breaking news
Sathupally road
-
బొగ్గే ముద్దు.. జనాలు వద్దు!
పెరిగిన అంచనా వ్యయం.. కలగానే మారుతున్న సత్తుపల్లివాసుల రైలు ప్రయాణం.. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రైల్వే లైను నిర్మాణంతో కేవలం బొగ్గు రవాణాకే పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైను నిర్మాణ పనుల్లో మూడు స్టేషన్ల రద్దు తీవ్ర చర్చనీయాంశమైంది. సంబంధిత రైల్వే శాఖ అధికారులు దీనిని అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ సీతంపేట రైల్వే స్టేషన్ నిర్మాణ పనుల నిలిపివేతతో ఆ నిర్ణయం స్పష్టమవుతోంది. రైల్వే శాఖ, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి బొగ్గు రవాణాతోపాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మిస్తున్న 56 కిలోమీటర్ల నిడివి గల రైలు మార్గం బొగ్గు రవాణాకే పరిమితం కానుంది. చుక్.. చుక్ రైలొస్తుంది.. అందరు పక్కకు జరగండి.. ఆగకుండా వెళ్తుంది అన్న చందంగా తయారైంది సత్తుపల్లివాసుల పరిస్థితి. సాక్షి, ఖమ్మం : భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైను నిర్మాణం కోసం 2015–16లో రూ.740కోట్ల అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో రైలుమార్గం నిర్మాణానికి సింగరేణి సంస్థ రూ.618కోట్లు, రైల్వే శాఖ భూ సేకరణ కోసం రూ.85కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకొచ్చాయి. అయితే 2018–19లో ప్రాజెక్టు ప్రారంభం కావడంతో ప్రస్తుత అంచనా విలువ రూ.952కోట్లకు చేరింది. ఇందులో రైల్వే లైను నిర్మాణానికి సింగరేణి సంస్థ వాటా రూ.618కోట్ల నుంచి రూ.704కోట్లకు పెరిగింది. అలాగే భూ సేకరణకు రైల్వే శాఖ అదనపు నిధులు చెల్లించనుంది. అయితే సింగరేణి సంస్థ తాము కేవలం రైల్వే లైను నిర్మాణానికే నిధులు ఇస్తామని, గతంలో కేటాయించిన నిధుల కంటే పెంచి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అంటే పెరిగిన సింగరేణి సంస్థ వాటా అంచనా వ్యయం సుమారు రూ.86కోట్లు అదనంగా ఇచ్చేది లేదని చెప్పింది. చేసేది లేక రైల్వే శాఖ.. రైల్వే లైను మార్గంలో కొన్ని పనులను తగ్గించి.. అందుబాటులో ఉన్న నిధులతోనే పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం రైల్వే లైను మార్గంలో ఉన్న సుజాతనగర్ మండలం సీతంపేట, పెనుబల్లి మండలంలోని పెనుబల్లి జంక్షన్, సత్తుపల్లి రోడ్డు(లంకపల్లి) రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులను నిలిపివేసింది. ఆ శాఖకు అక్కడ స్టేషన్ల నిర్మాణ వ్యయం తగ్గనుంది. కోయగూడెం, చండ్రుగొండ, భవన్నపాలెంలో మాత్రమే రైల్వే స్టేషన్లు నిర్మించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. సీతంపేటలో సగం మేర నిర్మించిన రైల్వే స్టేషన్ పనులు నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి. పెనుబల్లి జంక్షన్, సత్తుపల్లి రోడ్ స్టేషన్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే నిలిచిపోయిన మూడు రైల్వే స్టేషన్లు బొగ్గు రవాణాకు, ప్రజా రవాణాకు ప్రాముఖ్యత, అవసరం ఉన్నవే. ఆ స్టేషన్లే కీలకం.. భవిష్యత్లో సత్తుపల్లి రోడ్ నుంచి కొవ్వూరుకు 73 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణం జరగాలంటే సత్తుపల్లి రోడ్(లంకపల్లి) స్టేషన్ ఏర్పాటే కీలకం. అలాగే పెనుబల్లి జంక్షన్ నుంచి విజయవాడ సమీపంలోని కొండపలి్లకి 80 కిలోమీటర్ల రైల్వే లైను విస్తరించాలంటే పెనుబల్లి జంక్షన్ అవసరం. సీతంపేటలో ఇప్పటికే సగం మేర చేపట్టిన స్టేషన్ నిర్మాణ పనులు మధ్యలో వదిలేస్తే నిరుపయోగంగా మారే పరిస్థితి ఉంది. రైతులు, ప్రజా రవాణాకు కూడా రైల్వే లైను ఉపయోగపడుతుందనే తలంపుతో తమ భూములను భూ సేకరణలో కోల్పోయినప్పటికీ ప్రజా ప్రయోజనార్థం అంగీకరించారు. ప్రస్తుతం రైల్వే అధికారుల తీరుతో రైల్వే లైను కేవలం బొగ్గు రవాణాకే పరిమితం అవుతుందని, ప్రజా రవాణాకు ఉపయోగపడని.. సింగరేణి లాభార్జన కోసం ఉపయోగించే రైల్వే లైనుకు తమ భూములు ఎందుకివ్వాలంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ నాటికి రైల్వే లైను నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. భూ సేకరణలో జాప్యం, అరకొర నిధుల కేటాయింపుతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. వచ్చే డిసెంబర్ నాటికి.. ఇప్పటికే భూ సేకరణ 90 శాతం పూర్తయిందని, కోర్టు కేసులు, రైతులు నిరాకరించిన 10 శాతం భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు రైల్వే కట్ట నిర్మాణం 50 శాతం, బ్రిడ్జిల నిర్మాణం 50 శాతం, విద్యుద్దీకరణ పనులు 20 శాతం పూర్తయ్యాయి. వీటిలో భూ సేకరణకు రైల్వే శాఖ రూ.130కోట్లు, రైల్వే లైను నిర్మాణానికి సింగరేణి సంస్థ రూ.150కోట్లు.. మొత్తం రూ.280కోట్లు రైల్వే నిర్మాణానికి ఖర్చు చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. భూ సేకరణ సజావుగా పూర్తయి.. నిధులు సకాలంలో సమకూరితే డిసెంబర్ 2020 నాటికి రైల్వే లైను నిర్మాణ పనులు పూర్తవుతాయని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా సింగరేణి సంస్థ లాభార్జనే ధ్యేయంగా కాకుండా.. బొగ్గు రవాణా వల్ల కాలుష్యం బారిన పడుతున్న రైల్వే మార్గంలోని గ్రామాల్లో మొదట్లో గుర్తించిన రైల్వే స్టేషన్ల నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించి, కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ప్రజలకు రవాణా సేవలు అందేలా చూడాలని సత్తుపల్లి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కాగా.. దీనిపై సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్.నరి్సంహారావును వివరణ కోరగా... బొగ్గు రవాణా కోసం రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయించడం వరకే మా బాధ్యత. నిర్మాణం, పనుల వ్యవహారం అంతా రైల్వే శాఖ చూసుకుంటుంది. ఇంకా దీనిపై మా వద్ద ఎటువంటి సమాచారం లేదు. -
చుక్..చుక్.. రైలు వస్తోంది...
సత్తుపల్లి, న్యూస్లైన్: డోర్నకల్రోడ్(కొత్తగూడెం) నుంచి సత్తుపల్లిరోడ్ వరకు 56 కిలోమీటర్ల రైలుమార్గం వేసేందుకు సర్వే పూర్తయింది. పెనుబల్లి జంక్షన్గా ఐదు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 3.4 కిలోమీటర్ వద్ద సీతంపేట స్టేషన్, 22.8 కిలోమీటర్ వద్ద భవన్నపాలెం, 39.25 కిలోమీటర్ వద్ద చండ్రుగొండ, 44 కిలోమీటర్ వద్ద పెనుబల్లి జంక్షన్, 53.2 కిలోమీటర్ వద్ద సత్తుపల్లిరోడ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే భూసార పరీక్ష లు పూర్తి చేశారు. రైలు మార్గంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులపై వంతెనల నిర్మాణం కోసం ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సత్తుపల్లిరోడ్ రైల్వేస్టేషన్ కొత్త లంకపల్లి శివాలయం వెనుక ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఓపెన్కాస్టుకు వెళ్లే విధంగా రైల్వేలైన్ వేస్తున్నారు. కొత్తలంకపల్లి రాష్ట్రీయ రహదారిపై ఓవర్బ్రిడ్జి కట్టేందుకు ప్రతిపాదన చేశారు. బొగ్గు రవాణా చేసేందుకు.. : సత్తుపల్లి ఓపెన్కాస్టు నుంచి బొగ్గు రవాణా చేసేందుకు సింగరేణి సంస్థ రైల్వేలైన్ కోసం రూ.335 కోట్లతో ప్రతిపాదనలు చేసింది. రైల్వేలైన్ కోసం సింగరేణి యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచటంతో సర్వేప్రక్రియ పూర్తి చేశారు. రైల్వేలైన్ ఆలస్యం కావటం వలన సింగరేణి విస్తరణపై ప్రభావం చూపుతోంది. సత్తుపల్లి ఓపెన్కాస్టు-2 ప్రారంభించాలంటే.. రైల్వేలైన్ తక్షణం అవసరం అవుతుంది. టిప్పర్ల ద్వారా కొత్తగూడెంకు బొగ్గు రవాణా చేయటానికి పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం లేకపోవటంతో రైల్వేలైన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. 1200 ఎకరాల భూ సేకరణ చేయాలని ప్రాథమిక అంచనాకు వచ్చారు. పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద ైరైల్వే స్టేషన్ నిర్మాణం కోసం 34 ఎకరాలు ఇటీవలే జనరల్ అవార్డు జారీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బొగ్గు రవాణాతో పాటు ప్రయాణికుల కోసం భద్రాచలం రైలు కూడా నడిపే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో ఆరునెలల్లో రైల్వే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు న్నాయి. పెనుబల్లి జంక్షన్ నుంచి.. పెనుబల్లి జంక్షన్ నుంచి కృష్ణాజిల్లా కొండపల్లి వీటీపీఎస్కు రైలు మార్గం కోసం ట్రాన్స్కో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. సత్తుపల్లిరోడ్ రైల్వేలైన్ పనులు పూర్తి అయితే పెనుబల్లి జంక్షన్గా కొండపల్లికి రైలు లైన్ కోసం సర్వే పనులు చేపడతామని సర్వే బృందం ‘న్యూస్లైన్’కు తెలిపింది. ప్రస్తుతం భద్రాచలం రోడ్డు, డోర్నకల్, ఖమ్మం, మధిర మీదుగా వీటీపీఎస్కు బొగ్గు రవాణా అవుతోంది. పెనుబల్లి జంక్షన్ మీదుగా కొండపల్లి వీటీపీఎస్కు రైల్వేలైన్ వేయటం వలన బొగ్గు రవాణా మరింత సులభం అయ్యేఅవకాశం ఉంది.