breaking news
Rajani Pandit
-
తొలి లేడీ డిటెక్టివ్..! ఆఖరికి పెళ్లి గురించి కూడా...
మనం టీవీల్లో, సినిమాల్లో.. ట్రెంచ్కోట్ ధరించి, ఆధారాలను వెంబడిస్తూ..నేరస్థులను బయటపెట్టే డిటెక్టివ్లను చూశాం, ఆయా కథలు, నవలలు చదివాం. కానీ మహిళా డిటెక్టివ్ల గురించి వినడం గానీ, తెరపై చూడటం గానీ అత్యంత అరుదు. కానీ ఈమె సమస్యను బట్టి వేషం మారుస్తూ.. ఎన్ని కేసులు పరిష్కరించారో తెలిస్తే షాకవ్వుతారు. మహిళలు అత్యంత అరుదుగా వచ్చే ఈ వృత్తిలో కొనసాగుతూ.. నిలదొక్కుకోవడమే గాక మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక్కోసారి నిజాలను వెలికి తీసినా.. బయటకు చెప్పకుండా..కౌన్సలర్లుగా వ్యవహరిస్తుంటుంది కూడా. ఆ మహిళే..రజనీ పండిట్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిశబ్దంగా తనపని తాను చూసుకుంటూ పోతూ..తన వృత్తిని నిర్మించుకున్నారామె. అలా ఆమె భారతదేశపు తొలి మహిళా ప్రైవేట్ డిటెక్టివ్గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రమాదం అనేది ఆమె ఉద్యోగంలో అంతర్భాగం. రచయిత్రి నటి, రచయిత్రి ఛవి మిట్టల్తో ఒక పాడ్కాస్ట్లో రజనీ మాట్లాడుతూ..తన వృత్తి గురించి ఇలా చెప్పుకొచ్చారు. దాదాపు 40 ఏళ్లుగా దేశవ్యాప్తంగా వేలాది కేసులను చేధించినట్లు తెలిపారు. అయితే తనను తాను స్వతాహాగా డిటెక్టివ్ అవ్వాలని ఎన్నడు అనుకోలేదని చెప్పుకొచ్చారామె. ఆ ఒక్క కేసు ఆమె జీవితాన్నే మార్చేసింది..కాలేజీ రోజుల్లో, ఇంట్లో విలువైన వస్తువులు పదేపదే మాయమవుతుండటంతో ఒక క్లాస్మేట్ సహాయం కోసం ఆమె వద్దకు వచ్చింది. ఎప్పుడూ ఆసక్తిగా ఉంటూ, మనుషులను అర్థం చేసుకోవడంలో నేర్పరి అయిన రజనీ, స్వయంగా ఆ విషయాన్ని పరిశీలించి..చివరికి దొంగను గుర్తించింది. కేవలం ఒక సాధారణ ఆసక్తిగా మొదలైనది నెమ్మదిగా ఒక అసలైన వృత్తిగా మారింది. తాను 1986లో, కేవలం 24 ఏళ్ల వయసులో, సొంత ఏజెన్సీ ‘రజనీ ఇన్వెస్టిగేటివ్ బ్యూరో’ను ప్రారంభించినట్లు తెలిపారు. దీన్నే తర్వాత ‘రజనీ పండిట్ డిటెక్టివ్ సర్వీసెస్’ అని పేరు మార్చారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే పనిజీవితం ప్రారంభమైందని అన్నారు. అందువల్లే పెళ్లి కూడా చేసుకోలేకపోయానని చెప్పారు. కనీసం కుదురుగా కూర్చోని టీవి కూడా చూడలేనని అన్నారామె. ఎందుకంటే పదే పదే ఫోన్ మోగుతూనే ఉంటుందని అన్నారు. కేసుకి అనుగుణంగా మారిపోతా..!ఒక కేసు దర్యాప్తు కోసం తనను తాను పూర్తిగా మార్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండాలని అదే తన విజయాలకి ప్రధాన కారణమని తెలిపారు. ఇన్నేళ్లలో పనిమనిషిగా, వీధి వ్యాపారిగా, అంధురాలిగా, మానసిక అస్థిరత ఉన్న మహిళగా ఇలా ఎన్నో రకాలుగా నటించినట్లు వెల్లడించారు. తాను చేపట్టిన తొలి అత్యంత ప్రమాదకరమైన కేసులో ఒకటి..అనుమానితురాలి ఇంట్లో పనిమనిషిగా నిశసించడం అని చెప్పుకొచ్చారు. జంట హత్యల కేసును ఛేదించడానికి ఆరు నెలల పాటు పనిమనిషిగా మారువేషంలో ఉండి ఆధారాలు సేకరిస్తుండగా..ఒకరోజు కెమెరా క్లిక్ మనడంతో వెంటనే నిందితురాలు తనను అనుమానించడం మొదలు పెట్టిందన్నారు. తను అటాక్ చేసే లోపలే ఆధారాలన్నీ పక్కాగా సేకరించి ఆమెను కటకటాల వెనక్కి పంపినట్లు తెలిపారు. కొన్ని కేసులు పిల్లలు చెడు వ్యసనాలకు సంబంధించినవి, విచ్చినమైన సంబంధాలతో బాధపుడుతున్న కుటుంబాలు వంటి కేసులను కూడా చేధించారు. అలా ఆ క్రమంలో కౌన్సలర్లగా కూడా మారతామని అంటున్నారామె. అయితే వివాహేతర సంబంధాన్ని కోర్టులో నిరూపించడం చాలా కష్టమని చెప్పారు. అందుకే తాము టెడ్డీ బేర్లలో దాచిన స్పై కెమెరాలు, పెన్నులలో అమర్చిన రహస్య కెమెరాలు, బటన్ కెమెరాలు, బల్లల కింద అమర్చిన రహస్య మైక్రోఫోన్లపై ఆధారపడుతుంటామని చెప్పారు. విచిత్రంగా తాను కూడా నేరం నుంచి తప్పించుకోలేకపోయానన్నారు. ఎందుకంటే తన పుస్తకాన్ని తర ప్రమేయం లేకుండానే అక్రమంగా కాపీ చేసి మార్కెట్లో అమ్మారని రజనీ వెల్లడించారు. తన కేసుని పరిష్కరించే ప్రయత్నం చేస్తుండగా..బెదరింపులు కూడా వచ్చాయన్నారు. అయితే తాను న్యాయ మార్గాన్ని ఎంచుకుని గెలిచినట్లు తెలిపారు. ఏ నిజం బయటపెట్టాలో తెలియాలి..రహస్యాలను వెలికి తీసే వృత్తే అయినప్పటికీ..ప్రతి నిజాన్ని బయటపెట్టాల్సిన అవసరం లేదని అంటోందామె. ఎందుకంటే ఆ నిజాన్ని బయటపెడితే కలిగే పరిణామాలపై అవగాహన ఉండాలని నొక్కి చెబుతోంది. ఈ వృత్తి కేవలం దొంగలను, నేరస్తులను పట్టుకోవడమే కాదు, మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడంపై పట్టు అందిస్తుందట. అందువల్ల కొన్ని కేసులు చేధించే క్రమంలో కుటుంబాలను కాపాడేలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని అన్నారు. ఇంతలా తిరుగులేని లేడి డిటెక్టివ్గా ఏకంగా 80 వేలకు పైగా కేసులను చేధించిన మీరు తెరపై మీ పాత్రరె పోషించగలరా అని ప్రశ్నించగా..వెంటనే ఆమె నవ్వుతూ..నటించొచ్చేమో కానీ, నిజ జీవితంలో డిటెక్టివ్గా మారడం అనేది అంత ఈజీ కాదు. అలాగే ఆయా కేసు భావోద్వేగ భారాన్ని మోయడం అంత సులభం కాదని కూడా అన్నారు. ఇవన్నీ పుస్తకాల నుంచో, సినిమాల నుంచో నేర్చుకునేవి కాదని అన్నారామె. చివరగా డిటెక్టివ్గా రాణించాలంటే చక్కటి ధైర్యం, సహనం, సత్యాన్ని కనుగొనే వరకు వదలని పట్టుదల చాలా అవసరమంటూ తన సంభాషణను ముగించారు. (చదవండి: ఐఐటీ స్టూడెంట్ కాదు.. కానీ ఏకంగా రూ..4.8 లక్షలు..! కనీసం బీటెక్ కూడా..) -
నారీ గూఢచారి
తొలి మహిళా ప్రైవేట్ డిటెక్టివ్ రజనీ పండిత్ ఇప్పటివరకు 80 వేలకు పైగా కేసులను పరిశోధించి, పరిష్కరించారు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ప్రసిద్ధ ఫేస్బుక్ పేజీలో రెండు రోజుల క్రితం అక్టోబర్ 31 వతేదీ నాడు ఒక మహిళ ఒక పోస్ట్ పెట్టింది. పదిహేడు గంటల్లో పద్నాలుగు వేల లైక్స్, వెయ్యి షేర్లతో వైరల్ అయింది ఈ పోస్ట్. ఆ పోస్టు సారాంశం ఇదీ. ‘‘చాలా ఏళ్ల కిందట.. ఒక డబుల్ మర్డర్ జరిగింది. తండ్రి, కొడుకు ఇద్దరూ హత్యకు గురయ్యారు. ఛేదించడానికి చిన్న క్లూ కూడా లేదు. ఈ కేస్కు సంబంధించి ఎందరో అనుమానితులు. ఫిల్టర్ చేయగా చేయగా ఒక మహిళ మిగిలింది. ఆమే.. కాదో తేల్చుకోవాలి. ఎలా? వాళ్లింట్లో పని మనిషిగా చేరాను. ఓ ఆర్నెల్లు ఉన్నాను. ఆమెకు నమ్మిన బంటుగా మారడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాల్సి వచ్చిందో. ఆమె జబ్బు పడితే సపర్యలూ చేశా. అట్లా నెమ్మది నెమ్మదిగా ఆమె నమ్మకాన్ని సాధించా. కానీ ఒకసారి.. అంతా నిశ్శబ్దంగా ఉంది. జరగబోయే సంభాషణ రికార్డ్ చేద్దామని రికార్డర్ ఆన్ చేశా.. రహస్యంగా. క్లిక్మన్న సౌండ్ను విని ఆమె నన్ను అనుమానించడం మొదలుపెట్టింది. బయటకు వెళ్లనివ్వకుండా ఆపేది. దాదాపుగా హౌస్ అరెస్ట్ చేసేసింది.ఒకరోజు.. ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి, ఆమెకు జరిగిన సంభాషణను బట్టి అతను కిరాయి హంతకుడు అని తేలింది. ఇక ఆ అవకాశం వదులుకోదల్చుకోలేదు నేను. వంటింట్లోకి వెళ్లి కత్తితో కాలు మీద గాటు పెట్టుకున్నా. అదేదో ప్రమాదవశాత్తు జరిగినట్టు నటించి.. రక్తమోడుతున్న కాలుని ఆమెకు చూపించి వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి కట్టుకట్టించుకుని వస్తానని చెప్పి.. ఆమె పర్మిషన్ కోసం చూడకుండా వడివడిగా బయటకు నడిచాను. గేట్ దాటాక పరిసరాల్లో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్కి పరిగెత్తాను. పోలీసులకు ఫోన్ చేసి .. వాళ్లొచ్చేవరకు అక్కడే కాపు కాసి వాళ్లు వచ్చాక వాళ్లతోపాటే మళ్లీ ఆమె ఇంటికి వెళ్లాను. అప్పటికే ఆ కిరాయి హంతకుడికి, ఆమెకు ఏదో వాగ్వివాదం జరుగుతోంది. పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఇదీ నా కెరీర్లో అత్యంత క్లిష్టమైన, కఠినమైన కేస్..’’ పై పోస్టు పెట్టిన ఆ మహిళ పేరు రజనీ పండిత్. మన దేశపు ఫస్ట్ విమెన్ ప్రైవేట్ డిటెక్టివ్. రజనీ తండ్రి సీఐడీలో పనిచేసేవారు. ఆయన ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లుయెన్స్తోనే ఆమె ఇన్వెస్టిగేషన్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. తండ్రి వర్కింగ్ స్టయిల్ను దగ్గరగా చూసి, చూసి తనూ నైపుణ్యమూ సంపాదించుకుంది. డిగ్రీలో ఉన్నప్పుడే పార్ట్టైమ్గా డిటెక్టివ్ వర్క్ మొదలుపెట్టింది. ఆమె చేపట్టిన మొదటికేస్.. తన యజమాని ఇంట్లో జరుగుతున్న వరుస దొంగతనాల దొంగను పట్టుకోవడం. ఆ దొంగ ఎవరో కాదు.. యజమాని కొడుకే అని తన ఇన్వెస్టిగేషన్తో తేల్చేసింది రజనీ. నాటి నుంచి నేటి వరకు రజనీ 80 వేల కేసులకు పైగా పరిశోధించి, పరిష్కరించింది. రెండు పుస్తకాలనూ రాసింది. అందిన పురస్కారాలకు లెక్కేలేదు. 22వ యేట ఆరంభమైన ఆమె పరిశోధన ఇప్పటి దాకా అప్రతిహతంగా సాగుతూనే ఉంది.. పెళ్లి, పిల్లలతో సొంత కుటుంబాన్ని ఏర్పర్చుకోవాలనే ధ్యాస, తలపు లేకుండా. అందుకే అంటుంది.. ‘‘ఇన్వెస్టిగేషనే నా జీవన సహచరుడు’’ అని. అంత నిబద్ధత రజనీకి తన పనిపట్ల. కాబట్టే ఆమెను ‘‘దేశీ షెర్లాక్’’ అంటారంతా! – శరాది -
‘అలా హంతకులను అరెస్టు చేయించాను’
నాపై అనుమానం రావడంతో నన్ను బయటికి వెళ్లకుండా ఆమె అడ్డుకుంది. కానీ ఓ రోజు హంతకుడు సరాసరి ఆమె ఇంటికే వచ్చాడు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక కత్తితో కోసుకున్నా. ఆ తర్వాత ఇద్దరిని అరెస్టు చేయించా- ప్రైవేట్ డిటెక్టివ్ రజనీ పండిట్ భారత్లో మొట్టమొదటి ప్రైవేట్ మహిళా డిటెక్టివ్గా గుర్తింపు పొందారు మహారాష్ట్రకు చెందిన రజనీ పండిట్. సీఐడీ ఆఫీసర్ కూతురైన రజనీకి.. ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తి చిన్ననాటి నుంచే మెండుగా ఉండేదట. ఆ ఆసక్తే తనను డిటెక్టివ్గా మార్చిందని, సుమారు 80 వేల కేసులు పరిష్కరించేలా చేసిందని రజనీ పేర్కొన్నారు. అలా మొదలైంది.. ‘కాలేజీలో చదువుకునే రోజుల్లో పార్ట్ టైమ్ చేసేదాన్ని. అక్కడే పనిచేసే ఓ మహిళ తన ఇంట్లో తరచుగా దొంగతనం జరుగుతోందని చెప్పింది. కొత్త కోడలిపైనే తనకు అనుమానమట. అయితే ఆధారాలు లేకుండా ఒకరిని నిందించడం తప్పు కదా.. అందుకే మీ ఇంట్లో దొంగతనాలకు కారణం ఎవరో కనిపెడతానని తనకు చెప్పాను. రోజు వాళ్ల వీధిలో కాపలా కాశాను. ఆమె కొడుకుపై అనుమానం వచ్చింది. అన్ని విషయాలు నిర్ధారించుకున్న తర్వాత నేనెవరో చెప్పకుండా.. మీ ఇంట్లో నుంచి డబ్బులు పోవడానికి కారణం నువ్వే కదా అని అతడిని నిలదీశాను. కాసేపటి తర్వాత నేరం ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడి తల్లికి చెప్పి.. వాళ్ల కోడలిని నిర్దోషిగా నిరూపించాను. అలా 22 ఏళ్ల వయస్సులో.. ఓ దొంగతనం కేసుతో నా కెరీర్ మొదలైందంటూ రజనీ పంచుకున్న అనుభవాలను.. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా లైక్లు, షేర్లతో వైరల్గా మారింది. పనిమనిషిలా ఆరునెలలు.. ‘అది జంట హత్యలకు సంబంధించిన కేసు. తండ్రీ కొడుకులిద్దరు హత్యకు గురయ్యారు. కానీ హంతకులను పట్టుకుందామంటే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే ఓ మహిళపై మాత్రం అనుమానం ఉంది. అందుకే సదరు మహిళ ఇంట్లో పనిమనిషిగా చేరాను. అదే సమయంలో ఆమె అనారోగ్యానికి గురైంది. ఇదేదో నాకు కలిసి వచ్చే అంశమే అనుకున్నా. ఆమె కోలుకునేందుకు సాయం చేస్తూ నెమ్మదిగా ఆమె నమ్మకాన్ని సంపాదించా. అయితే ఓరోజు ఉన్నట్టుండి అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో నా రికార్డర్ ఆన్ అయిన క్లిక్ సౌండ్ వినిపించింది. దీంతో ఆమెకు అనుమానం కలిగింది. అప్పటి నుంచి నన్ను బయటికి వెళ్లకుండా అడ్డుకుంది. అలా ఆరునెలలు గడిచాయి. ఒకరోజు ఆ ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. వారి సంభాషణ విన్న తర్వాత అతడే హంతకుడు అని, అతడికి సహకరించిన మరో వ్యక్తి సదరు మహిళేనని నాకు అర్థమయింది. కానీ తప్పించుకోవడం ఎలాగో తెలీలేదు. అందుకే నా పాదంపై కత్తితో కోసుకున్నా. రక్తం కారుతోంది.. నన్ను రక్షించండి అంటూ ఏడ్చాను. బ్యాండేజ్ తెచ్చుకుంటానని చెప్పి బయటికి పరిగెత్తాను. వెంటనే ఎస్టీడీ బూత్కు వెళ్లి నా క్లైంట్కి ఫోన్ చేసి పోలీసులను తీసుకురావాలని చెప్పాను. ఆ ఇద్దరు దోషులని అరెస్టు చేయించాను’ అంటూ తన కెరీర్లో డీల్ చేసిన అత్యంత సంక్లిష్టమైన కేసు ఇదేనని రజనీ పేర్కొన్నారు. నేను దేశీ షెర్లాక్ని... తన కెరీర్లో సుమారు 80 వేల కేసులు పరిష్కరించానన్న రజనీ తనని తాను దేశీ షెర్లాక్(డిటెక్టివ్)గా చెప్పుకోవడానికి ఇష్టపడతానన్నారు. కష్టానికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు పొందిన తనకు.. ఎన్నోసార్లు బెదిరింపులు కూడా వచ్చేవని గుర్తుచేసుకున్నారు. అయితే చేసే పని పట్ల నమ్మకం, నిజాయితీ ఉండి.. కొంచెం ధైర్యం ఉంటే చాలు ఎవరైనా డిటెక్టివ్గా దూసుకుపోవచ్చని సలహా ఇచ్చారు. -
భారత తొలి మహిళా డిటెక్టివ్ అరెస్టు
సాక్షి, ముంబై : భారత తొలి మహిళా ప్రైవేట్ డిటెక్టివ్ రజనీ పండిట్(54)ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మార్గాల ద్వారా కాల్ రికార్డింగ్స్ను టెలికాం కంపెనీల నుంచి రజనీ తెప్పించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాల్ డిటెయిల్ రికార్డ్స్(సీడీఆర్)లను అక్రమ మార్గాల్లో సంపాదించి, అమ్ముతున్న నలుగురు డిటెక్టివ్ల గ్యాంగ్ను పోలీసులు గురువారం పట్టుకున్నారు. వారిలో ఒకరైన సమ్రేష్ ఝా సీడీఆర్లను రజనీ తెమ్మన్నారని, అందుకు గానూ భారీ మొత్తంలో డబ్బు ఇస్తానని చెప్పారని పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీంతో శుక్రవారం రజనీ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రజనీ తండ్రి పోలీసు డిపార్ట్మెంట్ పని చేసి రిటైరయ్యారు. ఐదుగురు వ్యక్తుల సీడీఆర్లు కావాలని సమ్రేష్ను రజనీ అడిగారనడానికి బలమైన సాక్ష్యాధారాలున్నాయని థాణే పోలీసు చీఫ్ పరంబీర్ సింగ్ చెప్పారు. రాకెట్లో ఆమె హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోందని వెల్లడించారు. సీడీఆర్ల స్కాంతో సంబంధం ఉన్న వ్యక్తులు దేశంలో ఎక్కడవున్నా పట్టుకొని తీరుతామని చెప్పారు. నవీ ముంబైలోని కేంద్రంగా పని చేస్తున్న సంతోష్ పండ్గాలే(34), ప్రశాంత్ సోనావానే(34)లను కూడా అరెస్టు చేసినట్లు వివరించారు. రజనీ పండిట్ నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు తెలిపారు. మరికొందరు డిటెక్టివ్లను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పేరు తెలపడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి చెప్పారు. -
లేడీ జేమ్స్బాండ్
ఆడవాళ్లకి ఆరాలు తీసే మనస్తత్వం ఉంటుందని జోకులేస్తుంటారు కొంతమంది. అయితే అది నవ్వాల్సిన విషయం కాదు, కామెంట్ చేయాల్సిన విషయం అంతకన్నా కాదు అంటారు రజనీ పండిట్. ఎందుకంటే ఆరాలు తీసే ఆ లక్షణమే ఆమె వృత్తిగా మారింది. ఆమెను డిటెక్టివ్గా మార్చింది. సెన్సేషనల్ లేడీ డిటెక్టివ్ అంటూ కితాబునిచ్చింది. ఎన్నో ప్రశంసలను, పురస్కారాలనూ తెచ్చిపెట్టింది. ముంబైలోని శివాజీ పార్క్కి దగ్గరలో ఉంది రజనీ పండిట్ ప్రైవేట్ డిటెక్టివ్ ఆఫీసు. ఎంతో క్లిష్టమైన కేసులకు సైతం అతి తక్కువ ఫీజు తీసుకుంటారు రజని. అందుకే ఆమెకు డిటెక్టివ్గానే కాక మంచి మనిషిగా కూడా పేరుంది. ఆవిడ ఓ సాహస కెరటం. తన పనితనం గురించి తెలుసుకోవాలంటే ఆవిడ రాసిన ఫేసెస్ బిహైండ్ ఫేసెస్, మాయాజాల్ అనే పుస్తకాలు చదివితే సరి! రజని పుట్టి పెరిగిందంతా మహారాష్ట్రలోని థానే జిల్లాలోనే. ఆవిడ తండ్రి ఓ సీఐడీ ఇన్స్పెక్టర్. ఆయన ప్రభావం రజని మీద చిన్ననాటనే పడింది. తండ్రి విచారణ జరిపే కేసులను ఆసక్తిగా పరిశీలించేవారు రజని. ఆయనను అడిగి మరీ కొన్ని విషయాలు తెలుసుకునేవారు. దాంతో ఆమెకి ఇన్వెస్టిగేషన్ పట్ల ఆసక్తి పెరిగిపోతూ వచ్చింది. ఆ ఆసక్తితోనే కాలేజీలో తన స్నేహితురాలి సమస్యను పరిష్కరించారామె. ఆ అమ్మాయి కొందరు చెడ్డ అబ్బాయిలతో తిరుగుతూ ఉండేది. ఎంత చెప్పినా వినేది కాదు. దాంతో అటెండర్ని అడిగి ఆ అమ్మాయి అడ్రస్ సంపాదించారు రజని. వాళ్ల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో విషయం చెప్పారు. వాళ్లు నమ్మకపోతే తన సొంత డబ్బులతో ట్యాక్సీలో తీసుకెళ్లి మరీ ఆ అమ్మాయి చేసే పనులు చూపించారు. అప్పుడా అమ్మాయి తండ్రి ‘నువ్వు డిటెక్టివ్వా?’ అని అడిగాడు. ఆ ప్రశ్న రజని మనసులో బలంగా నాటుకుపోయింది. ఆమెను డిటెక్టివ్గా మార్చేందుకు దోహదపడింది. ఆ తర్వాత మరో మహిళ సమస్యను కూడా తన తెలివితేటలతో పరిష్కరించిన తర్వాత ఫుల్టైమ్ డిటెక్టివ్గా మారిపోవాలని నిర్ణయించుకున్నారు రజని. అడుగడుగునా సవాళ్లే... డిటెక్టివ్గా పని చేయడం అంత తేలికైన పని కాదు. ఒక్కో కేసు ప్రాణాల మీదకు తెచ్చేది. బెది రింపులు, వార్నింగులకు కొదువే లేదు. అయినా ఎన్నడూ వెనకడుగు వేయలేదు రజని. భయమనేది తన డిక్షనరీలోనే లేదంటారామె. భార్యను చంపా లనుకున్న భర్త ప్లాన్ను భగ్నం చేసినా... మరో పురుషుడితో సంబంధం పెట్టుకుని తన సొంత కొడుకునే కిడ్నాప్ చేసి, ఆపైన భర్తను డబ్బుకోసం బ్లాక్ మెయిల్ చేసిన భార్య పన్నాగాన్ని బయటపెట్టినా... సినిమా వాళ్ల అఫైర్ల కూపీ లాగినా... వ్యాపారవేత్తల మోసాలను బహిరంగపర్చినా... మిస్సింగ్ కేసుల మిస్టరీలు ఛేదించినా... హత్య కేసుల అంతు చూసినా... ఏం చేసినా పర్ఫెక్ట్గా చేశారు రజని. అనుకున్నదానికంటే వేగంగా ఉత్తమ ఫలితాలను అందించారు. అందుకే ఊహించనంత త్వరగా ఆమె పేరు దేశమంతా పాకిపోయింది. ఐదారు అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ‘లేడీ జేమ్స్బాండ్’ పేరుతో ఆమె మీద డాక్యుమెంటరీ సైతం తయారయ్యింది. నలభై ఏడేళ్ల వయసులో సైతం ఇప్పటికీ చలాకీగా తిరుగుతూ, చకచకా కేసుల్ని పరిష్కరించే రజని పనితనం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. తన దగ్గరకు వచ్చేవాళ్లందరి సమస్యలూ తీర్చడంలో సంతోషాన్ని పొందే రజని... తన సొంత సమస్యలు వృత్తికి అడ్డు కాకూడదనుకున్నారు. అందుకే తన వ్యక్తి గత జీవితానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అల వాటు చేసుకున్నారు. చివరికి పెళ్లి సైతం వద్దను కున్నారు. అంత త్యాగం అవసరమా అని ఎవరైనా అంటే... ‘పెళ్లే జీవితం అని నేను అనుకోలేదు. పెళ్లిలోనే సంతోషం దొరకుతుందని నాకెప్పుడూ అనిపించనూ లేదు. కేసు సాల్వ్ చేసినప్పుడు కలిగే సంతోషం ముందు మిగతావన్నీ దిగదుడుపే నాకు’ అంటారామె మందహాసం చేస్తూ. నిజమే. పరులకు సాయపడటంలో సంతోషాన్ని వెతుక్కునేవారికి పర్సనల్ లైఫ్ ఎప్పుడూ ముఖ్యం కాదు... కాబోదు!!


