిగిన వలలను బాగు చేసుకుంటూ కనిపిస్తారు. ఉన్న గుడిసెలోనే ఇంటిల్లిపాది కలిసి జీవించడం ఉమ్మడి కుటుంబానికి తార్కాణంగా నిలుస్తుంది. అవరోహణ క్రమంలో వేలం.. తీరంలో వ్యాపారాలు విచిత్రంగా ఉంటాయి. వేటాడి తెచ్చిన చేపలకు వేలం పాట నిర్వహిస్తుంటారు. ఈ వేలంపాట అవరోహణ క్రమంలో ఉంటుంది. ముందు ఎక్కువగా పాట పెట్టి అది తగ్గించుకుంటూ వచ్చి చివరకు పాట ఖరారు చేస్తారు. పిల్లలకు పెద్దలు వేటాడి తెచ్చిన చేపలు ఇస్తే ఆ చేపలతో తీరంలో అమ్మే తాటి టెంకలు, దుంపలు, వేరుశెనగలు, ఐస్ల వంటి తినుబండారాలు కొని తింటుంటారు. జట్టీ కడితే కొండంత బరువైనా కాకి ఈకే.. మత్స్యకారులు బరువులు మోసే విధానాన్ని జట్టీ కట్టడం అంటారు. మోయాల్సిన బరువుకు కర్రకట్టి, ఆ కర్రకు అటూఇటూ మత్స్యకారులు ఉండి మోసే విధానాన్ని జట్టీ కట్టడం అంటారు. ఇది చూసేందుకు ఆశ్చర్యంగా ఉన్నా పెను బరువులు మోయడానికి ఈ విధానం మాత్రం ఎంతో సులువైనది. పది మంది మోయలేని బరువును ఇద్దరు జటీ కట్టే విదానంలో మోయగలరంటేనే ఈ విధానంలోని ప్రత్యేకత అర్థమవుతుంది. అమ్మవార్ల పేర్లూ చిత్రమే సాధారణంగా మత్స్యకారులు పూజించే అమ్మవార్ల పేర్లు భాగిర్తమ్మ, బంగారమ్మ, గంగమ్మ, కాశిమ్మ, పోలేరమ్మ, చినతల్లి, పెదతల్లి వంటివే అయి ఉంటాయి. ఇవే పేర్లు మత్స్యకారులు తమ పిల్లలకు పెడుతుంటారు. సాధారణంగా గ్రామ దేవతల ఆలయాలలో ఎక్కువ శాతం వారానికి ఒకసారైనా సాధారణ పూజలు చేస్తుంటారు. కానీ ఈ కోవెలల్లో దేవతలకు మాత్రం ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. నియమనిష్టలతో ఉపవాసాలుండి, పూజలు నిర్వహించి అగ్నిగుండాలు తొక్కడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేటకు వేళాయెరా..! అర్ధరాత్రి 12 గంటలు దాటే వేళ.. లోకమంతా గాఢనిద్రలో మునిగి ఉండే వేళ.. తీర ప్రాంతంలోని ఆ గ్రామాలు మేలుకుం టాయి. వాన కురుస్తున్నా, చలి కరుస్తున్నా చిన్న దుప్పటి కప్పుకొని ఒక వ్యక్తి ‘ఒరే ఎల్లయ్యా! యోసేబూ! నూకప్పా!’ అం టూ ఒక్కో ఇంటి దగ్గరా కేకలు వేస్తూ, ఒక్కొక్కరినీ లేపి వేటకు వేళాయెరా అంటు చెప్పుకుంటూ వెళ్లిపోతాడు. అతని కేక విన్నవారు అంతా నిద్ర లేచి తమ జీవనోపాధికే పయనమవుతారు. చద్దన్నం ముంతలు సర్దుకుని లాంతరు, ఇతర వేట సామగ్రితో తీరానికి బయలుదేరుతారు. తెప్పల వద్దకు వెళ్లి దగ్గరలో భద్రపర్చిన ఇంజన్లు మోసుకొచ్చి అమర్చి వలలు, వేట సామగ్రిని తెప్పలో సిద్ధం చేస్తారు. ఒడ్డున ఉన్న ఒక్కొక్క తెప్పను జట్టీ కట్టి మోసుకొచ్చి కెరటాల మధ్య వేటకు వెళ్లేందుకు సిద్ధం చేస్తారు. ఇంజనులో ఆయిల్ పోసి, స్టార్ట్ చేశాక, వేటకు వెళ్లేందుకు అంతా సిద్ధమని అనుకున్న తర్వాత ఎవరి తెప్పపై వారు ఎక్కి కడలిలోకి కదిలిపోతారు. సుమారు ఒంటిగంటన్నర ప్రాం తంలో ప్రారంభమైన పయనం తెల్లవార్లూ కొనసాగుతుంది. తల్లుల హృదయాల్లా.. తలుపులు లేని కోవెలలు ఆ ఆలయాలలో నిత్యధూపదీపనైవేద్యాలు, పూజలు ఉండవు. కానీ అమ్మవారి ప్రతిమలు ఉంటాయి. కొలిచే భక్తులూ కోకొల్లలే. వైవిధ్యభరితంగా కనిపించే ఆ కోవెలలే మత్స్యకారులు కొలిచే దేవతల ఆలయాలు. ఈ గుడులు చిన్నచిన్న ఆలయాలుగా ఉండి ఒకే చోట రెండు నుంచి ఐదేసి వరుసగా నిర్మించి ఉంటాయి. ఆలయాలపై ఎటువంటి కళాకృతులు ఉండవు.ముఖమండపాలు అసలే కనిపించవు. వాటిలో దేవతామూర్తుల ప్రతిరూపాలు విలక్షణంగా ఉంటాయి. కొన్ని విగ్రహాలు అమ్మవారి రూపాలతో ఉండగా కొన్ని విచిత్ర రూపాలలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వివిధ ఆకృతులలో ఉన్న చెక్కతో తయారు చేసిన విగ్రహాలు కనిపిస్తాయి. ఏ ఆలయానికైనా ద్వారబంధాలు తప్ప తలుపులు కానరావు. సాగరంలో జీవనపోరాటం చేస్తున్న తమకు ఎప్పుడు ఎదురుగా కనిపించే విధంగా ప్రతి ఆలయం సముద్రతీరానికి అతి దగ్గరలో సముద్రం వైపు ముఖం ఉండేలా (సముద్రం లోంచి చూస్తే అమ్మవారు కనిపించేలా) నిర్మించి ఉంటాయి. అమ్మవారు ఎప్పుడూ తమకు తోడునీడగా ఉండాలని, ఆలయాలకు తలుపులు బిగిస్తే ఆమెను బంధించినట్టవుతుందన్న భావనతోనే తమ పూర్వీకులు ఈ విధంగా ఆలయాలకు తలుపులు వేసేవారు కాదని మత్స్యకార పెద్దలు చెబుతున్నారు. అర్ధరాత్రి వేటకు వెళ్లే మత్స్యకారులు వలలు, ఇతర సామగ్రితో చేతులు ఖాళీ లేకుండా వెళుతుండడం వల్ల తలుపులు తీయడం వీలు కుదరదు కాబట్టి అమ్మవార్లకు మొక్కుకునే విధంగా ఎప్పుడూ అమ్మవార్లు ఎదురుగా కనిపించాలనే ఉద్దేశంతోనే తలుపులు ఏర్పాటు చేయరని, ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారమని చెబుతున్నారు. కటిక చీకటిలోనే వేట చుట్టూ కటిక చీకటి. తెప్పలో ఉన్న వారికి మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. కొన్ని గంటల ప్రయాణం తరువాత మత్స్యకారులు వెంట తెచ్చిన వలను వేయనారంభిస్తారు. తమ వలను మరో తెప్ప ధ్వంసం చేయకుండా ఉండేందుకు ఆనవాలుగా నీటిపై తేలిఆడే విధంగా తయారు చేసిన కిరోసిన్ లాంతరును వల వేసిన చోట వదులుతారు (ప్రస్తుతం బ్యాటరీలతో తయారు చేసిన ఎల్ఈడీ బల్బులు వాడుతున్నారు) వల వేశాక సహచరులందరూ నిష్క్రమించగా ఒక్క మత్స్యకారుడు మాత్రం తెప్పకు లంగరు వేసి వలను