యూపీఏ కుంభకోణాల మయం
= కేంద్రం, రాష్ర్టంలో ధృతరాష్ట్రుని పాలన
= మండిపడిన బీజేపీ యువమోర్చా ాష్ర్ట అధ్యక్షుడు మునిరాజ్
సాక్షి, బళ్లారి : యూపీఏ లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు అడిగే కనీస అర్హత లేదని బీజేపీ యువ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు మునిరాజ్ పేర్కొన్నారు. నగరంలోని రాయల్ ఫోర్ట్ హోటల్లో యువమోర్చా ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏ కుంభకోణం వెలుగు చూసినా యూపీఏ పాత్ర ఉండటంతో కాంగ్రెస్పై ప్రజలు విసిగిపోయారన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేయడంలో విఫలమైందన్నారు. రూపాయి కిలోబియ్యం ఇచ్చినంత మాత్రాన ఒరిగేదేమి లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా నియంత్రించలేని దుస్థితిలో సీఎం సిద్ధరామయ్య ఉన్నారన్నారు. కేంద్రంలోని యూపీఏ, రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డిగా పాలన చేస్తున్నాయని మండిపడ్డారు. మైనార్టీల ఓట్ల కోసం షాదీ భాగ్య అమలు చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వర్గాలకూ ఈ పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి కార్యకర్తలు శ్రమించాలన్నారు. రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి స్వలాభం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
బళ్లారి జిల్లాలో బీజేపీకి మంచి పట్టు ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర బీజేపీ స్లం మోర్చా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ ఏఎం.సంజయ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీజేపీ గాలులు వీస్తున్నాయన్నారు. అనంతరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్, జిల్లా బీజేపీ నాయకుడు రామలింగప్ప ప్రసంగించారు. నాయకులు మురారీగౌడ, సుధీర్, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీకనక దుర్గమ్మ ఆలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు.