breaking news
RTO posts
-
ఆర్టీఓలు కావలెను!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖలో ఆర్టీఓలు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏకంగా ఆర్టీఓ పోస్టుల్లో సిబ్బంది లేకపోవడంతో ఇన్చార్జుల పాలనే నడుస్తోంది. దాదాపుగా మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నియామకాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇదే అదనుగా చాలా చోట్ల దళారులు చెలరేగుతున్నారు. నేపథ్యం ఏంటి? 2016 అక్టోబర్ వరకు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి. వాటికి అనుగుణంగా 10 మంది ఆర్టీఓలు ఉండేవారు. కానీ, 2016 దసరా తర్వాత జిల్లాల సంఖ్య 31కి చేరింది. దీంతో మిగిలిన జిల్లాలకు కొత్తగా ఆర్టీఓలు, ఇతర సిబ్బంది అవసరమయ్యారు. అయితే ఈ మేరకు నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆ ఆర్టీఓ అధికారులకే మిగతా కార్యాలయాలను అప్పగించారు. దీంతో వీరిపై తీవ్ర పనిభారం పెరిగింది. అయితే వీరికి బాధ్యతలు అప్పగించిన స్థానంలో ఇన్చార్జులుగా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు/ అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిని ఆర్టీఓలుగా నియమించారు. మరీ కీలకమైన పనులు ఉన్నపుడు మాత్ర మే ఆర్టీఓలు సదరు కార్యాలయాలకు వెళ్తున్నారు. ఇన్చార్జులకు పనిభారం.. ప్రస్తుతం 31 జిల్లాలకు 14 జిల్లాలకు ఆర్టీఓలున్నారు. మిగిలిన 17 జిల్లాలకు మాత్రం ఇన్చార్జులే ఆర్టీఓలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వీరిని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ (డీటీఓ)లుగా పిలుస్తున్నారు. వీరిలో 9 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, 8 మంది డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్లున్నారు. వాస్తవానికి ఆర్టీఓలుగా పదోన్నతి పొందడానికి వీరిలో చాలామందికి అర్హత ఉంది. మూడేళ్లుగా ఇన్చార్జులుగా విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం పదోన్నతులు కల్పించలేదు. ఇటు పనిభారం పెరగటంతో పాటు కనీసం అలవెన్సులు కూడా పెంచలేదంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా అర్హులను ఆర్టీఓలుగా నియమించాలని వారు కోరుతున్నారు. త్వరలో మరో రెండు కొత్త జిల్లాలు.. మరో రెండు కొత్త జిల్లాల (ములుగు, నారాయణ్ పేట్) ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జ్ ఆర్టీఓలుగా ఉన్న 17 జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే 2 కొత్త జిల్లాలకు ఆర్టీఓ అధికారులు అవసరమే. ఏజెంట్లదే హవా.. ఇన్చార్జి ఆర్టీఓలున్న ఆఫీసుల్లో ప్రైవేటు ఏజెంట్లు హల్చల్ చేస్తున్నారు. వీరు ఏకంగా సిబ్బందితో కలసిమెలసి ఉంటున్నారు. సాధారణంగా వివిధ పర్మిట్లకు సంబంధించిన వివిధ స్మార్ట్కార్డులు స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. కానీ, ఈ ఏజెంట్లకు రూ. 200 ఇస్తే చాలు. క్షణాల్లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, వివిధ రకాల పర్మిట్లు నేరుగా చేతిలో పెడుతున్నారు. గతంలో కింది స్థాయిలో పనిచేసిన సమయంలో ఏజెంట్లతో వీరికున్న సాన్నిహిత్యమే ఇందుకు కారణమన్న విమర్శలున్నాయి. -