పరి శీలిస్తూ కాపలా కాస్తుంటాడు. తెలవారనుండగా తిరిగి వలను పైకి లాగి పడిన చేపలను భద్రపరుచుకుంటారు. సూర్యోదయమవుతుండగా వలలు సర్దుకుని తీరానికి తిరుగుము ఖం పడతారు. వేటాడి తెచ్చిన చేపలను విక్రయించి వలలు, తెప్పలు, ఇంజన్లను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకొని వేటలో తెగిన వలలను అల్లుకొనే పనిలో నిమగ్నమవుతారు. కడలి సృష్టించే కన్నీటి సంద్రాలు వేట క్రమంలో ప్రమాదాలకు గురై ఆచూకీ లేకుండా పోయిన మత్స్యకారుల కోసం వారి కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తుంటాయి. 11 సంవత్సరాల క్రితం సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళి గల్లంతయ్యారు. అప్పటి నుంచీ వారి ఆచూకీ లభించలేదు. కానీ వారి కుటుంబీకులు వారి కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. నడికడలిలో ప్రమాదాలకు గురై ఉప్పు నీరు తాగి, పచ్చి చేపలు తిని, పదిరోజులు గడిపి ప్రాణాలతో బయటపడిన వారున్నారు. కొత్తపల్లి మండలం అమీనాబాద్కు చెందిన ఒక మత్స్యకార కుటుంబం పారాదీప్ వెళ్ళి అక్కడ వేట సాగిస్తూ జీవనోపాధి పొందేది. ఆ క్రమంలో సోదే కోటియ్య, నగేష్, జగన్నాథం బోటుపై పారాదీప్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బోటు మునిగిపోవడంతో ఒక చెక్క ముక్కను ఆధారంగా చేసుకొని పది రోజుల పాటు నడిసంద్రంలో గడిపారు. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక, ఉప్పు నీటినే తాగుతూ, చేతికి చిక్కిన పచ్చి చేపలనే తింటూ ఎవరైనా వచ్చి కాపాడకపోతారా అనే ధైర్యంతో నిరీక్షించారు. ప్రాణాలు కడలిలో కలిసే స్థితిలో అటుగా వెళ్లిన కొందరు జాలర్లు గమనించి రక్షించారు. ఇలా మత్స్యకారుల జీవితాలలో అనేక జీవన్మరణ సంఘటనలు తరుచూ చోటు చేసుకుంటూనే ఉంటాయి. కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెట్టే మత్స్యసంపదను ప్రాణాలకు తెగించి వేటాడి తెచ్చే మత్స్యకారులకు మాత్రం ప్రభుత్వపరంగా సౌకర్యాలు అందుతున్న దాఖలాలు లేవు. అప్పుడున్నన్ని చేపలు లేవు.. అర్ధరాత్రి 12 గంటల దాటినప్పటి నుంచి మా దినచర్య ప్రారంభమయ్యేది. చీకట్లోనే భుజాన్న వలవేసుకుని కర్రతెప్పను తీసుకుని వేటకు బయలుదేరేవారము. రోజంతా వేటాడితే బత్తానికి తులమో ఫలమో దొరికేది. అప్పుడు అర్ధరూపాయి వచ్చినా కుటుంబం అంతా కలిసి బువ్వతినేవాళ్లము. ఇప్పుడు వంద వచ్చినా ఇద్దరికీ చాలడంలేదు. ఆ నాడు రొయ్యలు పడినా ఒక్కరూ కొనేవారు కాదు. నేడు వాటినే బంగారం కంటే ఎక్కువగా కొంటున్నారు. ఇసుకలో