breaking news
Rain Industries
-
రెయిన్ ఇండస్ట్రీస్- కేపీఐటీ టెక్.. స్పీడ్
స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా కాల్సైన్డ్ పెట్రోలియం కోక్ తయారీ కంపెనీ రెయిన్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ సొల్యూషన్ల సంస్థ కేపీఐటీ టెక్నాలజీస్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. రెయిన్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో రెయిన్ ఇండస్ట్రీస్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 79 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 81ను అధిగమించింది. క్యూ1(జనవరి-మార్చి)లో రెయిన్ నికర లాభం 55 శాతం జంప్చేసి రూ. 106 కోట్లను దాటింది. అయితే అమ్మకాలు 9 శాతం క్షీణించి రూ. 2898 కోట్లకు పరిమితమయ్యాయి. ఇబిటా 24 శాతం ఎగసి రూ. 460 కోట్లను తాకింది. కంపెనీ జనవరి-డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. గత వారం రోజులుగా ఈ కౌంటర్ నిలకడను చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్లో తొలి అర్ధగంటలోనే 3 లక్షల షేర్లు చేతులు మారినట్లు తెలియజేశారు. గత ఐదు రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 57,000 షేర్లేకావడం గమనార్హం! కేపీఐటీ టెక్నాలజీస్ సీఎల్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్ తాజాగా కంపెనీకి చెందిన దాదాపు 20 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు కేపీఐటీ టెక్నాలజీస్ పేర్కొంది. షేరుకి రూ. 46.91 ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో అమ్మకందారులు కరువుకావడంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కేపీఐటీ టెక్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 49.25 వద్ద ఫ్రీజయ్యింది. గత ఐదు రోజుల్లోనూ 20 శాతం ర్యాలీ చేసింది. కాగా.. గతేడాది క్యూ4లో కేపీఐటీ టెక్నాలజీస్ నికర లాభం 23 శాతం ఎగసి రూ. 38 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 11 శాతం వృద్ధితో రూ. 501 కోట్లను తాకింది. -
దలాల్ స్ట్రీట్ లో తెలుగు ' షేర్' ఖాన్లు
ఏడాదిలో రెట్టింపుపైగా పెరిగిన షేర్లు ► 208 శాతం పెరిగిన రెయిన్ ఇండస్ట్రీస్ ► నిఫ్టీ, సెన్సెక్స్ల కంటే మంచి పనితీరు ► బలమైన షేర్లలోనే ఇన్వెస్ట్ చేయాలంటున్న నిపుణులు అమరావతి, సాక్షి బిజినెస్ ప్రతినిధి : ఇండెక్స్లు నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేస్తూ రికార్డులు సృష్టిస్తుంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొన్ని కంపెనీల షేర్లు కూడా ఇన్వెస్టర్లకు లాభాలు కురిపిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో నిఫ్టీ–50 ఇండెక్స్ 15 శాతం లాభాలివ్వగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు షేర్లు రెట్టింపునకు పైగా పెరిగాయి. గడిచిన ఏడాది కాలంలో నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 33 శాతం, నిఫ్టీ స్మాల్క్యాప్ ఇండెక్స్లు 40 శాతం మేర వృద్ధి చెందాయి. కానీ ఇదే సమయంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పరిధిలోకి వచ్చే 10కి పైగా తెలుగు కంపెనీల షేర్లు ఇండెక్స్ల కంటే రెట్టింపుపైగా లాభాలను అందించాయి. సిమెంట్ తయారీ సంస్థ రెయిన్ ఇండస్ట్రీ ఏడాది కాలంలో 208 శాతంపైగా పెరిగి ఇన్వెస్టర్లకు భారీగా లాభాలను అందించింది. సిమెంట్ రంగానికి చెందిన రెయిన్ ఇండస్ట్రీస్ షేరు ధర గతేడాది ఏప్రిల్లో రూ.30 వద్ద ఉంటే ఇప్పుడిది రూ.104 వరకు పెరిగింది. ఇదే సమయంలో విశాక ఇండస్ట్రీస్ 165%, ఆంధ్రా షుగర్స్ 141%, హెరిటేజ్ ఫుడ్స్ 115%, నాట్కో ఫార్మా 110%, తాజ్ జీవీకే 100% పెరిగి ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేశాయి. అదే విధంగా అవంతి ఫీడ్స్ 94%, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ 89%, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ 83%, నవభారత్ వెంచర్స్ 77% షేర్లు స్మాల్ అండ్ మిడ్క్యాప్ ఇండెక్స్ల కంటే రెట్టింపు లాభాలను అందించాయి. మరింత బుల్ రన్.. ప్రస్తుత దేశీయ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ చాలా బాగుందని, మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ సంస్థాగత మదుపుదారులు దేశీయ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు మార్కెట్ సెంటిమెంట్ను మరింత పటిష్టం చేస్తున్నాయని కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ తూనుగుంట్ల జగన్నాథం తెలిపారు. మధ్యలో వచ్చే చిన్నస్థాయి సర్దుబాట్లను ఇన్వెస్ట్మెంట్కు ఉపయోగించుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం నిఫ్టీ ఇండెక్స్ విలువ 23 పీఈ వద్ద ట్రేడ్ అవుతున్నా అంతగా ఆందోళన చెందనవసరం లేదన్నారు. 2008లో 29 పీఈ, 2001 ర్యాలీలో 31 పీఈ వరకు పెరిగిన సంగతిని గుర్తు చేశారు. 1992, 1994లో జరిగిన ర్యాలీలో ఏకంగా 50 పీఈ వరకు సూచీలు పెరిగాయన్నారు. ‘‘సాధారణంగా మన సూచీలు 18 పీఈ వద్ద ట్రేడ్ అవుతుంటాయి. దాంతో పోలిస్తే కొద్దిగా అధి క ధర వద్ద ట్రేడ్ అవుతున్నా.. అంతర్జాతీయంగా బిజినెస్ సెంటిమెంట్ మెరుగవుతుండటంతో అంతగా ఆందోళన చెందనవసరం లేదు. అయితే మార్కెట్తో పాటు పెరుగుతున్న షేర్లలోనే ఇన్వెస్ట్ చేయాలి. అప్పులు భారీగా ఉన్న చిన్న షేర్లలో ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకోవద్దు’’ అని ఆయన సూచించారు. -
రెయిన్ ఇండస్ట్రీస్ లాభంలో స్వల్ప క్షీణత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్, కార్బన్ ప్రొడక్టులను ఉత్పత్తి చేసే రెయిన్ ఇండస్ట్రీస్ మార్చితో ముగిసిన తొలి త్రైమాసిక నికర లాభంలో 7% క్షీణత నమోదయ్యింది. గతేడాది ఇదే కాలానికి రూ. 35 కోట్లుగా ఉన్న లాభం (కన్సాలిడేటెడ్) ఇప్పుడు రూ. 32 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో ఆదాయం రూ. 274 కోట్ల నుంచి రూ. 308 కోట్లకు పెరిగింది. కార్బన్ ప్రోడక్టుల మార్జిన్లు తగ్గడం, సిమెంట్ విభాగం ఉత్పత్తి తగ్గడం లాభాలు క్షీణించడానికి ప్రధాన కారణంగా కంపెనీ పేర్కొంది.