పరువు తీసేశారు : చంద్రబాబు నాయుడు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ‘పోస్టులు అమ్ముకుని... ఆ విషయాన్ని బయటపెట్టుకుని ప్రభుత్వం పరువు తీసేశారు. హుద్హుద్ తుపానుతో ఏదో మంచిపేరు వస్తుందని నేను అనుకుంటే... మీరు అది కాస్తా ఆర్డీవో పోస్టులు అమ్ముకుని దెబ్బతీశారు. పోస్టులు అమ్ముకున్నారని ఎమ్మెల్యేలే చెబితే ఇక ఏం చేయగలం. అలా ఎవరైనా బయటపెట్టుకుంటారా!... ఇక ప్రజల్లోకి ఎలా వెళ్తాం!’ అని సీఎం చంద్రబాబు తనను కలిసిన మంత్రి గంటా వర్గీయులైన ఎంపీ,ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు. ఆర్డీవోల బదిలీల వ్యవహారంలో మంత్రులు గంటా, అయ్యన్నల వివాదంతో పరువు బజారున పడటంతో సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆదే సమయంలో పోస్టులు అమ్ముకున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి అయ్యన్న ప్రతిపాదనకే సీఎం చంద్రబాబు మొగుగచూపినట్లు తెలుస్తోంది. సింగపూర్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు శనివారం ఈ వ్యవహారంపై ఆరా తీశారు. మరోవైపు గంటా వర్గీయులైన ఎంపీ, ఎమ్మెల్యేలు ఆయన్ని శనివారం రాత్రి కలిసి తమ వాదన వినిపించారు. ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాం ఆర్డీవో బదిలీల వ్యవహారంలో తమ మాటా చెల్లుబాటుకాకపోవడంతో మంత్రి గంటా వర్గం నేరుగా సీఎం చంద్రబాబుతోనే తేల్చుకోవాలని భావించింది. అందుకే మంత్రి గంటా వర్గీయులైన ఎంపీ అవంతీ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బండారు సత్యన్నారాయణమూర్తి, పీలా గోవింద్, పల్లా శ్రీనివాస్, కెఎస్ఎన్ఎస్రాజు, అనితలు శనివారం రాత్రి చంద్రబాబును కలిశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు జిల్లాలో రెవెన్యూ, పంచాయతీరాజ్ పోస్టులను అమ్ముకున్నారని ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే వెలగపూడి వైఖరి వల్ల పార్టీ పరువు బజారున పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్తామని ఎమ్మెల్యే బండారు సత్యాన్నారాయణమూర్తి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. వీరి వాదనను ఆసాంతం విన్న చంద్రబాబు అదే స్థాయిలో స్పందించారు. పోస్టులు అమ్ముకున్న విషయాన్ని మనమే బయటపెట్టుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ‘హుద్హుద్ తుపానుతో ఏదో చేసి మంచిపేరు తెచ్చుకుందామని నేను ప్రయత్నిస్తుంటే మీరు అంతా పాడు చేశారు. ప్రభుత్వం పరువు తీసేసి బజారున పడేశారు’అని సీఎం తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఇక జిల్లాలో ప్రజలకు మొహం ఎలా చూపించాలని కూడా ఆగ్రహంగా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. గంటా వర్గం మాత్రం అయ్యన్య వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ తమ వాదనను వినిపించి వచ్చింది. అయ్యన్నదే పైచేయి...గంటాకు ఝలక్! ఆర్డీవోల బదిలీల వ్యవహారంలో మంత్రి అయ్యన్నవైపే చంద్రబాబు మొగ్గుచూపారు. ఆయన శనివారం రెవెన్యూ మంత్రి కేవీ కష్ణమూర్తితో చర్చించడమే కాకుండా తన ముఖ్యకార్యదర్శి సతీష్చంద్రను వివరణ కోరారు. కేఈ కృష్ణమూర్తి కూడా మంత్రి అయ్యన్నను సమర్థించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్ర అన్ని విషయాలను సీఎంకు వివరించారు. చంద్రబాబు చివరికి అయ్యన్న వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. ఆయన సూచించినట్లుగా ఆర్డీవోగా వై.రామచంద్రారెడ్డి బదిలీని ఖరారు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పారు. విశాఖపట్నం ప్రసుత ఆర్డీవో వెంకట మురళిని రెండ్రోజుల్లో విధుల నుంచి రిలీవ్ చేయాలని చెప్పినట్లు సమాచారం. ఈ పరిణామాలతో గంటా వర్గానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలినట్లేనని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లా వ్యవహారాల్లో గంటా మాటకంటే అయ్యన్నమాటకే ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారని కూడా చెబుతున్నాయి.