నడిస్తే తుపా¯ŒS వస్తుందోలేదో తెలిసిపోయేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నా వేటాడేందుకు చేపలు లేవు. అప్పట్లో ఒకే రకం వల ఉండేది. దానితోనే వేట సాగించేవారు. పెద్ద చేపలు ఒడ్డులోనే కనిపించేవి. – కంబాల తాతబ్బాయి వేటకు వెళితేనే రోజు గడిచేది.. మాది కొత్తపల్లి మండలం అమినాబాద్. సుమారు 75 ఏళ్లుగా చేపల వేట సాగించి బువ్వతింటున్నా. గతంలో చిన్నపాటి చెక్కతో చేసిన పడవలపై తెరచాపనే ఆధారంగా చేసుకుని వేటకు వెళ్లేవారము. అప్పట్లో తీరంలో ఎటువంటి సౌకర్యాలు లేక భయంకరంగా వచ్చే అలలను దాటడమే మాకు ప్రాణం పోయేంత పనిగా ఉండేది. ఎలాగోలా కడలిలో అడుగు పెట్టి ఓపిక ఉన్నంత మేర వేట సాగించి తిరిగి ఇంటికి చేరితే ఆరణాలో, అర్ధరూపాయో సంపాదించగలిగేవారము. అప్పట్లో మేమే దారాన్ని పేని వలలు తయారు చేసేవారము. సోడి అంబలి, జావ తినేవాళ్లము. రాత్రనక, పగలనక వేట సాగించినా కొనే నాథుడు ఉండేవాడు కాదు. ఇప్పటిలా ఏ విధమైన సౌకర్యాలు లేకపోయినా కెరటాల ఉధృతి, గాలివాటాన్ని బట్టి సముద్రంలో పరిస్థితిని అంచనా వేసి వేట సాగించేవారము. ఏ రోజు వేట దొరికేతే ఆ రోజే గడిచేది. – రాచపల్లి భూలోకం స్టోరీ: సాక్షి ప్రతినిథి, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. -
సూర్యుణ్ని ఫొటో తీయవచ్చా?
కెమెరా చూడగానే ఎవరికైనా సరే ఫొటో తీయాలని లేదా ఫొటో తీయించుకోవాలని కోరిక కలగటం సహజం. అందునా ముఖ్యంగా అందమైన నదీనదాలు, కొండలు, లోయలు, పక్షులు, వన్యప్రాణులు... ఇంకా వినీలాకాశం, మేఘాలు, ఆకాశంలో మారే రంగులు ఇవన్నీ తమ కెమెరాలో బంధించి చక్కటి ఆల్బమ్ రూపొందించాలని చాలామంది భావిస్తుంటారు. అలాగే సూర్యుడిని కూడా ఫొటో తీస్తే బావుంటుందనిపిస్తుంది. కానీ ఇలా చేయటం చాలా ప్రమాదం. ఎందుకంటే కెమెరా ముందు భాగంలో ఉన్న కుంభాకార కటకం మీద పడ్డ సూర్యుని కిరణాలను లోపల ఉన్న కటక వ్యవస్థ గ్రహించి మన కంటి వెనక్కి ప్రసరింపచేస్తుంది. ఆ తీక్షణమైన కిరణాలు కనుగుడ్డులోకి దూసుకుపోతే దృష్టి దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే బైనాక్యులర్స్, టెలిస్కోప్ లాంటి పరికరాల్లోంచి సూర్యుణ్ని చూడాలి. అంతే తప్ప సాధారణ కెమెరాతో చూడకూడదు. సూర్యుడిని గురించి అధ్యయనం చేసే అంతరిక్ష శాస్త్రజ్ఞులు కూడా సూర్యుడి ప్రతిబింబాన్ని తెర వెనక్కు ప్రసరింపచేసి చూస్తారు. గెలీలియో టెలిస్కోపు ద్వారా నేరుగా సూర్యుడిని చూసి తన కంటి చూపును కోల్పోయాడు. అందుకే సూర్యుడితో జాగ్రత్తగా ఉండాలి.